Tuesday, February 26, 2013

సీమ స్ర్తీ అస్తిత్వం గొప్పదే, అభివ్వక్తి ఏది?


ఆంధ్రదేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమ బాగా వెనుకబడిన ప్రాంతం. అందుకే స్త్రీ చెైతన్యం  తక్కువ. రెండు, మూడు తరగతులకే ఆడపిల్లల చదువు అటకెక్కుతోంది. అందుకే రేవతీదేవి చెైతన్యాన్ని అందిపుచ్చుకునే స్త్రీవాదులు లేకపోయారు. 2001 తర్వాతనే కొంత మెరుగు. ఆ మధ్య బొంబాయిలోని వేశ్యాగృహాల మీద పోలీసులు జరిపిన దాడుల్లో పట్టుబడినవారిలో దాదాపు600 మందిమహిళలు అనంతపురం జిల్లా కదిరి ప్రాంతం వారే... ఇటువంటి పరిస్థితులనే కాదు, కుటుంబంలోని స్త్రీ స్థితిగతుల గురించి చర్చించాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.


anke
తెలుగు సాహిత్యంలోకి కవయిత్రులను తొలిగా ప్రవేశపెట్టిన ప్రాంతం రాయలసీమ. తాళ్ళపాక తిమ్మక్క రాయలసీమ కడప ప్రాంతంలోని రాజంపేట సమీపవాసి, ప్రసిద్ధ అన్నమయ్య అర్ధాంగి అన్నది జగద్విదితం. అన్నమయ్య సంకీర్తనల్లో కనపడే అంగాంగ వర్ణనలు తిమ్మక్క కవిత్వంలో మచ్చుకైన కానరావు. మగవాళ్ళపట్ల నాటి మహిళల్లో ఉన్న అభిప్రాయాలకు నిలువుటద్దం తాళ్ళపాక తిమ్మక్క ‘సుభద్రా కళ్యాణం’. ఈ ద్విపద కావ్యంలో సుభద్ర అర్జును నివెంట మెట్టినింటికి వచ్చిన సందర్భంలో ద్రౌపది- సుభద్రల మధ్య జరిగిన సంభాషణ చాలా ఆసక్తికరమైనది. బహు భార్యా వ్యవస్థలోని స్త్రీల మనోభావాలు ఎలాంటివో ఆ సన్ని వేశంలో కనిపిస్తాయి.

నిజానికి అన్నమ య్యకున్న ఇద్దరు భార్యల్లో ఒకరెైన తిమ్మక్క స్వానుభవంలోని భావనలే ఆ సన్నివేశంలోని సంభాషణలు.ఆ తర్వాత 16వ శతాబ్దంలోని తెలుగు సాహిత్యంలో అంగాంగ వర్ణనలు శృతిమించి పోయాయి.‘నా కావ్యం చదివితే చవట సన్యాసి కూడా కాము కుడెై పోతా’డని కవులు చెప్పు కున్న దశ! అటువంటి పరిస్థితుల్లో కడప సరిహద్దు ప్రాంతాలనుండి వచ్చిన మొల్ల, సమకాలీన అంగాంగ వర్ణనలకు విరుద్ధంగా చక్కని భావస్ఫోరకమైన శెైలిలో కవిత్వం చెప్పింది. శ్రీరాముని లక్షణాలు చెబుతూ అవే లక్షణాలు లక్ష్మణునికి కూడా ఉన్నాయని, కేవలం ‘రామలక్ష్మణుల మధ్య రంగుమాత్రమే తేడా’ అనడం వంటివి మొల్ల కవిత్వంలోని కావ్య సంఘటనల్లో అల్పాక్షరాలలో అనల్పా ర్థాన్ని సాధించడమేనని సాహిత్యాభిమా నులు భావిస్తారు. చక్కని నాటకీయత, సంక్షిప్తత, తెలుగు నుడికారం మొల్ల కవిత్వంలో మూర్తీ భవిం చాయి.
ఆ తర్వాత కాలంలో తరి గొండ వెంగమాంబ తిరుమల వెంక టేశ్వరుణ్ణి కేంద్రంగా చేసుకొని భక్తిని సాహిత్యంగా సృష్టించింది.19, 20 శతాబ్దాల్లో రాయలసీమ లోకి ఆధునిక సాహిత్యం చాలా ఆలస్యంగా ప్రవేశించింది. కందుకూరి సంస్కరణ వాదం, రాయప్రోలు భావకవితా వీచిక, గురజాడ అభ్యుద యాంశ వంటి కవి దృక్ఫథాలే కాక మాత్రా ఛందస్సు, కథ, నవల, వచన కవిత్వం వంటి ప్రక్రియాభివ్యక్తులు కూడా చాలా ఆలస్యంగానే ప్రవేశించాయి. కందుకూరి యుగం వెళ్ళిపోయిన తర్వాత గురజాడ వారి ‘మధురవాణి’, రాయప్రోలువారి ‘కమ, స్నేహలతాదేవి’ వంటివారు తెలుగు సాహిత్యాన్ని నిర్దేశిస్తున్న దశలోనే శ్రీశ్రీ ‘భిక్షువర్షీయసి’, ‘కడుపు దహించుకుపోయే పడుపుకత్తె’ల గురించి గొప్ప చర్చ జరుగుతున్న దశ అది. కానీ, రాయలసీమ కవి శర్మిష్ఠ, దేవయానిలవద్దే ఆగిపోయాడు. కవితా భారతి అవధానుల చేతుల్లో సర్కస్‌ ఫీట్లు చేసింది. స్వాతంత్య్రోదమ కాంక్షకూడా ప్రాచీన శెైలిలోనే వెలువడింది.

