Friday, August 30, 2013

పెన్నేటి పద్యం-కాశీవరపు వెంకటసుబ్బయ్య

-అంధ్ర ప్రభ దినపత్రిక 26-08-2013 సాహితీగవాక్షం
 చిత్రం: కడపజిల్లా సిద్ధవటం దగ్గర పెన్నానది ఒడ్డున కోట    

రాయలసీమ ప్రాథమ్యం నీళ్ళు! నీళ్ళు! నీళ్ళు! - బండి నారాయణస్వామి

రాజధానిని నిర్మించుకోవచ్చు కానీ, నీళ్ళను నిర్మించుకోలేం.
నేడు నడుస్తున్న లేదా నడుపుతున్న ఉద్యమాల వెనక సిద్ధాంతాలు లేవు. తాత్విక భూమికలు లేవు. త్యాగాలు లేవు; అయితే ఆకాంక్షలూ లేకపోతే ఆగంతమూ తప్ప! రాచరికంలో యథారాజా తథాప్రజా చెల్లుబాటు అయింది కానీ, ఎన్నికల వ్యవస్థలో యథాప్రజా తథారాజా అనేదే చెల్లుబాటు అవుతుంది.
రాజశేఖర రెడ్డి, టీఆర్ఎస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకున్నప్పుడూ సీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లేశారు. చంద్రబాబు టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడూ సీమాంధ్ర ప్రజలు తెలుగుదేశానికి ఓట్లేశారు. తెలంగాణ ఇస్తే అడ్డుకోబోమని చెప్పిన వైకాపాకు కూడా సీమాంధ్ర ప్రజలు ఉప ఎన్నికల్లో ఓట్లేశారు. కానీ హైదరాబాద్ విషయం వచ్చేటప్పటికి సీమాంధ్ర ప్రజల ఆసక్తులు మారిపోయాయి. విభజన క్రమంలో హైదరాబాదు రెవెన్యూలో వాటా అడిగితే తప్పులేదు. కొత్త రాజధాని కోసం కేంద్రాన్ని ప్యాకేజీ కోరితే తప్పులేదు. కానీ హైదరాబాదును అడ్డం పెట్టుకుని సమైక్యవాదులు రాయలసీమ నీటి ప్రాథమ్యాన్ని విస్మరించడం విషాదకరం.

ముఖ్యంగా అనంతపురం సాగునీటి సమస్యను అనంతపురం సమైక్యవాదులు విస్మరించడం దారుణం. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నది పట్టణ ప్రజలు మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు. ఉద్యమంలో ఏ తరగతి ప్రజలు పాల్గొంటారో ఆ వర్గపు ఆకాంక్షలే ప్రతిఫలించడం ఒక నైజమే కావచ్చు. కానీ కడుపు నిండిన వాడు మిఠాయి కోరుకోవడం కన్నా కడుపు నిండని వాని పక్షం వహించడం మానవ న్యాయం. ఆ మానవ న్యాయాన్ని పట్టణ మధ్యతరగతి ఉద్యమకారులు తమ పల్లెటూరి రైతుల నీటి ఆకాంక్షల పట్ల ప్రదర్శించవలసిన అవసరమొచ్చింది.


అది సమైక్యాంధ్ర కానీ, ప్రత్యేక రాయలసీమ కానీ, రాయల తెలంగాణ కానీ...! ఏ విభజన అయినా, ఉద్యమమైనా సాగునీటి కేంద్రంగానే సాగవలసిన చారిత్రక సందర్భం ఇప్పుడు తారసపడింది. డెబ్బై శాతానికి చెందిన రైతుల నీటి సమస్యను ఉద్యమ ప్రాథమ్యంగా స్వీకరించి, హైదరాబాదు ఆకాంక్షను రెండవ ఆసక్తిగా గుర్తించినప్పుడే రాయలసీమ గడ్డకు న్యాయం జరుగుతుంది. ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుకున్నట్లవుతుంది. అలా కాకుండా హైదరాబాదు మాత్రమే ఏకమంత్రమన్నట్లు ఉద్యమిస్తే రాయలసీమ రైతుకు తీరని అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం.

భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయిన అనంతపురం పరిస్థితి ఇప్పటికీ దారుణంగా ఉంటే; పదహైదేళ్ళ తరువాత ఎలా ఉంటుందో ఊహించుకుంటే మరింత భయంకరంగా ఉంటుంది. అనంతపురం రైతుకు కావాల్సిన నూరు టీఎంసీల నీటి గురించి పోరాటానికి ఇదే సరైన సందర్భం. ఈ విభజన సందర్భాన్ని నీటి పోరాటానికి అన్వయం చేయలేని ఉద్యమకారులు భవిష్యత్ తరాలకు ఏం సమాధానం చెబుతారు? నీళ్ళే నాగరికత అంటాడు ఒక అనంతపురం రచయిత.


భవిష్యత్తులో చరిత్రహీనులు కాకుండా తమను తాము కాపాడుకోవాలంటే ఉద్యమకారులు అనంతపురం నీళ్ళ గురించి డిమాండు చెయ్యక తప్పదు. కేంద్ర ప్రభుత్వం నుంచీ, ట్రిబ్యునల్స్ నుంచీ హామీలు, వాగ్దానాలు పొందేవరకూ ఉద్యమించక తప్పదు. తుంగభద్రలో ఎనభై శాతం నీటికి బదులు ఎనభై శాతం విద్యుత్తును కోరుకున్నాం. ఆ రకంగా విద్యుత్తేమో రాష్ట్రానికి అంతకీ చెందితే, నీళ్ళు లేని నష్టమేమో రాయలసీమ మాత్రమే భరించవలసి వచ్చింది. ఇదీ రాయలసీమ రైతుకు జరిగిన మోసం. ఈ మోసాన్ని ఎదుర్కోవడానికి ఇదే సరైన చారిత్రక సందర్భం. పట్టణవాసులు తమ ప్రయోజనాల కోసం పోరాడటంలో తప్పులేదు. కానీ తమకు అన్నం పెట్టే రైతు ప్రయోజనాలను పట్టించుకోకపోతే గ్రామ వివక్షకు పాల్పడిన వాళ్ళం అవుతాం. చరిత్ర క్షమించదు. పట్టణ వాసులు నీళ్ళు లేకపోతే డబ్బుతో కొనుక్కుని తాగుతారు. కానీ రైతులు ఎన్ని నీళ్ళను కొని వరి మడులు తడపగలరు? ఎన్ని నీళ్ళను కొని వేరుశనగ పండించగలరు?

పట్టణ ప్రజలారా! విద్యావంతులారా! మన ఉద్యమ ఫలాలను మొదట మన రాయలసీమ రైతులకే దక్కనిద్దాం. అనంతపురం జిల్లాకు నీటి కళ తెచ్చి మన అన్నదాత రుణం తీర్చుకుందాం. సమైక్యాంధ్రలో ఉంటే అనంతపురానికి నీళ్ళు వస్తాయా? సీమాంధ్ర వస్తే అనంతపురానికి నీళ్ళు వస్తాయా? ప్రత్యేక రాయలసీమ వస్తే అనంతపురానికి నీళ్ళు వస్తాయా?... లేక కర్ణాటకలో కలిస్తే అనంతపురానికి నీళ్ళు వస్తాయా?
నీళ్ళు! నీళ్ళు! నీళ్ళు! అదే మన ప్రాథమ్యం. ఏ ఉద్యమమైనా నీటి ప్రాతిపదికగా మాత్రమే చేద్దాం!

