Tuesday, February 26, 2013

కడపటి పైసా - కథ



తుంగభద్రా తీరము. సాయంకాలమయి రెండు గడియల ప్రొద్దైనది. చీకటులు క్రమ్మనారంభించినవి. కొంతవరకు మబ్బులు నిండి వానవచ్చు చిహ్నములు దోచినవి. ఒకానొక యవ్వన పురుషుడు ఏటిలోని మడువు దగ్గరకు నల్లటి గుండ్ల మీదుగ పయనమగుచున్నాడు. అతని విగ్రహమును వర్ణించుటకు రాదు. అతడు ధరించిన వస్త్రములు మాత్ర మాచీకటిలోను గూడ అతని స్థితిని కొంత యెరుకపరచుచున్నవి. మొలనుగట్టిన దోవతి మోకాళ్లపైననే చిరుగులచే చిందులు ద్రొక్కుచున్నది. బాహువుల మీద ధరించిన శెల్లాయును చిరిగి తోరణమైయున్నది.


మడుగు సమీపించినది. తళుక్కున నొక్క మెరపు మెరసినది. మడుగులో దాని నీడ ప్రతిఫలించినది. గభీలున నీÄౌవ్వనున కేమియో తోచినది. అతడు గట్టిగ గొణగ నారంభించినాడు. ఏమనుచున్నాడో?
"ఏమిటి? ఇంత సాహసమునకు నొడిగట్టితిని. ఏల నొడిగట్టరాదు. న్యాయమార్గానువర్తినై స్వతంత్రముగా జీవనము జరుపుకొనుటకు ప్రయత్నించితిని. నాచేసిన పనిని ఎల్లరును సెబాసనుచు వచ్చిరి. ఎల్లరును నాయుద్యమములులో కోపకారములని భూషించుచు వచ్చిరి. నాస్వాతంత్య్రము నుగ్గడించిరి. కాని అది యేమి లోకచిత్రమో కార్యమునకు వచ్చునప్పటికి ఎల్లరును నోటిమాటలతో రిత్తచూపులతో నూరకుండు వారైరి. దగ్గరి చుట్టాలు సయితము నాశక్తి ప్రతిభలను నాధర్మపరత్వమును నెరింగియు నాకు తోడ్పడక వృధాదూషణలతో నను వేధించిరి. న్యాయముగా బ్రతుకుట కుటుంబీకునకు నీకాలమున దుస్సాధ్యమని ఆలుబిడ్డలను వదలి వచ్చితిని. పని చేయుదమన్న గౌరవమగు పని యిచ్చువారలును గానరారు. పిడికెడు కూటికి పగలెల్లయు నౌకరీ చేయించుకొని ఆ పని తామే చేసినట్లు లోకమును భ్రమింపజేయువారు మహానుభావులైనారు. వారి సంఖ్యయైనను నెక్కువగా గలదా యనిన నదియునుం గానరాదు. మాస మకాలముగ లోకమంతయు ద్రిమ్మరినను పూటకూటికి గడచుట కష్టమైనది. ఈ బ్రతుకుకంటె గంగాభవాని గర్భమున వసించుట, ఆ మాత శరణుజొచ్చుట మేల్కాదా?''

ఒక్క టీకుటాకుల షోకుగాడు సిగరెట్టు పట్టుచు ధూమములను వాతావరణములోనికి వదలుచు నీగొణగునాతనికి బ్రక్కగా వెడలివచ్చినాడు.
వాసన ముక్కు కెక్కినది. పూర్వపు టభ్యాసము స్మరణా పథము నాక్రమించినది. అంతట నాపురుషోత్తమ నాయడు "ఆహా! ఇదిలంక పొగాకుతో నవీనముగా మన మద్రాసు వైశ్యసోదరులు సిద్ధము చేసి యమ్ముచుండు సరస్వతి సిగరెట్టు సువాసన. అరరే. దీని నింకొకమారు స్వయముగా పీల్చి యనుభవింపక దేహత్యాగము చేయనగునా. అయిన, అయిన--ఏల--కడపటి పైసా ఇంకను రొండిననున్నది గదా!''
నాయడు గ్రక్కున వెనుకను దిరిగినాడు. కర్నూలు పురమున కుమ్మరవీధి ప్రవేశించినాడు. అదె యాకొసన పప్పుల వెంకయ్య దుకాణమున్నది. అటబోయి సరస్వతీ సిగరెట్టు కావలయుననినాడు. దొరకలేదు. పెద్దవీధిని బడినాడు. గొప్పషాపొకటి చక్కని దీపాల వెలుగున దృగ్గోచరమైనది. అచ్చట ను సరస్వతీమార్కు సిగరెట్టు లేదు. పేరు పెద్ద ఊరు దిబ్బ యనుకొనుచు పురుషోత్తమ నాయడు మరియొక సందుమొనన నుండిన వక్కలాకుల దుకాణమునకు బోయినాడు. అట పైసాకొక్కటే సిగరెట్టు కొన్నాడు. ముట్టించినాడు. పొగ నిడువ నారంభించినాడు. వాన చినుకులు బడినవి. లోప్రక్కన కొట్టమున్నది. అందులో ఏవో సంచులు పేర్చినారు. అక్కడ విశ్రమించుటకు అంగటివాని వద్ద సెలవు కైకొనినాడు.

