Tuesday, February 26, 2013

‘కరువు’ తీరా సీమ కవితలు

srinrvas-anki1951-53 మధ్య భయంకరమైన మరొక కరువు దాపురించింది. ఇది 1944 కరువు కంటే చాలా దారుణమైనది.
20వ శతాబ్దంలోనే అత్యంత భయానకమైనది. రష్యా గోధుమలు, బియ్యం ఈ కరువు సహాయార్థం అందజేసింది. ప్రతిరోజు 2.04 లక్షల మంది 448 గంజి కేంద్రాల్లో తమ ప్రాణాల్ని నిలుపుకు న్నారు. ఈ కరువు గురించి అనంతపురం జిల్లా పద్యకవి బెళ్ళూరి శ్రీనివాసమూర్తిగారు 1954లో ప్రచురించిన ‘‘తపోవనము’’ అనే పద్యకవితా సంకలనంలో ‘‘గంజి కేంద్రం’’ ఖండికతో రాసిన ఐదు పద్యాలు ఆంధ్రదేశంలో తీవ్ర సంచలనాన్ని సృష్టించాయి
రాయలసీమ నుండి 1960 ముందు ఆవిర్భవించిన కవిత్వంలో కొన్ని పరి మితులు కనిపిస్తాయి.

కట్టమంచిగారి ‘‘ముసలమ్మ మరణము’’ కావ్యం లో సీమలోని సహజమైన కరువుల ప్రస్తావన లేదు. ఇందులో వర్ణించే చెరువుల వర్ణనలు మహాసముద్రాల్ని తలపిస్తాయి. అయితే కావ్య వస్తువు కవికున్న స్థానిక మమకారాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు స్థానిక చైతన్యాన్ని ప్రతిబింబించే ‘‘పెనుగొండపాట’’, ‘‘పెనుగొండలక్ష్మి’’ వంటి కావ్య వస్తువుల్ని స్వీకరించినప్పటికీ కరువుల గురించి మాట్లా డలేదు. అయితే పుట్టపర్తిగారి ‘‘మేఘదూతం’’లో కరువు ప్రస్తావన కలిగిన కొన్ని వాక్యాలున్నాయి. ‘‘క్షామపీడిత గ్రామములు వణుకాడ/ నీ మొగము వీక్షింతుర నీరందక తెలుగుప్రజ...’’ అని వర్షం కోసం ఆకాశం వైపు ఆశగా చూసే రాయలసీమ జీవన చిత్రం కనిపిస్తుంది.

కోస్తా ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ కవి బాలగంగాధర తిలక్‌ ‘‘అమృతం కురిసిన రాత్రి’’లో ‘‘భూలోకం’’ పేరుతో ఒక కవిత రాశారు. 1941-44 మధ్య వచ్చిన బెంగాల్‌ కరువు కరాళ నృత్యాన్ని పత్రికల్లో చదివి ఈ కవిత రాశారు. ఆ కరువు సమయంలో రాయలసీమ బీభత్సమైపోయింది. ప్రజ ల మానాభిమానాల్ని ప్రశ్నార్థకం చేస్తూ ధరించడానికి దుస్తులు కూడా లేని దౌర్భాగ్యపుస్థితి! ఈ క్షామక్షోభాన్ని విని మైసూరు మహారాజా వారు గొప్ప విరాళం పంపారట. అనేకమైన చౌక దుకాణాల్ని తెరిచి తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్మవలసి వచ్చింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన బలమై న పత్రికలు నాడు లేకపోవడం వల్ల రాయలసీమ గురించి బయట ప్రపం చానికి తెలిసే అవకాశం లేకపోయింది.

