Saturday, March 30, 2013

బహుభాషా చక్రవర్తి డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు

తాను రచించిన కావ్యాన్నే తానే పాఠ్యపుస్తకంగా చదివి పరీక్ష రాసిన అరుదైన కవి సరస్వతీపుత్ర పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు. పదునాలుగు భాషలలో పాండిత్య శోభతో ఒక్క గొంతుకై అబ్బురపరచిన బహుభాషా చక్రవర్తి ఆయన. తెలుగు ప్రబంధాలలోని ప్రబంధ నాయికలకు సాహిత్య చరిత్రలో సముచిత సమయోచిత స్థానం పదిలపరచిన సాహిత్య విమర్శకుడాయన. ప్రాచీన సాహిత్యంతోపాటు ఆధునిక సాహిత్యం సమదృష్టితో అధ్యయనం చేసిన సాహిత్యజీవి ఆచార్యులు. పద్యం గద్యం ఇరుకారుల సేద్యంగా శతాధిక గ్రంథాలు రచించిన శక్తత గల రచయిత ఆయన. గొప్ప వక్త. సమర్థుడైన విమర్శకుడు. శక్తత గల అనువాదకుడు. ఛాందసభావాలు గిట్టనివాడు. సంప్రదాయం మరువనివాడు. ఆధునికాన్ని అభిమానించేవాడు.

వందేళ్ల క్రితం 1914 మార్చి 28న అనంతపురం జిల్లా పెనుగొండ తాలుకా చియ్యేడు గ్రామంలోని విద్వత్ కుటుంబంలో నారాయణాచార్యులు జన్మించారు. పుట్టపర్తి శ్రీనివాసులు, లక్ష్మీదేవమ్మ ఆయన తల్లిదండ్రులు. ఎనిమిదో తరగతి వరకు చదివి బడి మానేశారు. వీధి పిల్లలతో కలసి పెనుగొండ కోటలో తిరుగుతూ ఆటపాటల్లో కాలం వెల్లబుచ్చేవారు పుట్టపర్తి. విద్వత్ కుటుంబంలో జన్మించిన నారాయణాచార్యులు చదువుసంధ్యలు లేక 'పండితపుత్ర శుంఠః' అని ఎక్కడ మారిపోతాడోనని శ్రీనివాసాచార్యులు భయపడ్డారు. ఇక తానే గురువయ్యారు. తెలుగు, సంస్కృతం నేర్పారు. ఆ సందర్భంలోనే ఆ కుటుంబానికి శ్రేయోభిలాషి అయిన టి.శివశంకరం, నారాయణాచార్యులను వెంటతీసుకుపోయి పెనుగొండలోని సబ్‌కలెక్టర్ భార్య అయిన పిట్ దొరసానికి పరిచయం చేశారు. ఆమె ఆంగ్లంలో గొప్ప విద్వాంసురాలు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో షేక్స్‌పియర్, బ్రౌనింగ్ మీద గొప్ప పరిశోధన చేశారామె. ఆమె, ఆచార్యులకు ఆంగ్లభాషను నేర్పడమే కాకుండా గెట్టిగా ఆంగ్లసాహిత్యాన్ని పరిచయం కూడా చేశారు.

అప్పట్లో పెనుగొండలోని నాగనాయని చెరువు గ్రామంలో రంజకం మహాలక్షుమమ్మ అనే ప్రసిద్ధ నర్తకి ఉండేది. ఒకరోజు ఆమె ఇంటి ముందు నుండి ఆచార్యులు వెళుతున్నారు. అప్పుడు శ్రావ్యమైన మువ్వల సవ్వడి వినిపించింది. ఆచార్యులు ఆ ఇంటి కిటికీ నుండి చూశారు. లోపల నర్తకి అద్భుతంగా నృత్యం చేస్తూ కనిపించింది. నృత్యం అయిపోయాక తనను గమనిస్తున్న బాలుడైన ఆచార్యులను ఆమె దగ్గరికి పిలిచింది. 'నృత్యం చేర్చుకుంటావా?' అని అడిగింది. వెంటనే ఆచార్యులు ఔనన్నట్లు తలాడించారు. ఫలితమే ఆచార్యులు ఆమె ద్వారా సంగీతం, నృత్యం రెండు కళల్లో ప్రావీణ్యం సంపాదించారు.

కేవలం ఇంటి చదువుతో నారాయణాచార్యుల జీవితానికి భవిష్యత్ ఉండబోదని ఆయన తండ్రి శ్రీనివాసాచార్యులు అనుకున్నారు. అప్పట్లో కట్ట మంచి రామలింగారెడ్డి, మైసూర్ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌గా ఉండేవారు. ఆయన ప్రత్యేక ఆహ్వానంతో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, అదే యూనివర్సిటీలో తగు హోదాలో పనిచేస్తుండేవారు. ఆ రాళ్లపల్లివారు, పుట్టపరి వారికి దగ్గరి బంధువు. దీంతో ఆచార్యులను ఆయన వద్దకు పంపారు. అక్కడ ఆచార్యులు ప్రాకృతభాష అధ్యయనం చేశారు.

అక్కడ ఉన్నప్పుడే పెనుగొండకోట గతవైభవం, ప్రస్తుత దయనీయ స్థితిని దృశ్యమానం చేస్తూ 150 పద్యాలతో 'పెనుగొండ లక్ష్మి' అనే లఘుకావ్యం రచించారు ఆచార్యులు. ఆ కావ్యాన్ని రాళ్ళపల్లి చదివి భవిష్యత్తులో గొప్పకవి కాగలవని దీవించారు. ఆ తరువాత నారాయణాచార్యులు తిరుపతిలోని వేంకటేశ్వర సంస్కృత కళాశాలలో చేరడానికి వెళ్ళారు. అప్పుడు ఆచార్యుల వయస్సు 16 ఏళ్ళు. ఆ కాలేజీ ప్రిన్సిపల్‌గా, ప్రసిద్ధులైన కపిస్థలం కృష్ణమాచార్యులు ఉండేవారు. కాలేజీ అడ్మిషన్ ఇమ్మని ఆచార్యులు ఆయన్ను కోరారు. తగు ధృవీకరణపత్రం చూపమని ప్రిన్సిపల్ అడిగారు. ఉంటేకదా, చూపడానికి. దీంతో అడ్మిషన్ సాధ్యం కాదు పొమ్మన్నారు. ఆచార్యులకు కోపం వచ్చింది. ఆవేశంగా, ఆశువుగా పద్యాలు చెబుతూ బయటికి నడిచారు. ఈ చర్యతో ఆ ప్రిన్సిపల్ దిగ్భ్రమ చెందారు. నారాయణాచార్యులలోని అంతర్గత యోగ్యతను గుర్తించి అడ్మిషన్ ఇచ్చారు. అయితే అక్కడ కూడా పుట్టపర్తివారు కోర్సు పూర్తి చేయకుండానే పెనుగొండకు తిరిగి వెళ్ళిపోయారు.