రాజధానిని నిర్మించుకోవచ్చు కానీ, నీళ్ళను నిర్మించుకోలేం.
                                                                                                  - బండి నారాయణస్వామి

రాయల తెలంగాణా జె.సి, ఏరాసు ప్రతాప్‌ రెడ్డి, టి.జి.వెంకటేశ్‌ ల పిచ్చి ప్రేలాపన

రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలవుతుందని 2009 డిసెంబరులో ప్రకటన వచ్చి నప్పుడు, విభజనను సి.డబ్ల్యూ.సి కేంద్ర ప్రభుత్వ సమన్వయ కమిటీ అంగీకరించినట్లు 2013 జూలై 30న ప్రకటన వెలువడినపుడు సమైక్య రాష్ట్రమే కావాలనిఉద్యమాలు జరిగాయి, జరుగుతున్నాయి. విచిత్రంగా కొంతమంది రాజకీయ నాయకులు వ్యక్తిగతమని చెప్పి రాయల తెలంగాణా అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆధ్యులో-అల్పులో తెలియదు గానీ జె.సి.దివాకర రెడ్డి, ఏరాసు ప్రతాప్‌ రెడ్డి, టి.జి.వెంకటేశ్‌ మొదట ఈ ప్రస్తావన తెచ్చారు. కొంత అటు ఇటుగా, యం.ఐ.యం. కూడా దీన్ని నెత్తి కెక్కించుకొంది. విభజన అంశాన్ని ఎలా పరిష్కరించాలి? హైదరాబాద్‌ సమస్య ఏమిటి? నీటి పంపకాలస్థితి ఎలా? అన్న వాటికి సమాధానం చెప్పలేని దుస్థితిలో పడిపోయిన కాంగ్రెసు హైకమాండ్‌, కేంద్ర ప్రభుత్వంలోని మరుగుజ్జులు రాయల తెలంగాణ అయితే ఎట్లా ఉంటుంది? పూర్తిగా కాకపోయినా కర్నూలు, అనంతపురం జిల్లాలను కలపి 12 జిల్లాలతో తెలంగాణా ఇస్తే ఎలా ఉంటుంది? అని పిచ్చి ప్రేలాపనలు, చెత్త ప్రశ్నలు వేస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకొని దివాకర్‌ రెడ్డి రోజూ అదే పాటపాడుతున్నారు. తెలంగాణావాదులు మీరు మాతో వద్దు అంటూ ఉంటే కాదు వెంటపడుతాం అంటున్నారు.