అంతేకాక స్వాతంత్రోద్యమానికి బెంగాల్‌ స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషిస్తున్నందున తిలక్‌ బెంగాల్‌ కరు వు మీద కవిత్వం రాశారు. ఆ కరువు సమయంలో రాయలసీమ కవులెవ్వరూ స్పందిం చలేదు. స్థానికంగా కవులకు ఆ చైతన్యం లేకపోయింది. ఈ కరువు 1946 వరకు ఈ ప్రాంతంలో కొనసాగింది. 1947 ఆగష్టూ 15 నాటి అర్ధరాత్రి స్వాతంత్రోత్స వాలకు కంటి మేఘాలు ద్రవించి కన్నీటి చినుకులు కురిసాయి తప్ప ఆకాశం నుండి మాత్రం వర్షం రాలేదు. అందుకే భూమన్‌ అన్నట్లు ‘‘అధికారం ఒక చేతి నుండి మరొక చేతికి మారగానే కరువు మటుమాయమైపోతుందని వారేమీ కలగనలేదు.’’1951-53 మధ్య భయంకరమైన మరొక కరువు దాపురించింది. ఇది 1944 కరువు కంటే చాలా దారుణమైనది. 20వ శతాబ్దంలోనే అత్యంత భయానకమైనది. రష్యా గోధుమలు, బియ్యం ఈ కరువు సహాయార్థం అందజేసింది. ప్రతిరోజు 2.04 లక్షల మంది 448 గంజి కేంద్రాల్లో తమ ప్రాణాల్ని నిలుపుకున్నారు.

ఈ కరువు గురించి అనంతపురం జిల్లా పద్యకవి బెళ్ళూరి శ్రీనివాసమూర్తిగారు 1954లో ప్రచురించిన ‘‘తపోవనము’’ అనే పద్యకవితా సంకలనంలో ‘‘గంజి కేంద్రం’’ ఖండికతో రాసిన ఐదు పద్యాలు ఆంధ్రదేశంలో తీవ్ర సంచలనాన్ని సృష్టిం చాయి. ప్రస్తుత డిగ్రీ రెండవ సంవత్సరం తెలుగు వాచకంలో ఈ అయిదు పద్యాల్ని చేర్చారు.గంజి కేంద్రం వద్దనున్న జనసమూహం యొక్క దీనస్థితిని ఈ పద్యాలు తెలియజేస్తాయి.‘‘ముదుసళ్ళు స్త్రీలు పురుషులు/ పెదవులు తడియారు చంటి బిడ్డలు మెయిప/య్యెదలేమి సిగ్గుమరచిన/సుదతులు గలరిందు క్షుదకు సోలి నడచుచున్‌’’ అన్ని వయసుల వారు ఆకలితో అల్లాడుతూ వస్తున్నారు.

పెదాలు తడియారిపోయిన పసిబిడ్డలు కూడా! పరిస్థితి ఎంత తీవ్రంగా వుందంటే స్త్రీలు పమిట వేసుకునే స్థితిలో లేరు. సిగ్గు అభిమానం వంటి మర్యాదలు మరచి పోయారు. భారతీయ స్త్రీకి కొంగు చాలా జాగ్రత్తగా చూసుకునే వస్త్రవిశేషం. దానిని కూడా గమనించే స్థితి లేదు. ఆకలి అభిమానాన్ని చంపేస్తుంది. ఇటువంటివే మిగిలిన పద్యాలు కూడా! అయితే బెళ్ళూరి శ్రీనివాసమూర్తిగారి నిబద్ధతను ప్రశ్నించాల్సిన అవసరం వుంది. ఎందుకంటే ‘‘తపోవనం’’ సంకలనంలోనే ‘‘రాయల సీమ’’ పేరుతో మరొక్క ఐదు పద్యాలు రాశారు.
ఇందులో రాయలసీమ గొప్ప ఋషివాటికగా వర్ణించారు.