ఆ తర్వాత కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కనకవల్లీదేవి (కనకమ్మ)తో పెళ్ళి జరిగింది. అప్పటికి ఆచార్యుల వయసు 20 ఏళ్ళు. ఆ విధంగా అనంతరపురం జిల్లా నుండి కడప జిల్లా ప్రొద్దుటూరుకు మకాం మారాల్సి వచ్చింది. ప్రొద్దుటూరులోనే శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయంలో సంస్కృతం నేర్పించే ఉపాధ్యాయునిగా పనిచేయసాగారు. అప్పటికి ఆచార్యులు ఇంకా విద్వాన్ పూర్తి చేయనే లేదు. ప్రభుత్వ ఉద్యోగం కోసం విద్వాన్ అవసరమని స్థానికులైన పెద్దలు సలహా ఇచ్చారు. దీనితో విద్వాన్ పూర్తి చేయడానికి తిరుపతిలోని ప్రాచ్యకళాశాలలో చేరారు. విద్వాన్ పూర్తిచేశాక ప్రొద్దుటూరులోని మునిసిపల్ హైస్కూల్‌లో తెలుగు పండితునిగా చేరారు.

అయితే తిరుపతిలో ఆచార్యులు చదువుకునేటప్పుడు తాను రాసిన కావ్యం 'పెనుకొండ లక్ష్మి' పాఠ్యపుస్తకంగా చదివి పరీక్ష రాశారు. విచిత్రమేమిటంటే ఆ పరీక్షలో ఆచార్యులు తప్పారు. తాను పరీక్ష బాగా రాసినా ఎందుకు ఉత్తీర్ణున్ని చేయలేదో చెప్పమని ప్రిన్సిపల్‌ను ఆచార్యులు అడిగారు. ఆ ప్రిన్సిపల్‌కు కూడా ఆశ్చర్యమే అనిపించి జవాబు పత్రం తెప్పించి పరిశీలించారు. అప్పుడు తేలిందేమిటంటే 2 మార్కుల ప్రశ్నకు ఒక సుదీర్ఘ వ్యాసం మాత్రమే జవాబు రాసి వ్యవధి ముగియడంతో పేపరు ఇచ్చేసి రావడంతో పరీక్ష తప్పారన్న విషయం గ్రహించారు. దీనితో ఆచార్యులు అవాక్కయ్యారు. తర్వాత మళ్ళీ రాసి ఉత్తీర్ణులయ్యారు.

ఆచార్యులు శతాధికంగా గ్రంథాలు రాసినా, ఆయనకు కీర్తి ప్రతిష్ఠలు సమకూర్చి పెట్టినది ఒక లఘుకావ్యమైన 'శివతాండవ'మే. రంజకం లక్షుమమ్మ వద్ద నేర్చిన నృత్యం, రాళ్ళపల్లి దగ్గర నేర్చుకున్న సంగీతం, కన్నడ భాషా సాహిత్యంలో అధ్యయనం చేసిన రగడ ఛందస్సులోని సాహిత్యం ఆ లఘుకావ్య రచనకు జవజీవాలు పోశాయి. పుట్టపర్తి నారాయణాచార్యులంటూనే ఇప్పటికీ అందరికీ గుర్తుకొచ్చేది ఆయన శివతాండవ కావ్యమే.

శివతాండవ కావ్యం వెలువడ్డానికి పూర్వ నేపథ్యం ఆసక్తికరమైనది ఒకటుంది. అది 1949వ సంవత్సరం. ఆచార్యులు అప్పటికి చాలా గ్రంథాలే రచించారు. ఆధ్యాత్మికంగా చాలా కృషి చేశారు. అష్టాక్షరి మంత్రం 13 కోట్లు మార్లు నియమ నిబంధనలతో జపించారు. అయి నా దైవసాక్షాత్కారం కలగలేదు. దీనితో జీవితంపైనే ఆచార్యులకు విరక్తి కలిగింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒక సన్యాసిగా మారి ఉత్తర భారతదేశం వెళ్లిపోయారు. హిమాలయాల్లో కొంతకాలం తపస్సు చేశారు. అప్పటికీ దైవ సాక్షాత్కారం సాధ్యపడలేదు. ఇక జీవితం పరిసమాప్తం చేయాలనుకున్నారు. ఆత్మపరిత్యాగం కోసం ఆ హిమాలయాల్లోని ఒక పర్వతాన్నెక్కి కిందికి దూకి చనిపోవాలనుకున్నారు. ఆ ఆలోచనతో వడివడిగా నడిచి వెళ్లసాగారు ఆచార్యులు.

సరిగ్గా అప్పుడు ఆచార్యులకు ఒక ఆకర్షకమైన స్వరం వినిపించింది. పేరుపెట్టి పిలుస్తున్న ఆ వ్యక్తిని చూశారు. ఆయన ఒక సన్యాసి దగ్గరకు వచ్చి ఆచార్యులతో మాట్లాడి తనతోపాటు ఆశ్రమానికి తీసుకెళ్లారు. చావురాత ఇప్పుడే లేదని సముదాయించి తన వద్ద ఆరు నెలలపాటు పెట్టుకున్నారు. చివరికి ఒకరోజు ఆ ఆశ్రమ పెద్ద తన దేశవ్యాపిత శిష్యులను హిమాలయాలకు పిలిపించుకున్నారు. వచ్చినవారిలో ఎందరో విద్వాంసులున్నారు. వారందరిచేత ఆచార్యుల విద్వత్ శక్తతను పరీక్షింపజేసినారు. పరీక్షించిన వారంతా ఆచార్యుల బహుభాషా పాండిత్య ప్రతిభను శ్లాఘించారు. అప్పుడు, ఆశ్రమపెద్ద నారాయణాచార్యులకు 'సరస్వతీపుత్ర' బిరుదు ప్రదానించి సత్కరించారు. మళ్లీ గృహస్థ జీవితం గడపమని ప్రొద్దుటూరుకు పంపారు. ఆచార్యులను ఆత్మహత్య పాలుకాకుండా కాపాడి, బిరుదుతో సత్కరించి పంపిన ఆ ఆశ్రమపెద్ద ఎవరో కాదు -స్వామి శివానంద సరస్వతి. మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం, ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు నండూరి రామమోహనరావులకు కూడా ఆ స్వామి శివానంద సరస్వతి గురువు.