రాయలసీమ విశిష్ట సంస్కృతి - ప్రత్యేకతలు: సీమాంధ్ర పదప్రయోగమే రాయలసీమ ఆస్థిత్వాన్ని మరుగున పర్చుతుంటే ఇక రాయలతెలంగాణా అంటున్నవారు ముందు రాయలసీమ అంటే ఏమిటి? అది ఎలా వచ్చింది? దాని విశిష్టత, ప్రత్యేకత ఏమిటి అన్న దాన్ని తెలుసుకుంటే ఇలా మాట్లాడరు.7వ శాతబ్దం నాటి తూర్పు చాళుక్యుల పాలన చూచినా, 15వ శతాబ్దం నాటి విజయనగర రాజుల పాలన చూచినా, బ్రిటిష్‌ ఇండియాలో నైజాం పాలన చూచినా, కంభం పాటి సీనియర్‌ ఆంధ్రుల చరిత్ర -సంస్కృతి చూచినా, సురవరం ప్రతాప్‌రెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర చూచినా రాయల సీమ ప్రత్యేకతలు, ప్రజల మద్య ఉన్న ఆచార, వ్యవహారాలు, సాంప్రదాయ సంగీత, సాహిత్య ఆదాన -ప్రదానాలు, ప్రకృతి పరమైన సారూప్యతలు, సామీప్యతలు, పరాయి పాలకుల దోపిడీ, పీడనలు, పాలెగాండ్ర ఏలుబడులు, పౌరాణిక, ఆధ్యాత్మకతల ఉమ్మడి సంస్కృతి అర్ధమవుతుంది.
ఇవేమీ పట్టించుకోకుండా నేను, నా రాజకీయ-ఆర్థిక భవిష్యత్‌, నా ఆస్థులు, నా కులం రాజకీయాలు, మా మత రాజకీయాలు మాత్రమే మనగలగాలని పాకులాడే సంకుచితులు మాత్రమే ఇలాంటి అశాస్త్రీయమైన, అసహేతుకమైన, ఆచరణ యోగ్యం కాని మతిలేని ప్రతిపాదనలు తెరపైకి తెస్తారు. నవంబరు 17-18 తేదీల్లో నంద్యాలలో కడప కోటి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభలో ఈ ప్రాంతానికి రాయలసీమ పేరు పెట్టాలని చిలుకూరి నారాయణరావు ప్రతిపాదించారు. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
''వదరుబోతు'' పత్రికాసంపాదకులు పప్పూరి రామాచార్యులు, గుత్తి కేశవపిళ్ళే, కడప కోటిరెడ్డి, కల్లూరి సుబ్బారావు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, టి.యస్‌.రామక్రిష్ణా రెడ్డి మొదలైన మొదటితరం నాయకులూ, రాళ్ళపల్లి, గడియారం వెంకట శేషశాస్త్రి, పుట్టపర్తి నారాయణా చార్యులు, విద్వాన్‌విశ్వం, తిరుమల రామచంద్ర లాంటి కవులు, విద్వాంసులు రాయలసీమ అన్న పేరుకు విస్తృత ప్రచారం కల్పించారు. గతంలో హిరణ్యక రాష్ట్రం, ములికినాడు, రేనాడు పేర్లు కల్గిన ఈ ప్రాంత ఆధునిక చరిత్రలో రాయలసీమగా స్థిరపడింది. గత చరిత్ర అంతా కాకపోయినా విజయనగర రాజుల కాలం నుండి నేటి వరకూ రాయలసీమ చరిత్రను పరికిస్తే ఎన్నో సారూప్యతలు, ఉమ్మడి సంస్కృతులు అవగతమవుతాయి. ఆ విషయాలన్నింటిని చెప్పడం ఈ వ్యాస ఉద్దేశ్యం కాదు. రాయలసీమ ఉమ్మడి సంస్కృతిని ధ్వంసం చేయవద్దు అని చెప్పేటంత వరకే పరిమితం.
1882లో బళ్ళారి నుండి విడిపోయి అనంతపురం జిల్లా ఏర్పడింది. 1910లో కడప జిల్లాలోని కదిరి, ముదిగుబ్బ, నల్లమడ, యస్‌.పి.కుంట, తలపుల, నల్ల చెరువు, ఓడి చెరువు, తదితర ప్రాంతాలను అనంతపురం జిల్లాలో కలిపారు. తమిళనాడులోని ఉత్తర ఆర్కాట్‌ జిల్లాలోని చిత్తూరు, చంద్రగిరి, పలమనేరు ప్రాంతాలను, అలాగే కడప జిల్లాలోని వాయల్పాడు, మదనపల్లి లాంటి తూర్పు కనుమల ప్రాంతాన్ని కలిపి 1911లో చిత్తూరు జిల్లా ఏర్పడింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో బళ్ళారి కర్నాటకలోకి పోయింది. ఇదే కాలంలో కాందనోల్‌ అనే ప్రాంతం కర్నూలుగా స్థిరపడింది. బ్రిటిష్‌ కాలం నుండి కె.సి.కెనాలు కడప-కర్నూలు జిల్లాలను కలిపి అనుసంధానం చేస్తూనే ఉన్నది. క్రిష్ణా, పెన్నాల సంగమంగా కడప, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. బళ్ళారి, గుంతకల్లు, గుత్తి, కడప, సిద్దవటంల నుండి నెల్లూరు జిల్లాతో పెనవేసుకొని పెన్నా నది ప్రవహిస్తున్నది. స్త్రీ నడుంకు బిగించిన వడ్డాణం మాదిరిగా పెన్నానది గుత్తికోట, గండికోట, సిద్దవటం కోట గోడలను పరుచుకొని పారుతూ సాగర సంగమం చేస్తున్నది. పెన్నానదికి కర్నూలు జిల్లా నంద్యాలపై భాగం నుండి వచ్చే వక్కిలేరు, కందూనదులు, సగిలేరు (మార్కాపురం) చిత్రావతి (అనంతపురం -కర్నాటక) బాహుదా, మాండవ్యాలు కలిసే చెయ్యేరు (చిత్తూరు -కడప) చిత్తూరు -కడపల మీదుగా సాగే పాపాగ్ని నదితో సహా అన్నీ కూడ పెన్నకు ఉపనదులే.
సీమను కలిపి ఉంచే మరో ప్రకృతి సారూప్యం-సామీప్యత నల్లమల, ఎర్రమల, శ్రీశైల పర్వతసానువులు. ఇవి కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలను తాకుతూ వ్యాపించి ఉన్నాయి. అలాగే శేషాచలపర్వతాలు అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలను చుట్టి కప్పివేసి ఉన్నాయి. తూర్పు -పడమటి కనమల మద్య చీలిన భూభాగం -ఒకే పాలనా విభాగం క్రింద ఉన్న సీమ ప్రాంతానికి సంగీత -సాహిత్య కళారంగాల్లో కూడా విడదీయరాని బాంధవ్యం - అనుబంధం ఉన్నాయి. శ్రీ కృష్ణదేవరాయల భువన విజయంలో రాటు దేలిన ఉద్దండ పండితులు అల్లసాని పెద్దన, ధూర్జటి, నంది తిమ్మన, మాదయ్య గారి మల్లన్న, అయ్యల రాజు రామభద్రుడు మొదలగు వారంతా రాయలసీమ జిల్లా వారే. వారి ప్రబంధ సాహిత్యానికి ప్రేరణ, భూమిక రాయలసీమ ఉమ్మడి సంస్కృతే. ఇక త్యాగరాజు కీర్తనలు, అన్నమయ్య పదకవితలు సీమ ప్రజల సహజ సంపదల తీపి గుర్తులు చెప్పనలవి కాదు. ప్రజల వ్యవహారిక తెలుగు బాషా సాహిత్యంలోకి సంగీతాన్ని చొప్పించిన దిట్టలు. రాయలసీమ నుడికారాలను తేట తెలుగులో పాటలు అల్లిన వారు. బహు బాషా కోవిధుడు, శివతాండవ కృతికర్త పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు పెనుగొండలో పుట్టి -ప్రొద్దుటూరు లో పెరిగి -కడపలో తనువు చాలించి నా ''మంచివారలు మావారు- మానధనులు'' అన్నా ''ఇచ్చటి చిగురు కొమ్మలకైనను చేవ యుండు'' అని చెప్పి సీమ ఆత్మాభిమానాన్ని నలుదిశలా చాటారు. చిత్తూరు జిల్లాలో పురుడు