‘‘కలగీతంబులు పల్కు పక్షులిచటన్‌ కంఠస్వరంబెత్తి ని/ర్మల శీతానిల వీచికల్‌ వెలయు నీ ప్రాంతంబులన్‌ భావమం/జుల లీలన్‌ ప్రవహించు నిర్ఘరిణులిచ్చో కొండలు దుండి రా/యలసీమా స్మరింపజేతు ఒక దివ్యానందమేనాటిదో’’. మిగిలిన పద్యాలు ఈస్థాయి వర్ణన కలిగినవే! ఈ పద్యాల్లోని పరిస్థితులు కవి జీవించిన నాటికి అక్షరాలా లేవు. ఒకవైపు గుండె ద్రవించే రాయలసీమ దుర్భర పరిస్థితులు చెప్పి, మరొక వైపు రాయలసీమ పరిస్థితులు గొప్పవంటూ చెప్పడం కవి నిబద్ధతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ కరువు మీదనే భైరపురెడ్డి నారాయ ణరెడ్డి ‘‘రాయలసీమ రైతు’’ అనే ఒక సంపూర్ణ పద్యకావ్యాన్ని రాశారు. ఈయన స్వయం గా రైతు. చెమటను నాగలి చాళ్ళలో నింపిన అనుభవాలనుండి ఈ కావ్యాన్ని రాశారు. 1955 ప్రాంతంలో రచించినప్పటికీ చాలా ఆలస్యంగా 1976లో ప్రచురించడం జరిగింది. సాంప్ర దాయ సౌందర్య అలంకారికతో చాలా ఫ్రౌడంగా రాశారు. కడప జిల్లా రాయచోటి తాలూకా బహుదానది తీరంలోని ఒక చిన్నపల్లె కథా స్థలం. స్థలాభావం వల్ల ఇక్కడ విశ్లేషించే అవకాశం లేదు.

ఎన్ని కావ్యాలు వచ్చినా, వాస్తవ చిత్రణలో, సహజ అభివ్యక్తిలో రాయలసీమకు నిజమైన ప్రాతినిథ్య కావ్యం విద్వాన్‌ విశ్వంగారి ‘పెన్నేటిపాట’! ‘‘కవితావేశంలో మహాప్రస్థానానికి ధీటైనదిగా, 20వ శతాబ్దిలో కండగల కావ్యభాషను సృష్టించు కున్న అతితక్కువ కావ్యాల్లో పెన్నేటిపాట ఒకటి’’గా వల్లంపాటి వెంకట సుబ్బయ్య అన్నారు. పెన్నేటిపాట గొప్పదనం ప్రత్యేకంగా చర్చించాలి.
రాయలసీమ నేపథ్యంగా వచ్చిన మరొక సాంప్రదాయ పద్యకావ్యం ‘‘అనిల సందేశం’’ దీన్ని పాలా వెంకటసుబ్బయ్యగారు రచించారు. ఈ కావ్య శిల్పం పూర్తి గా పుట్టపర్తివారి మేఘదూతం వంటిదే. మేఘుడు నాయకుడు, భూదేవి నాయికగా అత్యంత సాంప్ర దాయకంగా ఆధునిక ధృక్ఫథానికి విరుద్దంగా రచించడం జరిగింది.

సాధారణంగా రాయలసీమ కరువు మీద సాంప్రదాయిక కవిత్వం అనగానే వెంటనే జ్ఞాపకం వచ్చేది నండూరి రామకృష్ణమాచార్యుల పద్యం. ‘‘క్షామము దాపు రించి పలుమారులు చచ్చెను జంతు సంతతుల్‌/వేమరు చచ్చినారు ప్రజ వేనకు వేలు చరిత్రలోపలన్‌/ క్షామములు ఎన్నివచ్చినా రసజ్ఞత మాత్రం చావలేదు జ్ఞా/నామృతవృష్టికిన్‌ కొరతనందని రాయలసీమ లోపలన్‌’’ రాయలసీమ సాహిత్యాన్ని గురించి ఆవేశంగా మాట్లాడేవారంతా ఈ పద్యంతోనే తమ ప్రసంగాలను ప్రారంభిస్తారని రాచపాలెం అన్నారు. అయితే నండూరి వారు పేర్కొన్న రాయల సీమ రసజ్ఞత ఏది, ఎలాంటిది. నండూరి వారి దృష్టిలోని రసజ్ఞత పౌరా ణిక ప్రాబంధిక రసజ్ఞతే సుమా. కొంత ఉదారవాదుల యితే కావచ్చుకాని సారాంశంలో ఆయన ప్రబంధీకులే. అదేవిధంగా చాలామంది అవధానులు అవధాన సంద ర్భాల్లో పృచ్ఛకుల కోరికమేరకు పద్యాలు వ్రాశారు.