అలా ఆచార్యులు ప్రొద్దుటూరు చేరాక అక్కడి అగస్తేశ్వర ఆలయానికి ప్రతిరోజు వెళ్లి ప్రదక్షిణలు చేసి రావడం దినచర్యగా చేసుకున్నారు. 40 రోజులు ప్రదక్షిణలు చేశాక ఒకరోజు ఒక అలౌకిక కవితావేశం ఆచార్యులలో పెల్లుబుకింది. అప్పుడు రచించిందే 'శివతాండవం' గేయకావ్యం. ఆ కావ్యం రగడ ఛందస్సులో రచించారు. ఆ కావ్యంలో సంగీతం, సాహిత్యం పోటీపడి అక్షరబద్దమయ్యాయి. ఆ కావ్యం ఆచార్యులకు మారుపేరుగా స్థిరస్థాయిగా నిలిచిపోయింది. కాలపరీక్షలో నిలిచింది. ఇంతచేసి ఆ గేయకావ్యం 70 పేజీలకు మించింది కాదు. అయితేనేం ఆచార్యులకు స్పెస్‌మెన్‌గా నిలిచిపోయింది.

ఆచార్యులు స్వయంగా తానే శివతాండవాన్ని పాడు తూ నృత్యం చేస్తుంటే, ఆ అద్భుత దృశ్యం, ఒళ్లు గగుర్పొడుస్తుంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలోని శివాలయం ప్రారంభోత్సవం జరిగినప్పుడు తిక్కవరపు రామిరెడ్డి ఆచార్యులను ఆహ్వానించారు. ఆరోజు ఆచార్యులు శివతాండవం గానం చేస్తూ, చేసిన తాండవాన్ని చూసినవారంతా, మహాశివుడే శివతాండవం చేస్తున్నట్లు అనుభూతించారని ఆనాటి పెద్దలు చెబుతారు. ఆచార్యులు ఎక్కడికి, ఏ సాహిత్య సభలకు వెళ్లినా శ్రోతలు, తొలుత శివతాండవమే వినిపించమని కోరేవారు. విశేషమేమిటంటే పరమవైష్ణవుని చేతిలో పరమశివుని కావ్యం శివతాండవం రూపుదాల్చడం, ఆచార్యులలోని శివకేశవ అభేద్య భావానికి ప్రతీక.

ఆచార్యులు రచించిన శతాధిక గ్రంథాలలో పెనుగొండ లక్ష్మి, మేఘదూతము, పురోగమనము, శివతాండవము, అగ్నివీణ చాలా కీర్తిప్రతిష్ఠలు ఆయనకు సమకూర్చాయి. ఈ గ్రంథాలన్నీ లఘుకావ్యాలే కావడం విశేషం. ఒక్క పెనుగొండ లక్ష్మి తప్ప మిగిలినవన్ని గేయ కావ్యాలు కావడం, అవన్నీ ఆచార్యులు తన యవ్వనదశలోనే రాసినవి కావడం గమనార్హం. అలాగే ఆచార్యులు 'జనప్రియ రామాయణం' కూడా గేయఛందస్సులోనే రచించారు. అయితే ఈ కావ్యం రెండు సంపుటాలు మాత్రమే వెలువడింది. 1972లో 'పద్మశ్రీ' అందుకున్న ఆచార్యులకు 1975లో శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, 1987లో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాయి.

భారతీయ సుప్రసిద్ధ సాహిత్య నిర్మాతల్లో పుట్టపర్తి నారాయణాచార్యులకు అరుదైన స్థానం ఉంది. గొప్ప వక్త. సమర్థుడైన విమర్శకుడు. శక్తత గల అనువాదకుడు. ఛాందసభావాలు గిట్టనివాడు. సంప్రదాయం మరువనివాడు. ఆధునికాన్ని అభిమానించేవాడు. అటువంటి మహాకవి, బహుభాషా చక్కవర్తి 'నేను నిత్య విద్యార్థిని' అని జీవితం కడవరకు చెప్పుకున్న నిగర్వసాహిత్యవేత్త. ఆయన ఏ యూనివర్సిటీ గడప ఎక్కకుండానే 14 భాషల్లో పాండిత్యం హస్తగతం చేసుకున్నారు. అది ఆయనకు భాషలపట్ల ఉన్న తడిఆరని దాహం. ఆయన 1990 సెప్టెంబర్ 1న కడపలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గ్లాస్‌నోస్త్, పెరిస్త్రోయికా పుస్తకాల్ని చదువుతూ కన్నుమూశారు.

ఆచార్యులు జన్మించి వంద వసంతాలు. ఈ సందర్భంగా కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంయుక్తంగా కడపలో 2013 మార్చి 28న ఆచార్యుల శత జయంతికి గుర్తుగా సాహిత్య సదస్సు ఏర్పాటు చేశాయి. ఆ సదస్సులో కేంద్ర సాహిత్య అకాడమి ప్రచురించిన ఈ వ్యాసకర్త రచన 'భారతీయ సాహిత్య నిర్మాతలు - పుట్టపర్తి నారాయణాచార్య' గ్రంథాన్ని ఆవిష్కరించనున్నారు. ఆరోజు ఆ గ్రంథం 800 ప్రతుల్ని ఆచార్యుల అభిమానులు కొనుగోలు చేయడానికి ముందస్తు ఏర్పాటు చేసుకోవడం విశేషం.

                                                                                                                                                      - శశిశ్రీ
93479 14465
ఆంధ్రజ్యోతి "వివిధ" సౌజన్యంతో..  