పోసుకొని కోస్తాలో మొగ్గతొడిగి, మైసూరు రాష్ట్రంలో ప్రభలు కొల్పి యమ్‌ యన్‌ రారు, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, నెహ్రూ లాంటి రాజనీతిజ్ఞుల చేత శెహభాష్‌ అనిపించుకొన్న కట్టమంచి రామలింగారెడ్డి, కళా పూర్ణోదయం లోని రాయలసీమ రైతాంగ వర్ణనలు మరచిపోగలమా? దువ్వూరి రామిరెడ్డి ''నేడ కేగితవమ్మా కోయిలా యమ్మలాడి నీ రసార్ధ్ర కంఠంబెత్తి గానామృతం జల్లుమా'' అని రైతులను, కూలీలను వారు చేసిన కాయకష్ఠం నుంచి ఉపశమనం పొందడానికి చెప్పిన ప్రకృతి సుందర సోయగాల ఉమ్మడి వారసత్వాన్ని వద్దనుకొందామా? సాహిత్యంలో తెలుగు జాతి గర్వించ దగ్గ మేధావి, మార్కిస్టు విమర్శకుడు రాచమల్లు రామచంద్రారెడ్డి, వల్లంపాటి వెంకట సుబ్బయ్యల అభ్యుదయ కోణాన్ని వదిలేద్దామా? జిడ్డు క్రిష్ణమూర్తి, వేమన, వీరబ్రహ్మాం బోధనలూ, తెలుగుజాతి ఐక్యత కొరకు, ''మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మముగన్న తల్లికి మంగళారుతులు'' అన్న శంకరంబాడి సుందరా చార్యులను ఎక్కడకు పంపిద్దాం? పద్య కవులు తిరుపతి వెంకట కవులను విస్మరిద్దామా? గడియారం వెంకట శాస్త్రి, రాళ్ళ పల్లి అనంత క్రిష్ణ శర్మలను ఎక్కడ కలిపేద్దాం? విద్వాన్‌విశ్వం మహోజ్వల కావ్యం ''తెన్నేటి పాట''కు రాళ్ళపల్లి వారు ముందు మాట రాస్తూ నేడు ఆఖిలాంధ్రప్రదేశ్‌లో ''మా రాయలసీమ ఒక ప్రత్యేక చారిత్రక కళాఖండం'' అని వక్కాణించారు. రాయలసీమ కరువు కథలను ప్రపంచానికి చాటిచెప్పిన కేతు విశ్వనాధరెడ్డి, సింగమనేని నారాయణ, మధురాంతకం రాజారాం, తరిగొండ వెంగమాంబ, శ్రీపాద పినాకపాణి తదితరుల సాహిత్య సేద్యం నుంచి జాలువారిన సీమ ఉమ్మడి కళా సంస్కృతులను విడదీయడం నేరం కాదా?. సినిమా రంగం ద్వారా కె.వి.రెడ్డి, బి.యన్‌.రెడ్డి, చక్రపాణి గార్లు రాయలసీమ ఉమ్మడి సంస్కృతిలోంచి వచ్చిన భాషా మాండలికాలను, యాసలను, వైవిధ్య భరితమైన ఉమ్మడి కుటుంబ జీవితాన్ని తెలుగు సమాజానికి అందించిన మంచి సంస్కారాన్ని విడదీయడం భావ్యమా? రాయల తెలంగాణ ఆచరణ యోగ్యం కాదు. కానేరదు కూడా. నీటి వనరులు, భూగర్భ ఖనిజ సంపదలు అటవీ సంపదల విషయంలో ఒక జిల్లాతో ఇంకో జిల్లా ముడివడి పెనవేసుకొని ఉన్నాయి. విడదీయడం ఎవ్వరికీ ప్రయోజనం కాదు. కాదని మూర్ఖంగా విడగొట్టినా ప్రాంతాల మద్య నిత్య కలహాలు రాజుకుంటూనే వుంటాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పాలనాపరంగా ఒకటిగా ఉన్నా -తెలంగాణా, కోస్తా ఆంధ్ర, రాయలసీమ మూడు ప్రాంతాలు వాటి ప్రత్యేకతలతో విశిష్ట సంస్కృతులతో, ఆచార వ్యవహారాలతో ప్రత్యేకంగానే కొనసాగుతున్నాయి. కోస్తా జిల్లాల్లో ప్రాచుర్యంలో ఉన్న అట్లతద్దె, తెలంగాణా అంతటా వైభవంగా ఆచరించే బోనాల పండుగ రాయలసీమలో లేవు. తెలంగాణా జానపద జీవితంతో ముడిపడిన సమ్మక్క -సారక్క జాతరలు, రాయలసీమలోని గంగజాతరలు కోస్తా ఆంధ్రలో లేవు. అలాంటప్పుడు రాయలసీమను రెండుగా చీల్చి ఒక భాగాన్ని కోస్తా సంస్కృతిలో, ఇంకో భాగాన్ని తెలంగాణ సంస్కృతిలో కలపాలని చూడడం అవివేకం.
తుంగభద్ర, పెన్నా బేసిన్‌లు, కృష్ణా బేసిన్‌లో కలసి ఉన్నాయి. తుంగభద్ర -పెన్నాబేసిన్‌లు సీమ నాలుగు జిల్లాలతో పాటుగా నెల్లూరు వరకూ విస్తరించింది. శ్రీ శైలం నికర, మిగులు జలాల ఆధారంగా ఉన్న ప్రాజెక్టులు 1) కె.సి.కెనాలు కడప, కర్నూలుకు పారుదల ఇస్తున్నది. 2) యస్‌.ఆర్‌.బి.సి కూడా అంతే. కర్నూలు జిల్లాలోని అవుకురిజర్వాయరు నిండి-అక్కడి నుండి గోరకల్లు-దాని తర్వాత గండికోటకు నీళ్ళు రావాలి. 3) హంద్రీ -నీవా కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు పారుదల సౌకర్యాన్ని ఇస్తుంది. 4) గాలేరు -నగరి, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు, 5) తెలుగు గంగ -కర్నూలు జిల్లా వెలిగొండ, అటుతర్వాత బి.మఠం దాని తర్వాత సోమశిలనుంచి చిత్తూరు జిల్లాలకు పారుదల కల్పిస్తుంది. మరి సీమలో రెండు జిల్లాలు ఒక రాష్ట్రంలో, రెండు జిల్లాలు ఇంకోక రాష్ట్రంలో ఉంటే ఎలా సమస్య పరిష్కారం అవుతుంది? ఒకే రాష్ట్రంలో ఉండగానే కర్నాటక, మహారాష్ట్రల పేచీలతో తగవునుడుస్తూ ఉంటే, ఆంధ్ర ప్రదేశ్‌లో కోస్తా -తెలంగాణాతో తగవునడుస్తూ ఉంటే, ఇక రాయల తెలంగాణా అయితే ఏ బావిలో దూకాలో? విధూషక పాత్ర పోషించే కాంగ్రెస్‌ నాయకులకే ఎరుక.
చరిత్రలో సీమకు 1937 నుంచి 1956 వరకూ జరిగిన అన్యాయం, (శ్రీబాగ్‌ వడంబడిక, విశ్వవిద్యాలయం, రాజధాని) ఆ తర్వాత క్రిష్ణా -పెన్నార్‌కు బదులుగా సిద్దేశ్వరం -గండికోట ప్రాజెక్టుల విషయంలో జరిగిన అన్యాయం పరిశీలిస్తే -సీమ రెండు రాష్ట్రాల్లోకి వెళ్ళిపోతే జరిగే అరిష్ఠం అంతా ఇంతాకాదు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రను తిరిగేస్తే దామోదరం సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి కోట్ల విజయ భాస్కర రెడ్డి, నారాచంద్రబాబు నాయుడు, వైయస్‌.రాజశేఖర రెడ్డి, నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డిలే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించారు. అయినా సీమకు వొరిగిందేమీలేదు. కుడి -ఎడమల దగాతప్ప. సీమలో నివసిస్తున్న 1,51,74,908 ప్రజలకు వొనగూడే ప్రయోజనం శూన్యం. పైపెచ్చు సంఘటితంగా పోరాడే శక్తి, బలంగా వినిపించే గొంతుకలు మూసుకపోవడం, రేణాటిపౌరుషం, సీమ ఆత్మాభిమానం అడుగంటిపోవడం జరుగుతుంది. సీమవాసులు ఈ కుయుక్తులను తప్పకుండా ప్రతిఘటించాలి.
-జి.ఓబులేసు, సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