పురుషోత్తమ నాయడు పరధ్యానముగా పొగ పీల్చుచుండగా ప్రక్కన గోతాలమీద కూర్చొని మరియిద్దరు వ్యక్తులు గుసగుస లాడుచున్నారు. కొంత గుసగుస నాయని చెవిలోనికి దూరినది. అది ఏమి? మాటలాడుచుండినవారిలో ముసలివాడుగా కన్పించిన వ్యక్తి ఇట్లను.

"నేనెంతో శ్రమపడినాను. వాడు కానరానేలేదు. స్నేహితులకు ఉత్తరాలు వ్రాసినాను. స్వకీయసేవకులను బంపించి అన్వేషించినాను. నేను వెతకించుచున్నానని విని వాడు దాగుకొన్నాడేమోయని వేగులవారిని నియమించినాను. నేనే స్వయముగా కూడ బయలుదేరి చూచుచున్నాను. నన్ను ప్రాతిపెట్టుటకు దగిన యంతయాస్తి. నా డాలోచింపకపోయినందుకింత కడగండ్లు పడవలసి వచ్చినది. వాని ధార్మికత్వము వాడు మరుగైన తరువాత నాకు తెల్లమయినది. ఇప్పుడేమి సేయుదు. ఎట్లు నాకు చిత్తశాంతి గలుగును.''

ఈ వాక్యములు పురుషోత్తమనాయనికి పరిచితమైన ఎలుంగున పల్కబడినవి. అతనికి ననుమాన మంకురించె అంతట నాతడా ముసలివానిం దిలకించి చూచె. ఎచ్చటలేని మైత్రి అతని మానసమున స్వభావసిద్ధముగ దోచినది. దాపరికమునకు మనసు బట్టలేదు.
"తాతా! తాతా! నీవా! నీవా!'' యనినాడు. ముసలివాని యానందము వాక్కుల నణంచినది. అతడు ఒక్క పెట్టున మనుమని నాలింగనము చేసికొనినాడు. బాష్పముల రాల్చినాడు.
మూడు గడియలకు పూర్వము నిరుపేదగ నుండిన పురుషోత్తముడు లక్షాధికారియైనాడు. గంటకు మున్ను గంగాభవాని శరణు జొరనుండిన Äౌవనుడు తాత యాశీర్వచనమున చిరాయువైనాడు. కడపటి పైసా ఘనరక్షయై ధర్మమే జయమనుటను చాటించినది.
(ఈ కథ తొలి రాయలసీమ కథ 1918లోనే ప్రచురిత మయినట్టు కనుగొన్నాను. ఈ కథ పేరు 'కడపటి పైసా'. ఇది 'సౌందర్యవల్లి' పత్రికలో ప్రచురితమయ్యింది. గాడిచర్ల రామా బాయమ్మ సంపాదకత్వంలో ఈ పత్రిక మద్రాసు నుంచి వెలువడింది. ఇందులో కథారచయిత పేరు పేర్కొనలేదు. అయితే అంతర్గత ఆధారాలను బట్టి కథను రాసింది గాడిచర్ల హరిసర్వోత్తమరావు అని ఊహించవచ్చు.-  సంగిసెట్టి శ్రీనివాస్  -ఆంధ్రజ్యోతి దినపత్రిక సాహిత్యవేదిక  )

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...