బహుభాషా చక్రవర్తి - పద్మశ్రీ పుట్టపర్తి
...మహాకవి, పద్మశ్రీ, డాక్టర్‌ పుట్టపర్తి నారాయణా చార్యుని స్మరించడమంటే, ఆయన సాహితీ విశ్వరూపానికి అక్షరాంజలులు సమర్పించడం తప్ప వేరొకటి కాదు. 2013 మార్చి 28 నాటికి ఆచార్యులు జన్మించి 99 వసంతాలు పూర్తయి, శతజయంతి సంవత్సరం ప్రారంభమైంది.
దేశంలో ఎందరో ప్రతిభా వ్యుత్పన్నత కల్గిన కవులు, పండితులు, విద్యాధికులు, విమర్శకులు, సంగీత కళాకారులు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో తమ ప్రత్యేక ప్రతిభాపాటవాలు కలిగి ఉంటారు. కానీ, పద్మశ్రీ పుట్టపర్తి అసాధారణమైన సాహితీ విద్యుత్తు కలిగిన శక్తి స్వరూపుడు. ఎంతటి కవియో అంతటి మహాపండితుడు, అంతేకాక, గొప్ప సాహిత్య విమర్శకుడు. అలాగే మంచి సంగీత కళాకారుడు. ఇన్ని ప్రత్యేకతలు ఒకే వ్యక్తిలో ఉండటం అపూర్వం... అనితర సాధ్యంకూడా.
ఆంధ్రము, సంస్కృతము, ప్రాకృత భాషలు, కన్నడ, తమిళ, మలయాళము, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్‌ మొదలగు పదునాలుగు భాషలలో ప్రవేశముతో పాటు పాండిత్యం కలిగి ఉండటం ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క పుట్టపర్తికే ఆ ఘనత దక్కింది. వారి చివరి దశలో కూడా తన 75వ ఏట కూడా పుట్టపర్తి ఉర్దూ భాషను నేర్చుకోవడానికి పెద్ద కృషి చేశారు.
ఛాందస భావాలు గిట్టనివాడు - దైవాన్ని నమ్మినా సంప్రదాయాలను గుడ్డిగా అనుకరించిన వాడు - బాహ్య వేషంకంటే, అంతర్యం విశిష్ఠమైనదని నమ్మినవాడే పుట్టపర్తి నారాయణాచార్య. ''దైవంతో పాటూ నాకు మానవుడు కూడా కావలెను'' అని అనగల్గిన మహామానవతావాది ఆయన.
తమ గురించి పుట్టపర్తి ఒక పద్యంలో....
''ఒకనాడు కృష్ణరాయ కిరీట సుమశేఖ
రంబైన యభయహస్తంబుమాది!
ఒకనాడు గీర్దేవతా కమ్రకంకణ
స్వనమైన మాధురీ ప్రతిభమాది!
ఒకనాడు రామానుజ కుశాగ్ర బుద్ధికే
చదువు నేర్పినది వంశమ్ము మాది!
ఒకనాటి సకల శోభకు తానకంబైన
దండిపురంబు పెన్గొండ మాది
తల్లిదండ్రుల మేధ విద్యానిషధ్య
పాండితీ శోభ పదునాల్గు భాషలందు
బ్రదుకునకు బడిపంతులు భాగ్యములకు
చీడపట్టిన రాయలసీమ మాది''
అటువంటి వైభవ ప్రాభవాల చరిత్ర కలిగిన పుట్టపర్తి గారికి ఆర్థిక పరిస్థితి చివరినాళ్ళ వరకు వేధించింది.
పుట్టపర్తి జీవితం, సాహిత్యం ఎన్నో ప్రత్యేకతలతో ముడివేసుకుని ఉండటం గమనార్హం.
అనంతపురం జిల్లా పెనుగొండ తాలుకా చియ్యేడు గ్రామంలో 1914 మార్చి 28న జన్మించిన పుట్టపర్తి - చిన్నప్పుడే పెనుగొండ కోటలోని శిథిల శకలాలు, శిల్పకళా వైభవాలు చూచి ఆశ్చర్యచకితులయ్యారు. ''పువ్వు పుట్టగానే పరిమళి స్తుందన్నట్లుగా తన 14వ యేట 'పెనుగొండ లక్ష్మి' అనే కావ్యాన్ని రాశారు. ఆ కావ్యం పుట్టపర్తి తెలుగు సాహిత్యానికి అందించిన తొలి ప్రసూనం. అందులో ఒక పద్యం....
''ఉలిలో తేనెల సోనలన్జిలికె
యి యొయ్యారి చిత్రించు, వే -
ళల నాశిల్పికి గన్ను గోనలను
ధారల్గట్టేనేమో జలం -
బులు, జేదోయి సెమర్చి యుండు
ననుకొందున్‌, భావనావేశ, భం-
గులు పైపై జెలరేగ ముద్దుగొని
యుండున్‌ ప్రేమ విభ్రాంతుడై''
ఈ కావ్యాన్ని తొలిసారిగా రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మగారు చూచి, ఈ కవికి విస్తారమగు వైభవప్రాభవాలు భవిష్యత్తులో లభిస్తాయని చెప్పారు.
మరో చిత్రమేమిటంటే, తన 19వ ఏట పుట్టపర్తి తిరుపతిలో విద్వాన్‌ చదువుకుంటున్న రోజులలో తాను రాసిన ''పెనుగొండ లక్ష్మి'' కావ్యమే పాఠ్యపుస్తకంగా ఉంది. ఆ సందర్భంగా జరిగిన పరీక్షలో తన కావ్యం గురించి అడిగిన ప్రశ్నకు జవాబు రాయాల్సి వచ్చింది. జవాబు 40పేజీలకు మించి రాశారు. పరీక్ష తప్పారు. కారణం 2మార్కుల ప్రశ్నకు 40పేజీల జవాబు రాయడమేనని తర్వాత తెల్సుకున్నారు. ఆ తరువాత విద్వాన్‌ పూర్తి చేశారు. ఇటువంటి అద్భుతమైన ఘటన సాధారణంగా ఏ కవి జీవితంలో జరుగదు.
దాదాపు 150 గ్రంథాలకు పైగా పుట్టపర్తి రాశారు. వాటిలో పెనుగొండలక్ష్మి మేఘదూతము, శివతాండవము, షాజీ, పాద్యము, జనప్రియ రామాయణము, పండరీ భాగవతము, శ్రీనివాస ప్రబంధము అలాగే ఇంగ్లీష్‌లో రచించిన ఁుష్ట్రవ ూవaఙవర ఱఅ ్‌ష్ట్రవ ఔఱఅసఁ, ఁుష్ట్రవ నవతీశీఁ జనాదరణ పొందాయి.