Wednesday, August 7, 2013

రాయలసీమ అస్థిత్వం పూర్తిగా తెరమరుగయ్యే కుట్ర !

రాయలసీమ అనే పదం.. రాయలసీమ సంస్కృతి అనేది ఇక పూర్తిగా తెరమరుగు కానుందా? నిరంతరం కరువు కాటకాలతో తల్లడిల్లుతూ ఉన్నా.. తనకంటూ సుదీర్ఘమైన ప్రత్యేక సాంస్కృతిక చరిత్ర కలిగిన రాయలసీమ గురించి ఇక మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకునే రోజొస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్ల లెక్కల కుట్రలతో సీమను రెండు ముక్కలుగా విడగొట్టి.. తెలంగాణలో ఒక చెక్క.. ఆంధ్ర ప్రాంతంలో మరో చెక్క కలిపేయనుందా? అవుననే ధ్రవీకరిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వంలోని అత్యంత ఉన్నతస్థాయి వర్గాలు! జాతీయస్థాయిలో కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం నడుపుతున్న కుట్ర వల్ల.. సుదీర్ఘమైన ప్రత్యేక సాంస్కృతిక చరిత్ర కలిగిన రాయలసీమ అస్థిత్వం పూర్తిగా తెరమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందనే ఆందోళన ఇప్పుడు ఆ ప్రాంతంలో సర్వత్రా వ్యక్తమవుతోంది. రాయలసీమ అస్థిత్వాన్ని దెబ్బతీస్తూ ఓట్లు, సీట్ల లెక్కలతో విభజించాలని కాంగ్రెస్ హైకమాండ్ గత కొద్ది రోజులుగా తెరవెనుక కసరత్తును ముమ్మరం చేసింది. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఆ దిశగా అడుగులు వేగవంతం చేసినట్లు ఢిల్లీ నుంచి సమాచారం అందుతోంది. అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన కొందరు పార్టీ నేతలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినదానికి
తలూపుతూ రాయలసీమను విభజించటానికి అంగీకారం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అత్యున్నత స్థాయి వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు.. అనంతపురం, కర్నూలు జిల్లాలను రాయలసీమ నుంచి విడదీసి తెలంగాణలో కలిపి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ నాయకత్వం తెరవెనుక రచించిన ప్రణాళికను త్వరలోనే కార్యరూపంలోకి తేవాలని భావిస్తోంది. సెంటిమెంట్ ఆధారంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు ఒక ప్రాతిపదిక ఉండగా.. రాయలసీమ ప్రజలకు ఏమాత్రం సంబంధం లేకుండా వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా.. వారి అస్థిత్వాన్ని, మనోభావాలను దెబ్బతీసే అతిపెద్ద కుట్రకు కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలే జీ హుజూర్ అంటూ సాగిలపడటంపై రాయలసీమ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఎవరూ అడగకుండానే... ఎవరినీ అడగకుండానే... దేశ చరిత్రలో ఎక్కడా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను సరిసమంగా పంచుతామన్న ప్రాతిపదికన రాష్ట్రాల విభజనగానీ విలీనంగానీ జరగలేదు. తొలిసారిగా కాంగ్రెస్ నాయకత్వం రాయలసీమ ప్రజలు ఏనాడూ కోరని, ఒక ప్రాతిపదిక లేని అంశాన్ని తెరమీదకు తెచ్చి రాజకీయ క్రీడ సాగిస్తోంది. సెంటిమెంట్ ఆధారంగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని డిమాండ్ చేసిన ప్రజలు సైతం.. రాయలసీమ ప్రాంతాన్ని విడదీసి అందులో కొంత ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని ఏనాడూ కోరలేదు. తెలంగాణ వాదులు కానీ, రాయలసీమ ప్రజలు కానీ ఏనాడూ అడగని, ఏమాత్రం అభిలషించని విధంగా.. కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం సీమ జిల్లాలను కత్తిరించి తెలంగాణలో కలిపే కుట్రను ఇరు ప్రాంతాల ప్రజలు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేయటానికో.. కొన్ని సీట్లు ఎక్కువ గెలుచుకోవచ్చనో.. సీట్లు ఓట్ల లెక్కల ప్రాతిపదికన.. సుదీర్ఘ ప్రత్యేక సంస్కృతి కలిగిన ఒక ప్రాంతాన్ని అడ్డంగా చీల్చటానికి ఆ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ కాంగ్రెస్ అడుగులు వేస్తుంటే.. అందుకు కొందరు రాయలసీమ ప్రాంత నాయకులే మడుగులు వత్తుతూ తమ పబ్బం గడుపుకోవటానికి సాగిస్తున్న లాలూచీ రాజకీయాలపై ఆ ప్రాంత ప్రజలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ప్రజల నుంచి ప్రతిఘటన వ్యక్తమవుతున్నప్పటికీ కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఒక భయంకరమైన నిర్ణయానికి రావటమేంటని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే... రాష్ట్ర విభజనపై ఓట్లు సీట్ల లెక్కలతో ముందుకెళుతున్న కాంగ్రెస్ హైకమాండ్ ఆ క్రమంలోనే రాయలసీమ ప్రజల సెంటిమెంట్‌ను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవటం లేదని తెలుస్తోంది. ఒకసారి పది జిల్లాలతో కూడిన తెలంగాణ అని.. మరోసారి రాయల తెలంగాణ అని.. ఇంకోసారి హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతమని.. ఇలా రకరకాల లీకులను ప్రచారంలో పెడుతూ రాష్ట్ర ప్రజలను గందరగోళంలోకి నెడుతున్న కాంగ్రెస్ నాయకత్వం తెరవెనుక మాత్రం పెద్ద తతంగమే నడిపిస్తోందని సమాచారం. రాయలసీమను విడగొట్టి రెండు జిల్లాలను తెలంగాణలో కలపటం ద్వారా తెలంగాణలో కేసీఆర్‌ను అదుపులో పెట్టవచ్చని.. మరో రెండు జిల్లాలను కోస్తాలో కలపటం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయవచ్చని.. తద్వారా ఓట్లు, సీట్ల లెక్కల్లో తను రాజకీయ ప్రయోజనం పొందవచ్చని భావించిన కాంగ్రెస్ అధిష్టానం.. కేవలం అందుకోసమే ఈ కుట్రను అమలు చేయబోతోందని తెలుస్తోంది. సీమ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు కొందరు తమ రాజకీయ ప్రయోజనం కోసం.. రాయలసీమను విభజించటానికి హైకమాండ్ చెప్పినట్లు అంతర్గతంగా తలూపుతున్నారు. సమైక్య రాష్ట్రం కోసం ఢిల్లీలో ఏదో హడావుడి చేస్తున్నట్టు పైకి కనపడుతూ లోలోన హైకమాండ్ ఆశించే దిశగా మిగిలిన నేతలను ఒప్పించే పనిని ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం కావటంతో.. కాంగ్రెస్ హైకమాండ్ ఆశించిందే ఆలస్యమన్నట్లు తెరవెనుక లాలూచీని మరింత ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఎడారిగా మారే దారిలో: రాయలసీమ అన్నదే కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రాంతం. అందులోంచి ఆవిర్భవించిన తనదైన ప్రత్యేక సంస్కృతిని నిలుపుకున్న ప్రాంతం. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు తెలుగు ప్రజల ఐకమత్యం కోసం కర్నూలు రాజధానిని కోల్పోయిన విషయాన్ని ఇక్కడి ప్రజలు గుర్తుచేస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితులు, పరిణామ క్రమంలోనూ ఆ ప్రాంతం వెనుకబడిన ప్రాంతంగానే మిగిలిపోయింది. అక్కడ చేపట్టిన ప్రాజెక్టులు సైతం మిగులు జలాలపై ఆధారపడి మాత్రమే నిర్మించారు. రాయలసీమను విభజించటం ద్వారా మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టులన్నీ ఎడారిగా మారే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కృష్ణా నదిలో నీటిపై హక్కూ దిక్కూ లేదు. పైన మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములు నిండితే తప్ప కింద కు చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు చేర్పులు చేయకుండా మధ్యలో ఇంకో రాష్ట్రాన్ని ఏకపక్షంగా ఏర్పాటు చేస్తే శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? శ్రీశైలం ప్రాజెక్టుకే నీళ్లు దిక్కులేనప్పుడు నాగార్జునసాగర్ పరిస్థితి ఏమిటి? ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణా నదీ జలాలపై ఒకవైపు మహారాష్ట్ర, కర్ణాటక చర్యలతో ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటికే తీవ్ర నష్టం జరుగుతోంది. తాజాగా మరో రాష్ట్రం ఏర్పాటు చేయటం ద్వారా మిగులు జలాలు పూర్తిగా ప్రశ్నార్థకమవుతుండగా, ఆ మిగులు జలాలపై ఆధారపడిన గాలేరు నగరి, తెలుగుగంగ, హంద్రీనీవాలకు చుక్కనీరు కాదుకదా ఆ పథకాలన్నీ తెరమరుగు కాకతప్పని పరిస్థితి. ఇదే జరిగితే కాంగ్రెస్ మోసపూరితంగా రాయలసీమను విభజించటం.. మిగులు జలాలపై ఆధారపడిన ప్రాజెక్టుల అస్థిత్వం కోల్పోయి, ప్రాంతాలన్నీ మరింత కరవు కాటకాల్లోకి నెట్టటమేనని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఆ దిశగా ఒక్కో అడుగు: రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేయబోయే కేంద్ర మంత్రుల కమిటీ.. పది జిల్లాలతో కూడిన తెలంగాణయే కాకుండా మిగతా డిమాండ్లను పరిశీలిస్తుందని సీడబ్ల్యూసీ నిర్ణయం అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ స్పష్టంగా చెప్పారు. వాస్తవానికి ఢిల్లీలో తెరవెనుక రాయలసీమ విభజనపైనే ప్రణాళికలు సిద్ధమైనట్లు సమాచారం. విభజించాలని డిమాండ్ చేసింది తెలంగాణ అయితే.. రాయలసీమను విభజించటమేమిటన్న ప్రశ్న ఉదయిస్తుంది కాబట్టి.. మొదట్లో ఆ సమస్య తలెత్తకుండా ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ నాయకత్వం తన పనిని చేసుకుంటూ పోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. త్వరలో నియమించే కేంద్ర మంత్రుల కమిటీ ముందు కాంగ్రెస్ నేతలే ఈ ప్రాతిపదన పెట్టి దానికి సానుకూలత ఉన్నట్లుగా కుట్ర పూరితంగా చెప్పింది దాన్ని చొప్పించటానికి ఇప్పటికే పథకరచన పూర్తయినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సమైక్య రాష్ట్రం కోసం నడుస్తున్న ఉద్యమాలు చల్లారిన తర్వాత రాయలసీమను విభజించే అంశం తెరపైకి తెస్తారని ఏఐసీసీలోని అత్యున్నత వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

 సీమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లే..  