1977-78 ఏ.ఎన్‌. నాగేశ్వర్‌రావు ‘‘కరు వు’’ అనే దీర్ఘకవిత రాశారు. కరువులలో సామాన్యుని గుండెకోత ఎలాంటిదో సామాన్యు ని భాషలోనే రాశారు. ‘‘కరువుకు పుట్టిన కొదమ బిడ్డలం/చీకటి పోరులో బతికిన కుసు మాలం’’ అని ‘‘కరువు పిడికిలి’’ బిగించారు. ‘‘జలగ వర్గాలు తమ నోటితో/రాళ్ళసీమ నెత్తుటిగానే కాదు/కన్నీళ్ళను కూడా’’ పీలుస్తారనే వాస్తవాన్ని విశ్లేషించారు. ‘‘ఊపిరి పీల్చిన ప్రతి సెకను చచ్చి బ్రతికిన కాలమిది’’ అనే ఏ.ఎన్‌. మాట సీమ లోని వాస్తవ దృశ్యం. ‘‘దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు’’ అని ఇక్కడ ప్రసిద్ధి చెందిన సామెత.‘‘స్వప్నాలన్నీ నిద్రించేవాళ్ళకే’’ నంటూ రాధేయ ‘‘పోరాటంలో ముందుండవలసిన యోధులంతా/ పల్లకీలు మోసే బోయిలుగా మారడమే/ ఇక్కడ అతిపెద్ద విషా దం... అమ్మ స్తన్యం కోసం బొట్ల కోసం/ ఎండిపోయి పిడచకట్టుకు పోయి/ నాలుకను చాస్తున్నాడు...

ఇక్కడ తగలబడేవి అడవులు మాత్రమే కాదు ఆకలి దేహాలు కూడా’’ అని రాయలసీమ ‘‘క్షతగాత్రాన్ని’’ రాధేయ గానం చేశారు. అందుకే రాచపాళెంగారు ‘‘ఈ సీమ ఆస్తులు లేని వీలునామా’’ అని వాఖ్యానించారు. రైతు ఆత్మహత్యలు జరగడానికి ఒక చారిత్రక నేపథ్యం వుంది. ఆహార పంటల స్థానంలోకి వ్యాపార పంటలు రావడం, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఆగి పోవడం, సరళీకరణ, ప్రపంచ బ్యాంకు ఒప్పందాలు, జీవిత విధ్వంసం వంటివి చాలా వున్నాయి. అందుకే రాచపాళెంగారు ‘‘రైతుకు ఉరితాడు బిగిసింది/ఊపిరి పోవడం ఎప్పుడో మొదలైంది’’అని అన్నారు. ఈ వాస్తవాన్ని చూసి వై.శ్రీరాములు ‘‘ఆకాశంలోకి ఎడారి పాకింది/చెట్లకు పుట్లకే కాదు/అనంతపురంలోని మట్టికే చెదలు పట్టింది/ఇక్కడి చరిత్ర పుటల్లోని ప్రతి అక్షరం/రైతుల సమాధుల ఫలకాలపై మండే భాస్వరం’’ అని ఆవేశపడ్డారు.
వ్యవసాయమంటే తిండిగింజల ఉత్పత్తి కాదు. జీవితాన్ని సృష్టించడం. జీవనానికి ప్రాణం పోయడం. నాగలి చాలులో నాగలి తీసిన ఊపిరి నుండే అన్ని రకాల కళలు జీవన విధానాలు పురుడు పోసుకుంటాయి. ‘‘దున్నడం నీవు ప్రారం భించిన నాటినుంచే కదా/ అన్ని కళలూ అవతరించింది, అందచందాలొలికిం చిందీ/అందుకే సకల కళలకూ నవనాగరికతలకూ నీవే ధాతవూ తాతవూ’’ అని పి.ఎల్‌.శ్రీనివాసరెడ్డిగారు రైతుకు పట్టం కట్టారు. అజ్ఞానపు అంధయుగంలో ఆకలి లో పుట్టిన మనిషి యొక్క జీవిక అవగాహన నుండి వ్యవసాయం ఆవిర్భవించింది. వ్యవసాయం నుండే అన్ని రకాల ఇతర వ్యవస్థలూ జన్మించాయి. అందుకే ఆంగ్లనై ఘంటికకారుడు వెబ్‌స్టర్‌ ఇలా అంటాడు "Cultivation of the Earth is the most important labour of man. When tillage begins other arts follow. There fore let us never forget that the farmers are the founders of Civilization".
April 9, 2012 -surya daily

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...