పుట్టపర్తి రచనలలో శివతాండవానికి వచ్చినంత కీర్తి ఇతర గ్రంథాలకు లభించకపోవడం గమనార్హం. ప్రొద్దుటూరులో పుట్టపర్తిగారు నివసించే ఆ రోజులలో ప్రతిదినం స్థానికంగా ఉన్న అగస్తేశ్వర ఆలయానికి వెళ్ళేవారు. ఒకరోజు శివాలయంలో అలౌకికమైన అనుభూతి కవితావేశం కలగడము. ఏకధాటిగా శివతాండవ రచన కావించడం జరిగింది. వైష్ణవుడైన పుట్టపర్తిగారు - శివుని గురించి, శివతాండవ రచన చేయడం పట్ల ఎందరో ఆశ్చర్యానందాలు ప్రకటించారు. శివతాండవం ఆరు విభాగాలు. కథావస్తువు శివపార్వతుల నృత్యము.
ఒకరోజు ప్రకృతి తనను ఒక వేదికగా అలకరించుకొంటోంది. కారణం పరమేశ్వ రుని శివతాండవము జరుగుతుందని, ఆ ప్రకృతి వేదికగా తనను తాను ఎలా సుందరతరం చేసుకుంటున్నదో కవి చూశారు. చూడగానే, భావం రసస్నిగ్థ కవితా ప్రవాహమైంది.
''తలపైని చదలేటి యలలు తాండవమాడ
నలలత్రోపుడుల గ్రొన్నెల పూవు గదలాడ
మొనసిఫాలముపైని ముంగురులు చెరలాడ
గనుబడొమ్మలో మధురగమనములు నడయాడ
గనుపాపలో గౌరి కసినవ్వు బింబింప
గనుబొమ్మలను తరుణ కౌతుకము చుంబింప
కడగి మూడవకంట గటిక నిప్పులురాల
గడుపేర్చి పెదవిపై గటిక నవ్వులు వ్రేల
ధిమిధిమి ధ్వని సరిద్గిరి గర్భముల దూగ
నమిత సంరంభ హాహా కారములురేగ
ఆడెనమ్మా! శివుడు / పాడెనమ్మా! భవుడు''
శివతాండవం రచన పుట్టపర్తి గారికి ఎనలేని యశస్సు నిచ్చింది. సంగీత, సాహిత్య, నృత్య కళారీతులు మూడు తెలిసిన వారికే ఈ కావ్యం పూర్తిగ అవగతం కాగలదు. ఆనందానుభూతి పారమ్యాన్ని చూపగలదు.
ఇది ఇలావుండగా, పుట్టపర్తిగారి ఆంగ్ల రచనలు రెండు. ఒకటి ఁుష్ట్రవ ూవaఙవర ఱఅ ్‌ష్ట్రవ ఔఱఅసఁ కాగా రెండవది ఁుష్ట్రవ నవతీశీఁ ప్రసిద్ధ ఆంగ్ల పండితుడైన హరీంధ్రనాథ్‌ చటోపాధ్యాయవారి ప్రశంశలు అందుకున్న ఆంగ్ల కవితా సంపుటి అందులో కొన్ని వాక్యాలు -
× తీవaస ్‌ష్ట్రవ ఝషతీవస bశీశీసర సayర aఅస అఱస్త్రష్ట్ర్‌ర
Aఅస శ్రీశీర్‌ ఎy రశ్రీవవజూ శీఙవతీ ్‌ష్ట్రవఎ
ుష్ట్రవ షశీతీసర షవతీవ స్త్రశీశీస, bబ్‌ షష్ట్రవతీ ఱర +శీసప
× ్‌బతీఅవస ్‌శీ ఎy ష్ట్రవaత్‌ీ aఅస ఝష ఱఅ ఱ్‌
A రష్ట్రaతీజూ తీay శీట శ్రీఱస్త్రష్ట్ర్‌, ఖీశ్రీఱషసవతీఱఅస్త్ర
్‌శీబ aతీవ ్‌ష్ట్రవ శ్రీఱస్త్రష్ట్ర్‌ ్‌ష్ట్రవ శ్‌ీష్ట్రవతీర a ఖీaఅ్‌aరy
ఒకనాడు 1955లో రాజమండ్రిలో మహాకవి శ్రీ పాదకృష్ణమూర్తి శాస్త్రిగారిని చూద్దామని పుట్టపర్తి వెళ్ళారు. అప్పుడు శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రిగారు శిష్యులతో ముచ్చటిస్తున్నారు. విషయం రాయలసీమ కక్షలకు కార్పణ్యాలకే కానీ, కళలకు మృగ్యమని అనుకుంటున్నారు. ఆ మాటలు పుట్టపర్తి చెవిన పడనేపడినాయి.కాసేపటికి శాస్త్రిగారు పుట్టపర్తిని చూచి, ''అబ్బాయిని కవిత్వమేమైనా రాశావా'' అని ప్రశ్నించారు.
సీమవాసి అయిన పుట్టపర్తి వెంటనే ధారాపాత ఆశుకవిత్వాన్ని ఛందోబద్ధంగా ఇలా వినిపించారు.
''హేరాళంబిదేనాదు భాగ్యమని నీ
వెంతెంతో ఘోషింతు, నీ వారిన్‌
జూచితి లెమ్ము చెప్పకుము
గొప్పల్‌ విప్పుగా గౌతమీ,
ధారవర్థిత గోస్తనీరస
సముద్యత్తుంగ భద్రానదీ
స్వారస్వంబుల ముందు తావక
పయఃపానంబు శోభించునా
అని చెప్పేసరికి, శాస్త్రిగారు అబ్బురపడి, రాయలసీమ కవితిలకుడైన పుట్టపర్తిని అలింగనము చేసుకున్నారు.
పుట్టపర్తిగారి వ్యక్తిత్వం చిత్రమైనది. ఎదుటి వ్యక్తి తనను గొప్పవాడంటే, అలాంటిదేం లేదు; ''నా అహం పండితః'' అంటారు. మీకు విషయ పరిజ్ఞానం పెద్దగా తెలిసినట్టులేదే అంటే ఫణీఫణమై తన సారస్వత విశ్వరూపాన్ని చూపుతారు. ఆయన ఒక చిత్ర సారస్వత పురుషుడు.
చివర కొన్ని మాటలు - జ్ఞానపీఠ అవార్డుకు పుట్టపర్తిగారు అన్ని విధాల తగినవాడని విజ్ఞులు భావించినా, అవార్డు వచ్చినట్లే కనిపించి, రాకుండా పోయింది. రాజకీయ పలుకుబడి లేని పుట్టపర్తికి అవార్డు రాకపోవడంతో డాక్టర్‌ గజ్జెల మల్లారెడ్డి ఇలా రాశారు.
''జ్ఞానపీఠ' రాలేదని
గ్లాని చెందిన ఫలమేమి?
'పట్టు' విద్యలో తెరుగని
బాధవల్ల లాభమేమి?
పైరవీలు లేనిది చిరు
పదవిరాదు మహాకవీ!
సామర్థ్యానికి నూకలు
చెల్లినాయి కళారవీ!''
నిజమే. జ్ఞానపీఠం ఆయనకు రానేలేదు. 1990 సెప్టెంబరు 1న కడపలో కన్నుమూశారు. ఇప్పుడు ఆయన భౌతికంగాలేరు. కానీ అభౌతికంగా ప్రజాహృదయ పీఠాలలో పదిలంగా ఉన్నారు. ఆయన సాహిత్యం కాల పరీక్షలకు ఎదురు నిలిచి పాఠక అభిమానుల ఆదరణ పొందుతుండటం విశేషం.
- శశిశ్రీ 
Mon. 1 st April 2013, IST    Visalandhra daily