‘‘రాయలసీమను రెండు ముక్కలు చేసి తెలంగాణ లో విలీనం చేస్తే రాయలసీమ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టినట్లే. అనంతపురం, కర్నూలు రాజకీయ నాయకులు తమ ప్రాబల్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజల గుండెల్లో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రాబల్యాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్, టీడీపీ నేతలు ఏకమై కుట్ర పన్నారు. హైదరాబాద్‌లోని తమ ఆస్తులను కాపాడుకునేందుకు కొందరు రాజకీయ నాయకులు రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారు. రాయల తెలంగాణ వద్దు.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందే’’ 
- ప్రొఫెసర్ మల్లికార్జునరెడ్డి
ఎస్కేయూ, అనంతపురం 
  ‘‘కేంద్రం స్వార్థ ప్రయోజనాల కోసమే రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తెస్తోంది. అదేగాని జరిగితే రాయలసీమ తన అస్తిత్వాన్నే కోల్పోతుంది. జలయజ్ఞంలో కోస్తా వారికి పులిచింతల, తెలంగాణలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులను పూర్తి చేశారు. రాయలసీమలో మాత్రం ఎలాంటి భారీ ప్రాజెక్టులను పూర్తిచేయలేదు.
  
- ఎం.శ్రీరామిరెడ్డి, చీఫ్ ఇంజనీర్, రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదలశాఖ మాజీ సలహాదారు (కడప)  
స్వార్థ, సంకుచిత రాజకీయాల కోసమే ఈ ప్రతిపాదన కాంగ్రెస్ కేవలం తన స్వార్థ, సంకుచిత రాజకీయాల కోసమే చేస్తోంది. కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ఈ కుట్రల వల్ల శ్రీశైలం అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా మారుతుంది. రాయలసీమ ప్రాంతానికి నీరొచ్చే అవకాశం పూర్తిగా కోల్పోతుంది. మిగులు జలాలపై ఆధారపడిన గాలేరునగరి, హంద్రీనీవా, తెలుగుగంగ స్కీమ్స్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. నీరొచ్చే అవకాశమే లేదు. కాంగ్రెస్ చర్యల వల్ల రాయలసీమతో పాటు మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లా ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతారు. -ఎం.వి.మైసూరారెడ్డి (వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత)


నీతి నిజాయితీల కోసం పాటుపడిన న్యాయవాది పద్మనాభరెడ్డి.

న్యాయ వాది సి.పద్మనాభరెడ్డి
న్యాయవాద వృత్తిలో విలువలు, నీతి నిజాయితీల కోసం పాటుపడిన అరుదైన న్యాయవాది పద్మనాభరెడ్డి.

 హైకోర్టు సీనియర్ న్యాయ వాది సి.పద్మనాభరెడ్డి మృతితో ప్రజా ఉద్యమాలకు అండదం డలందించే గొప్ప మానవతావా దిని సమాజం కోల్పోయింది. 1931, మార్చి 18న అనంతపురంజిల్లా యాడికి గ్రామంలో మధ్యతరగతి కుటుం బంలో పద్మనాభరెడ్డి జన్మించారు. తండ్రి ఓబుల్‌రెడ్డి, తల్లి సోమక్క. 5వ తరగతి వరకు యాడికి వీధి బడిలో చదివారు. 6 నుంచి 8 తరగతుల వరకు మున్సిపల్ హైస్కూ లు, తాడిపత్రిలో చదివారు. 9, ఎస్‌ఎస్‌ఎల్‌సీ లండన్ మిషన్ హైస్కూల్, గుత్తిలో చదివారు.

  గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్, అనంతపురం గవర్నమెంట్ కాలేజీలో బీఎస్సీ, మద్రాస్ యూనివర్సిటీలో ‘లా’ చదివారు. 1953 లో లాయర్‌గా మద్రాస్ హైకోర్టులో నమోదు చేసుకు న్నారు. అక్కడ కొంతకాలం ప్రాక్టీస్ చేసి 1954లో గుం టూరు (ఆంధ్ర హైకోర్టు)లో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 1956లో వచ్చారు.

 ‘‘నన్ను గుంటూరు కాలేజీలో చేర్పించిందీ, మద్రాసు లోని లా కాలేజీలో చేర్చించిందీ చిన్నపరెడ్డే. వారి ఇంట్లోనే నేను పెరిగాను. నా హైస్కూలు రోజుల నుంచి ఆయన నా గురువూ, మార్గదర్శకుడూనూ. ఇప్పుడు నేను ఏమైనా సాధించానంటే అదంతా ఆయన చలవే. జస్టిస్ చిన్నపరెడ్డి మమ్ములను ఎంత ప్రేమగా, అభిమానంగా చూశారో, దానంతటినీ నేను, నా కుటుంబ సభ్యులందరం ఎన్నటికీ మరిచిపోలేం. వాస్తవానికి నేను ఆయన లా ఛాంబర్‌లో 14 ఏళ్ల పాటు పనిచేశాను’’ అని జస్టిస్ చిన్నపరెడ్డిని గురించి చివరివరకు ఎంతో వినమ్రంగా చెప్పుకున్నారు పద్మనాభరెడ్డి.

 పద్మనాభరెడ్డి 60 ఏళ్ల సుదీర్ఘ కాలం క్రిమినల్ లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. హైకోర్టులో అరవై వేలకు పైగా కేసులు వాదించారు. సాధారణ ప్రజలు, పేదలు హైకోర్టులో సీనియర్ లాయర్లను నియమించుకోలేరు. వాళ్ల ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు. ఫీజులు ఇవ్వలేని కేసులలో కూడా పద్మనాభరెడ్డి వాదించి గెలిపించారు. జైలులోని ముద్దాయిలు కార్డుముక్క రాసినా ఆయన స్పందించేవారు. కేసులో ముద్దాయి ధనికుడా, పేదవాడా అనే తేడా లేకుండా వాదించారు. ఆయన గురించి చెప్పడ మంటే ముద్దాయిలు, ఖైదీలు, కార్మికులు, పేదలు, న్యాయాన్యాయాల గురించి చెప్పడమే!

 ప్రతి క్రిమినల్ అప్పీలు కేసులో సుమారు 100 పేజీల నుంచి వెయ్యి పేజీలకుపైగా రికార్డు ఉంటుంది. తనకున్న అపరిమిత పరిజ్ఞానంతో అన్ని పేజీలను స్కాన్ చేసి అందులో మూడో, నాలుగో అంశాల మీద కేసును తీసుకొచ్చి కేసులో వైరుధ్యాలను, చట్టవ్యతిరేక అంశాలు, నిపుణుల అభిప్రాయాలు, సాక్ష్యుల సాక్ష్యాలను, సహజ న్యాయశాస్త్ర ఉల్లంఘనలను ఎత్తి చూపేవారు. వీటితో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను జోడించేవారు. ఇంత పరిజ్ఞానం ఉన్నా ఆయన అతి సాధారణ వ్యక్తిగా మన కళ్లముందు, మనతో కలిసి ఉండటం ఆయనకే చెల్లింది. ఆయన నిగర్వి, గర్వపడేవాళ్లను అసహ్యించుకునేవారు. ఏనాడు ఎవరి మీద కోపాన్ని ప్రదర్శించి ఎరుగరు. ఎవరు ఏ సలహా అడి గినా ఓపిగ్గా, వివరంగా తెలియజేసేవారు. ఎంత తీరికలేని పనిలో ఉన్నా అడిగినవారికి నవ్వుతూనే సమాధానం చెప్పేవారు. ఏ గ్రామంలోనైనా, జైలులోనైనా క్రిమినల్ కేసుల మీద చర్చ జరిగిందంటే పద్మనాభరెడ్డి పేరు చర్చకు వచ్చేది.

 అధికారంలో ఉన్న పార్టీ ప్రజలనే కాదు ప్రతిపక్షాల నాయకులను కూడా పి.డి. కుట్ర కేసులు పెట్టి, జైలులోకి నెట్టడం ఈ రోజుల్లో మాదిరే, ఆరోజుల్లోనూ సర్వసాధా రణంగా మారిపోయింది. ఏ రాజకీయ పార్టీతో సంబం ధంలేకుండా ఆయన కేసులు వాదించారు. ప్రభుత్వ సర్వీ సులలో ఉన్న ప్రముఖులు, ఇంచుమించు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఏదో ఒక కాలంలో కేసుల కోసమో, సలహాల కోసమో ఆయనను సంప్రదించిన వారే. ఎంతో ఓపికగా వాళ్లు చెప్పింది విని, రికార్డులు పరిశీలించి వాళ్లకు సలహాలిచ్చారు. ఆయన సలహా తిరు గులేనిది. దాన్ని వాళ్లు పాటించేవారు. ఒక్కోసారి కోర్టుకు అనుమానం వచ్చినా ఆయననే సంప్రదించేవారు. రాష్ట్రం లో వేలాది మంది న్యాయవాదులు, ప్రజలు, కొందరు న్యాయమూర్తులు ఆయనంటే అభిమానంతో ఉండేవారు. ఆయన మరణించిన తర్వాత వేలాది మంది ప్రముఖులు తరలివచ్చి నివాళులర్పించడమే ఇందుకు నిదర్శనం.

 ‘ఎదురుకాల్పులు’ జరిగినప్పుడు ఉద్యమకార్య కర్తలు, ప్రజలు చనిపోతుంటారు. ఎన్‌కౌంటర్లలో పోలీసు లకు కనీసం పెల్లెట్ల గాయాలైనా కావు. ‘ఎదురుకాల్పులు’ జరిగినప్పుడు పోలీసుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలా? వద్దా? అనే ప్రశ్న హైకోర్టులో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందుకువచ్చింది. కోర్టు పద్మనాభరెడ్డిని ‘అమికస్ క్యూరీ’గా నియమించింది. ‘‘ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు, పోలీసుల మీద కేసు నమోదుచేయాల్సిందే. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపా మని పోలీసులు కోర్టులో నిరూపించుకోవాలి. కేసు రిజి స్టర్ చేయకుండా పోలీసులే తీర్చునివ్వడం చట్టవ్యతిరేకం’’ అని ఆయన వాదించారు. ఆయన వాదనలను కోర్టు అంగీకరించింది. సుదీర్ఘమైన తీర్పును వెలువరించింది.

 అత్యవసర పరిస్థితికి ముందు నుంచే అనధికారి కంగా ఎమర్జెన్సీ ఈ రాష్ట్రంలో కొనసాగింది. పట్టుబడిన వారిని కాల్చిచంపడం, చిత్రహింసలకు గురిచేయడం, కేసులలో ఇరికించి జైళ్లలో నిర్బంధించడం పరిపాటైంది. మొదటిసారి రాష్ట్రంలో తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, మండ్ల సుబ్బారెడ్డి తదితరులపై హైదరాబాద్ కుట్రకేసును రాజ్యం బనాయించింది. ఆ తర్వాత కానూ సన్యాల్, నాగభూషణ్ పట్నాయక్, తేజేశ్వరరావు, సొరెన్‌బోస్ తదితరులపై పార్వతీపురం కుట్రకేసు పెట్టింది. రెండు కేసులలో ట్రయల్ కోర్టులు కొంత మందికి శిక్షలు విధించాయి. అప్పీళ్లు హైకోర్టుకు వచ్చాయి. హైకో ర్టులో పద్మనాభరెడ్డి వాదించారు. పార్వతీపురం కుట్ర కేసులో అందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. హైదరా బాద్ కుట్ర కేసులో నెలరోజులు పద్మనాభరెడ్డి వాదిం చారు. హైకోర్టు శిక్షను ఖరారు చేసింది. కోర్టు నుంచి బయ టకు వచ్చీరాగానే హృదయం ద్రవించి ఆయన కళ్లనీళ్లు పెట్టుకున్నారు. నాగిరెడ్డి అంటే తనకు ప్రత్యేక అభిమా నమని చెప్పు కునేవారు.

 విద్యార్థి దశ నుంచి ఏ ఉద్యమాలలో ఆయన పాల్గొన లేదు. అయితే వామపక్ష భావజాలమంటే మొగ్గు చూపే వాడినని ఆయనే చెప్పుకున్నారు. ఆ కారణంగానే ఆయన న్యాయవ్యవస్థకు, ప్రజలకు, న్యాయవాదులకు ఎంతో తోడ్పాటునందించారు. మన రాష్ట్రంలో నక్సలైటు ఉద్య మం మొదలైనప్పుడు ప్రజల హక్కుల అణచివేత పెరి గింది. రాజకీయ ఖైదీల కోసం డిఫెన్స్ కమిటీ రావి సుబ్బా రావు ప్రేరణతో ఏర్పడింది. ఆయన నాయకత్వంలో పత్తిపాటి వెంకటేశ్వర్లు, బి.పి.జీవన్‌రెడ్డి, కన్నాభిరాన్, మనోహర్‌రాజ్ సక్సేనా, పద్మనాభరెడ్డి కమిటీ సభ్యులుగా ఉండేవారు. ఎమర్జెన్సీ కాలంలో రాజకీయ ఖైదీల విడుదల కోసం హైకోర్టులో పద్మనాభరెడ్డి వాదించారు. రావి సుబ్బారావు చనిపోయిన తర్వాత డెమోక్రటిక్ లాయర్స్ ఫోరంకు ఆయనే ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అదే సంఘం ఇండియన్ లాయర్స్ అసోసియేషన్‌గా మారింది. చివరివరకు ఆయనే ఆ సంఘానికి ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

 రాజకీయ విశ్వాసాలు కలిగి ఉండటం నేరం కాదని జస్టిస్ చిన్నపరెడ్డి ఎన్నో చరిత్రాత్మక తీర్పులు హైకోర్టు, సుప్రీంకోర్టులో ఇచ్చారు. రాజ్యం మాత్రం ఇప్పటికీ రాజ కీయ విశ్వాసాలను నేరంగానే పరిగణిస్తోంది. రాజకీయ విశ్వాసాలకు సంబంధించి వాదించిన కేసుల కారణంగా ఇంటెలిజెన్స్ నివేదిక ఆయనకు వ్యతిరేకంగా ఇవ్వడంతో పద్మనాభరెడ్డి హైకోర్టు జడ్జిగా నిమాయకం రద్దయింది. జస్టిస్ కృష్ణయ్యర్, చిన్నపరెడ్డి, భగవతి వంటి వారు లాయర్స్ యూనియన్‌లో నాయకులుగా ఉండి హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులయ్యారు. ఈ వాస్తవాన్ని ఇం టెలిజెన్స్ నివేదిక తొక్కిపెట్టింది. పద్మనాభరెడ్డి జడ్జి అయి ఉంటే ప్రజలకు మరెంతో న్యాయం చేసి ఉండేవారు.

 క్లయింట్ ఏ రాజకీయ పార్టీకి చెందినవాడనే దాంతో లాయర్‌కు నిమిత్తం లేదు. నిషిద్ధ పార్టీకి చెందిన వాడైనా, రాజ్యాంగం మీద విశ్వాసం లేని వాడైనా కోర్టును ఆశ్ర యించవచ్చు. వ్యక్తికి రాజ్యాంగం కల్పించిన పౌర హక్కు ను పొందవచ్చు. న్యాయం చేయమని కోరి వచ్చినప్పుడు తన విధి నిర్వహించడమే న్యాయవాది బాధ్యత. అదే సూత్రాన్ని ఆయన పాటిస్తూవచ్చారు.