Monday, March 18, 2013

ఆధునిక సాహిత్యంలో రాయలసీమ వెనుకబడలేదు

తవ్వా వెంకటయ్య
మిగిలిన తెలుగు ప్రాంతాలతో పోల్చితే రాయలసీమ సాహిత్యంలో ఆధునికత చాలా ఆలస్యంగా ప్రవేశించిందని విమర్శకుల అభిప్రాయం. ఇది నిజమా, కాదా అనేది ఓ పరిశోధనాంశం. రాయలసీమ సాహిత్యం గురించి ప్రాంత ధృక్పథంతో ఆలోచించిన మొదటి విమర్శకులు రాచమల్లు రామచంద్రారెడ్డి. ఆయన ‘ఈనాటి కడప జిల్లా స్థూల రేఖలు’ అనే వ్యాసంలో రాయలసీమలో ఆధునిక సాహిత్యం వెనుకబ డిందని పేర్కొంటూ అందుకు కారణాలను కూడా వివరించారు. సర్కారు ప్రాంతంలో ఆధునికత తొందరగా ప్రవేశించడం వల్ల అక్కడ ఆధునిక సాహిత్యం ముందుగా ప్రవేశించిందని రా.రా. అభిప్రాయపడ్డారు. అంతేగాక నూతన చారిత్రక శక్తులు కోస్తా జిల్లాల్లో ముందు తలెత్తడం వల్లనే ఈ వ్యత్యాసం ఏర్పడిందని, ప్రజాజీవితంలో విప్లవాత్మకమైన పరిణామాలు ముందు ఆ జిల్లాలలో ప్రారంభమయ్యాయని అన్నారు. ఆధునిక సాహిత్యం పుట్టుకకు పాశ్చాత్య సంస్కృతి ప్రభావమే కారణమని అందరూ పేర్కొన్నారు.

ప్రసిద్ధ విమర్శకులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య ‘రాయలసీమలో ఆధునిక సాహిత్యం- సామాజిక సాంస్కృతిక విశ్లేషణ’ అనే గ్రంథంలో ‘ఆధునిక సాహిత్యం రాయలసీమలో ప్రారంభం కాకపోవడానికిగానీ, కోస్తా జిల్లాలలో ప్రారంభం అయ్యాక కూడా అది రాయలసీమకు విస్తరించకపోవడానికి గానీ- రాయలసీమ కవి పండితుల ప్రతిభారాహిత్యం ఎంత మాత్రం కారణం కాదు. కొత్తదనాన్ని గురించి ఆలోచించగల వాతావరణం రాయలసీమలో నిర్మాణం కాకపోవటమే అందుకు నిస్సందేహమైన కారణం’ అన్నారు. నాటి సామాజిక రుగ్మతల్ని నిర్మూలించే సాహిత్య ప్రయత్నం జరగలేదని, అందుకు ఆధునిక భావాలు ఏమాత్రం లేవని ఆయన అభిప్రాయం.

ప్రముఖ సాహిత్య విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి ఆధునిక సాహిత్యం గురించి చెప్తూ, సమాజంలో ఆధునికత ప్రవేశించకుండా ఆధునిక సాహిత్యం రావడం అసాధ్యమన్నారు. ఆధునికత గురించి వివరిస్తూ, పారిశ్రామిక ప్రగతి, నీటిపారుదలాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి తద్వారా ఆర్థిక పరిపుష్ఠి సాధించడమే ఆధునికత అన్నారు. జీవితంలోకి ఆధునికత ప్రవేశించకుండా మానసికంగా ఆధునికతలో పరిపూర్ణత సాధించలేమని, జీవితం నుంచి సాహిత్యాన్ని వేరుచేయలేమని అన్నారు. రాచపాళెం అభిప్రాయంలో సమాజ ఆర్ధికాభివృధ్ధే ఆధునిక సాహిత్యానికి ప్రేరణగా భావించాలి.

వీరేగాక, రాయలసీమకు చెందిన పలువురు నవ, కథా రచయితలందరూ- రాయలసీమలో ఆధునికత ఆలస్యంగా ప్రవేశించడంవల్లనే ఆధునిక సాహిత్యం వెనుకబడిందన్నారు. వీరి అభిప్రాయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆధునికత ప్రజా జీవితం లోకి ప్రవేశిస్తే తప్ప ఆధునిక సాహిత్యం వ్యాపించిందనే విషయం అవగతమౌతుంది. అయితే ఇక్కడ తెలియవలసింది ఆధునికత అంటే ఏమిటనే విషయం.
ఆధునికత అనే పదం కాలానికి, స్వభావానికి సంబంధించినదిగా, 19వ శతాబ్దం తరువాత వెలువడిన సాహిత్యమే ఆధునిక సాహిత్యంగా విమర్శకులు భావిస్తున్నారు. ఆధునిక శబ్దం కాలాన్ని సూచిస్తుందా, స్వభావాన్ని సూచిస్తుందా? అనే విషయం ప్రక్కన పెట్టి ఆలోచిస్తే, రాచపాళెం అన్నట్టు పారిశ్రామిక ప్రగతి ఆధునికతకు మార్గం వేసింది. యూరోపియన్ల రాకతో భారత దేశంలో ఆధునిక భావాలు మొదలయ్యాయి. భారతీయ సాహిత్యంలోగానీ, తెలుగు సాహిత్యంలోగానీ ఆధునికతను తెలుసుకునే ముందు, ప్రపంచ ఆధునిక యుగ లక్షణాలను తడమాలి. ఆధునికత రూపు దిద్దుకుంది యూరప్‌ లోనే.

గ్రీకు సంస్కృతిని యూరప్‌ నాగరికతకు మార్గదర్శకంగా భావిస్తాం. ‘కానిస్టాంట ్‌నోపుల్‌’ను గ్రీకు సంస్కృతికి నిలయంగా చెప్పుకుంటాం. క్రీ.శ 1453లో టర్కీ సుల్తాన్‌ కానిస్టాంట్‌ నోపుల్‌ పై దండెత్తి ఆక్రమించుకున్నాడు. దీంతో గ్రీకు పండితులు తమ సాహిత్యగ్రంథాలను తీసుకుని యూరప్‌కు పారిపోయారు. పారిపోయిన పండితులు తమ సంస్కృతి, సాహిత్యాల పునరుద్ధరణకు పూనుకున్నారు. ఈ ‘సాంస్కృతిక పునరుజ్జీవనం’ పని ఇటలీలో కానిస్టాంట్‌నోపుల్‌ పతనం కంటే ముందే జరిగింది. ఆనాటి రచయితలు పెట్రార్క్‌, డాంటే, భాకాషియో మొదలైనవారు తమ దేశాల ప్రాచీన సాహిత్యాన్ని చదవమని ప్రజల్ని ప్రేరేపించారు. అందుకోసం వారు అనేక నూతన పద్ధతుల్ని ప్రవేశపెట్టారు. తమ ప్రజలు మాట్లాడే ప్రాంతీయభాషలోనే తమ రచనలు చేయడం ప్రారంభించారు. బైబిల్‌ను అన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించారు. దీంతో మూఢనమ్మకాలు, మూఢాచారాలు తగ్గాయి. సాంస్కృతిక పునరుజ్జీవం ఫలితంగా నాటి యూరోపియన్‌లు ప్రతి విషయాన్ని తర్కించి, ప్రశ్నించి, పరిశోధించి శాస్ర్తీయ పద్ధతులద్వారా నేర్చుకోవడం ప్రారంభించారు. రాజకీయ, సామాజిక, మత రంగాలలోని ఈ మార్పులు యూరప్‌లో ఆధునిక యుగ ప్రారంభానికి నాందిగా చెప్పవచ్చు.

యూరోపియన్‌ల రాకతో భారతదేశంలో, ఆంధ్రదేశంలో ఆధునిక యుగభావాలు వెలిశాయి. యూరోపియన్‌లు క్రీ.శ 1498లో భారత్‌లో ప్రవేశించారు. కానీ వాస్తవంగా 1757 జూన్‌23న రాబర్ట్‌క్లైవ్‌ బెంగాల్‌పై సాధించిన విజయంతో భారతదేశంపై యూరోపియన్‌లు రాజకీయ అధికారాన్ని సాధించారు. దీనితో భారతీయులపై బ్రిటిష్‌వారి ప్రభావం ప్రారంభమైంది. భారతీయ ప్రజలు అటు పాశ్చాత్యసంస్కృతికి ఇటు హిందూ సంస్కృతికి మధ్య నలిగిపోయారు. చివరకు అధికారంలో ఉన్న పాశ్చాత్య సంస్కృతే ఎక్కువ ప్రభావం చూపింది. దీనికి తోడు మెకాలే, బెంటింగ్‌లు ప్రవేశపెట్టిన ఆంగ్లవిద్య భారతీయుల్ని ఆలోచింపచేసింది. కొన్ని కొత్త ప్రాపంచిక విషయాలు భారతీయులకు తెలిసొచ్చాయి. కాల్పానిక వాదం, మానవతా వాదం కవులకు, విద్యావంతులకు కొత్త చూపును కల్గించాయి. తత్ఫలితంగా ఆధునిక సాహిత్యం ఆవిర్భవించింది.
ఈ ప్రభావానికి మన తెలుగు కవులు పండితులు కూడా లోనయ్యారు. ఆధునిక సాహిత్యంవైపు ఆలోచనలు చేశారు. మన సంస్కృతిలో, సాహిత్యంలో మార్పులు అవసరమని భావించారు. దీనితో తెలుగు సాహిత్యంలో కొత్త సాహిత్య ధోరణి ప్రవేశించింది. యూరోపియన్‌ల రాకతో, వారు స్థాపించిన క్రైస్తవ మిషనరీలతో, వారు ప్రవేశపెట్టిన ఆంగ్లవిద్యావిధానంతో ఆధునికత వచ్చిందనుకుంటే, మిగిలిన తెలుగు ప్రాంతాలతోపాటు రాయలసీమలో కూడా ఆధునిక సాహిత్యం ప్రవేశించిందనే చెప్పాలి.

క్రీ.శ 1805లో రాయలసీమ ప్రాంతమైన జమ్మలమడుగులో ‘లండన్‌మిషనరీ సొసైటీ’ స్థాపితమయ్యింది. దీని ద్వారా వారు విద్యా వ్యాప్తి, మత ప్రచారం సాగించారు. క్రీ.శ. 1835లో స్థాపితమైన బాపిస్ట్‌సంఘం రాయలసీమ జిల్లాల్లో చురుగ్గానే పనిచేసింది. 1916లో చిత్తూరు జిల్లా మదనపల్లెలో అనిబిసెంట్‌ దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించారు. ఇది విద్యావ్యాప్తికి, అస్పృశ్యత నివారణకు కృషిచేసింది. క్రీ.శ.1900లో రాయలసీమలో 36 సాంఘిక సంస్థలున్నాయి. దీంతో కోస్తాప్రాంతంతో సమానంగా ఇక్కడ ప్రజలకు కూడా ఆధుని భావాలు పరిచయమయ్యాయి. అయినా రాయలసీమ వాసులు ఆధునికతలో వెనుకబడ్డారంటారు!
సమాజంలోకి ఆధునికత ప్రవేశించకుండానే 1872లో నరహరిగోపాలశెట్టి ‘శ్రీ రంగరాజచరిత్ర’ నవలను ఎలా రాయగలిగాడు? ఆధునికత ప్రవేశించకుండానే కట్టమంచి రామలింగారెడ్డి 1899లో ‘కళాపూర్ణోదయం ప్రశంస’ అనే విమర్శను, ‘ముసలమ్మ మరణం’ అనే ఆధునిక కావ్యాన్ని ఎలా రాయగలిగాడు? ఆధునికత ప్రవేశించకుండానే ధర్మవరం రామక్రిష్ణమాచార్లు, కోలాచం శ్రీనివాసాచార్లు ఇతోధికంగా ఆధునిక స్పృహతో నాటకాలు ఎలా రాయగలిగారు? ఆధునికత లేకుండానే రాయలసీమనుండి పత్రికలు వచ్చాయా? బళ్ళారినుండి 1835లో సత్యదూత, (దీనిని తొలితెలుగు పత్రికగా భావిస్తున్నారు), 1863లో శ్రీయక్షిణీ, 1875లో భారతి, కడప నుండి 1875లో ప్రబుద్ధాంధ్ర, కడప నుండి 1897లో ప్రభావతి- ఇలా చెప్పుకుంటూ పోతే స్వాతంత్య్రానికి పూర్వం దాదాపు యాభైకి పైగా పత్రికలు రాయలసీమనుండి వచ్చాయి. ఇవన్నీ రాయలసీమలో ఆధునికత ప్రవేశించకుండానే వచ్చాయా? నాగరాజు అనే పరిశోధకుడు ‘తొలి రాయలసీమ నవల’ అనే శీర్షికతో (సూర్య, 2013 జనవరి 28) 1950కి పూర్వం దాదాపు ఇరవైకి పైగా నవలలు రాయలసీమనుండి వచ్చాయని తేల్చాడు. 1926నుంచే రాయలసీమలో కథానికలు వచ్చాయి.