 కేసు త్వరగా పరిష్కరించడం పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అది అమలుకు నోచుకోలేదు. టాలెంట్ ఉన్న సీనియర్ న్యాయవాదులను జడ్జీలుగా నియమించి మరికొన్ని కొత్త కోర్టులు ఏర్పాటు చేయటం వలన పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కరించవచ్చు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు మంచివే. రిటైర్డ్ జడ్జీలను ఈ కోర్టులలో నియ మిస్తే వారు అవినీతికి పాల్పడే అవకాశం ఉంది. ట్రయల్ కోర్టులు త్వరగా తీర్పులిచ్చినా అప్పీలు కోర్టులలో కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి. అప్పీలులో కొన్ని కేసులు గెలుస్తున్నాయి. దీర్ఘకాలం కేసులు పెండింగ్‌లో ఉండటం, నిందితులు జైలులో ఉండటం వలన వాళ్ల భవిష్యత్తు, కుటుంబ పరిస్థితి, ఆర్థికస్థితి నాశనమయ్యే అవకాశం ఉందని ఆయన భావించేవారు.

 మీ అరవై సంవత్సరాల అనుభవాలను, సమాజానికి మీరిచ్చే సందేశాలను నమోదు చేస్తే బాగుంటుందని కోరినప్పుడు మే నెలలో పూర్తి చేస్తానన్నారు. న్యాయవాద వృత్తిలో విలువలు, నీతి, నిజాయితీల కోసం పాటుపడిన అరుదైన న్యాయవాది పద్మనాభరెడ్డి. న్యాయవాదులు వృత్తి విలువల కోసం నిలబడితే ప్రజల హక్కులు కాపా డవచ్చునని నిరూపించారు. కేసులను క్షుణ్ణంగా అధ్య యనం చేయడం, అవసరమైతే ఉచితంగానే వాదించడం, వామపక్ష ఉద్యమాల వైపు మొగ్గు చూపడం, అండదండ లివ్వడం, ప్రభావాలకు లొంగకపోవడం ఆయన నుంచి అందరూ నేర్చుకోవాలి. ఆయనో విజ్ఞానఖని. ఆయన మరణం ప్రజలకు ముఖ్యంగా పీడిత వర్గాలకు తీరని లోటు. పీడిత పక్షపాతి పద్మనాభరెడ్డికి జోహార్లు.    
న్యాయవాదులు వృత్తి విలువల కోసం నిలబడితే ప్రజల హక్కులు కాపాడవచ్చునని నిరూపించారు. కేసులను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, అవసరమైతే ఉచితంగానే వాదించడం, వామపక్ష ఉద్యమాల వైపు మొగ్గు చూపడం, అండదండలు ఇవ్వడం, ప్రభావాలకు లొంగకపోవడం ఆయన నుంచి అందరూ నేర్చుకోవాలి.
(SAKSHI DAILY)

- వి. నారాయణరెడ్డి
 న్యాయవాది

Sunday, August 4, 2013

తెలంగాణ రాష్ట్రంతోపాటు రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి: శ్రీరామిరెడ్డి

కడప, ఆగస్టు 4: రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ తీర్మానం తర్వాత
శ్రీరామి రెడ్డి 
దేశంలో 14 ప్రాంతాల వారు ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమించి కేంద్రంపై ఒత్తిడి తెలుస్తున్నారు. ఇదే సీమ ప్రజలకు సరైన సమయం. దేశంలోని ఛత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా, గోవా, మిజోరాం, త్రిపుర తదితర రాష్ట్రాల కంటే రాయలసీమ అన్ని విధాల పెద్దది. కావున ప్రస్తుత ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంతోపాటు రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ముక్తకంఠంతో డిమాండ్‌ చేసి దానిని సాధించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నీటి పారుదల శాఖ మాజీ సలహాదారు, రాయలసీమ అభ్యుదయ సంఘం మాజీ అధ్యక్షుడు ఎం.శ్రీరామిరెడ్డి  అభిప్రాయపడ్డారు. రాయలసీమ ప్రజలు ఆరు శతాబ్దాల చరిత్రలో అతి విషమ ఘట్టంలో ఉన్నారని, సీమ ప్రజల మనోభావాలు, హృదయఘోష ఏ పార్టీలకు పట్టడం లేదని  తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం విలేకరుల సమావేశంలో శ్రీరామిరెడ్డి మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్య వైభవ పతనం తర్వాత పాలకుల నిర్లక్ష్యం, నిరాధరణ మూలంగా సీమ ప్రజలు దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం రాయలసీమను విభజించి ఒక ప్రాంతాన్ని తెలంగాణలో, మరొకటి ఆంధ్రలో కలపాలనుకోవడం శతాబ్దాల భౌగోళిక, చారిత్రక, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక అస్థిత్వవాన్ని రూపు మాపి శాశ్వతంగా నామరూపాలు లేకుండా భూస్థాపితం చేయడమేనన్నారు. 2014లో జరగబోయే ఎన్నికలలో అధిక సీట్లు సంపాధించాలన్న దురాశతో ఈ విధంగా చేస్తున్నారన్నారు. రాయలసీమ ప్రజలు రాజ్యాంగ పరంగా, రాజకీయ పరంగా చైతన్యవంతులైతే తప్ప వారికి రాజకీయ, రాజ్యాంగ భద్రత, జీవిత ప్రమాణాలు పెంపొందించుట తగు విధాన కార్యాచరణ జరుగుతుందని నమ్మలేమన్నారు. నీరు, విద్యుచ ్ఛక్తి, పరిశ్రమలు, ఉద్యోగాలు తదితర విషయాలలో సీమకు నాటినుంచి నేటి వరకు అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ వారికి రాష్ట్రం, కోస్తాకు పోలవరం ప్రాజెక్టు , కానీ రాయలసీమకు మొండిచెయ్యి చూపిస్తున్నారన్నారు. 18 సంవత్సరాల నుండి పెండింగ్‌లో ఉన్న గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టుల గురించి ఒక్క మాట మాట్లాడలేదన్నారు. పోలవరం పూర్తయితే రాయలసీమకు కొంత నికర జలాలు వస్తాయనుకోవడం భ్రమేనన్నారు. విద్యుచ్ఛక్తి విషయంలో రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు తప్ప మరే ప్రాజెక్టు సీమలో లేవన్నారు. దేశంలోనే అపారంగా ఖనిజ సంపద ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఇంతవరకు ఏ ఒక్క భారీ పరిశ్రమను స్థాపించలేదన్నారు. జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ ఎక్కువ వెనుకబడిన ప్రాంతమని చెప్పినప్పటికీ ప్రభుత్వాలు స్పందించలేదన్నారు. రాయలసీమ ప్రజలు సమైక్యాంధ్ర ఉద్యమంలో అం కిత భావంతో పాల్గొంటున్నారని అయితే ఉద్యమ ఫలితం ఎలా ఉంటుందో తెలియదన్నారు. కేంద్రం హైదరాబాద్‌ సమస్యను సంతృప్తికరంగా పరిష్కరిస్తే కోస్తా ప్రజలు ఉద్యమాన్ని విరమించవచ్చన్నారు. అప్పుడు సీమ ప్రజలను కోస్తాంధ్రతో ఉంచుతారా? లేక రెండుగా చీల్చి తెలంగాణ, ఆంధ్రలో కలుపుతారా? రెండుగా చీల్చితే సీమ ఉనికే నాశనమవుతుందన్నారు. 

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...