ఇవన్నీ రాయలసీమలో ఆధునికత లేకుండానే జరిగాయా?
1879లో ఆంధ్ర ప్రాంతంలో వితంతు వివాహం జరక్కమునుపే, పి. ఆనందాచార్యులు, ధర్మవరం రామకృష్ణమా చార్యులు రాయల సీమలో వితంతువివాహాలను జరిపినట్లు 1872 ఆగస్టు ‘పురుషార్థప్రదాయిని’లో పేర్కొన్నారు. పారిశ్రామి ప్రగతికి ప్రతీకగా భావించే ఆధునిక రవాణామార్గమైన రైల్వేలైన్‌ ఏర్పాటు మొట్ట మొదట 1862లో రేణిగుంట నుండి పుత్తూరు మధ్యనే జరిగింది. కోస్తాంధ్ర ప్రాంతంతో పాటు రాయలసీమలో కూడా ఆంగ్ల విద్యాసంస్థలు, పత్రికలు, సంఘసంస్కరణ సంస్థలు రాయలసీమ ప్రజల జీవితాల్ని కొంతవరకు ప్రభావితం చేశాయి. దీనితో పాతభావాలు, మూఢన మ్మకాలు బలహీనపడడం మొదలైంది. నూతనభావాలు మొదలయ్యాయి. మన సంస్కృతిని సంస్కరించాల్సిన అవసర ముందని గ్రహించారు. ఆధునిక సాహిత్య పోకడలు కోస్తాప్రాంతంతోపాటు రాయల సీమలోనూ ఆలస్యంగానైనా మొదల య్యాయి. కానీ విసృతంగా కొనసాగలేదు. పారిశ్రామిక ప్రభావం రాయలసీమలోనే మొదలైంది. కానీ అన్ని రంగాలలో వ్యాపించలేకపోయింది. రాయలసీమ నాయకులు కూడా స్వతంత్ర ఉద్యమంతో పాటు కొన్ని సామాజిక ఉద్యమాలలో పాల్గొన్నారు. కానీ కందుకూరి వంటి గొప్ప సంస్కర్తలు ఒక్కరైనా ఇక్కడ లేకపోయారు.

కోస్తాప్రాంతంలో సంప్రదాయకవులు ఆధునిక సాహిత్యాన్ని అంతసులభంగా అంగీకరించలేదు. ఇదే సమయంలో కందుకూరి రాసిన ‘సరస్వతి నారద విలాపము’ కొంతసంచలనం కలిగించింది. ఆధునిక సాహిత్యప్రక్రియలకు కందుకూరే ఆద్యుడు. తర్వాత ఆధునిక సాహిత్యానికి రాయప్రోలు, గురజాడ మార్గదర్శకులుగా చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. తొలి స్వీయ చరిత్ర, తొలి నాటకం, తొలి కథానిక, భాషాఉద్యమం, పత్రికలు వంటివన్నీ కోస్తాప్రాంతంలోనే మొదటవచ్చాయి. దీని ఆధారంగా మిగిలిన తెలుగుప్రాంతం కంటే కోస్తాప్రాంతం ఆధునిక సాహిత్యంలో ముందుందనేది విమర్శకుల అభిప్రాయం.
రాయలసీమవాసులు కూడా తాము ఆధునిక సాహిత్యంలో వెనుకబడి పోయామని మానసికంగా అంగీకరిస్తున్నారు. ఇది బాధాకరం.

నాటి రాయలసీమవాసులు కూడా ఆధునిక సాహిత్య ప్రక్రియల్ని అందిపుచ్చుకున్నారు. మన ముందు తరాల రాయలసీమకవులు, రచయితలు చేసిన ఆధునిక సాహిత్య కృషిని మనం గౌరవించాల్సి ఉంది. ఈ వ్యాసప్రధాన ఉద్దేశ్యం రాయలసీమ ఆధునిక సాహిత్యాన్ని ప్రాంతదృష్టితో చూడటమే. సంప్రదాయ సాహిత్యంలో ఓ వెలుగు వెలిగిన రాయలసీమ కవులు, పండితులు అంత సులభంగా ఆధునిక సాహిత్యం వైపు తమ దృష్టిని మళ్ళించలేకపోయారు. ఎందుకలా జరిగింది అనే విషయంపై కూడా లోతుగా పరిశోధన జరగాల్సి ఉంది. వారి సాహిత్య వారసులుగా దాన్ని వెలికితీయాల్సిన బాధ్యత మనపై ఉంది. సమగ్రంగా ప్రాంత దృష్టితో సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సి ఉంది. అంతే తప్ప ఇది మిగిలిన తెలుగు ప్రాంతాలతో పోటీపడడం కోసం మాత్రం కాదు.
ఆధునిక సాహిత్యంలో కోస్తా ప్రాంత ప్రమేయం ఎక్కువగా ఉంది. ఇది నూరుపాళ్ళు నిజం. అలాగని ఆధునికత రాయలసీమలో చాలా ఆలస్యంగా ప్రవేశించిందనడం అవాస్తవం.రాయలసీమలో ఆధునిక ప్రక్రియలు కొంతలో కొంత వెనుకబడ్డాయి తప్ప మరీ వెనుకబడలేదు. పత్రికలను స్థాపించడంలోనూ, ఆధునిక సాహిత్యవిమర్శలో, నవలా రచనలో, కధానికా రచనలో, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడంలో రాయలసీమ వాసులు స్పందించారు.మరింతలోతుగా సమగ్రంగా ప్రాంతీయ దృక్పథంతో పరిశోధన జరిగితే రాయలసీమ ఆధునిక సాహిత్యం ప్రస్ఫుటంగా వెలుగులోకివస్తుంది. 
March 18, 2013, Surya daily 19-03-2013

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...