జీవితంలో ఆధునికత లేకపోవడం వల్లనే సాహిత్యంలో కూడా ఆధునికత ప్రవేశా నికి ఆలస్యమైంది. ఇందుకు గల చారిత్రక కారణాలను సింగమనేని నారాయణ, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి రాయలసీమ జీవితం ఆధునికం కాకపోవడానికి గల కారణాలను విశ్లేషించారు. ఆ తర్వాత తెలుగు సాహిత్యంలో సంచలనం సృష్టించిన స్త్రీ వాదానికి మాత్రం రాయలసీమ నుండి బలమైన ప్రాతినిధ్యం లభించింది. తొలి తరం స్త్రీవాదుల్లో ఒకరెైన రేవతీ దేవి స్త్రీ వాదమే ప్రధాన అంశంగా ‘శిలా లోలిత’ పేరుతో కవిత్వం వెలువరించారు. ‘నా చుట్టూ అనాది ప్రాణిని రగిల్చిన/ జగల్లీలా కేళికా సప్తవర్ణ జ్వాలా వలయాలు’ (అనురాగ దగ్ధ సమాధి) పురుషాధిక్య సమాజంలోని స్త్రీ అస్తిత్వమిది. ‘స్త్రీ భావాల్ని ఉన్నవి ఉన్నట్లుగా ఏ ముసుగులూ, తొడుగులూ లేకుండా వ్యక్తీకరించిన వెైఖరి కనిపిస్తుంది. రేవతిదేవి భావాల్లో నిజాయితీ, ఆమె ఆవేదనలోని శీలతత్వం, ఆమె ఆలోచనలోని పరిపూర్ణత్వం, ఆమె ఆరాటంలోని అస్థిత్వవాద ధోరణి, ఆమె ఆంతరంగంలోని సంక్షుభిత విలయనృత్యాలు’ అని పి. లక్ష్మి వ్యాఖ్యానించారు.
‘ఇన్నాళ్ళూ గలగల మాట్లాడితే/ నే చెప్పాల్సిందేమీ లేనందున/ నేనేమి చెప్పినా విన్నారు/ చెప్పాల్సిందేదో ఉండి మాట్లాడబోతే ఎవరూ వినిపించుకోరు’ అని రేవతీదేవి ‘మూగబోయిన గొంతు’ కవితలో వ్యక్తీకరించిన భావాలు. స్త్రీ మాటమీద ఉండే నిర్బంధమే మూగవోయిన గొంతు. ‘క్షితిజరేఖ వేడి/ వేడిగానే ఉంది/ నిరంతర చిత్తకార్తి కుక్కలు కుక్కల్లాగే తిరుగుతున్నాయి/ వాటినుండి ఆవరించే అనుబంధపు టూదర/ వెచ్చగా కమ్ముకుంటూనే ఉంది/ అయినా/ ఈ హృదయం ఫ్రీజర్‌ లోంచి తీసిన శవం కన్నా చల్లని/ మాంసపు మంచు ముద్ద/ అది కరగడానికి స్పందించడానికి కావాల్సిన/ నిజాయితీ మంచు మంటకి/ ఈ లోకం భగ్గుమని తగలబడిపోతుందట/ అందుకే/ ఈ హృది యెన్నటికీ రగలని చితి’ (హ్రుచ్చితి)- ఈ పంక్తులు మార్మికంగా కనిపించినా చాలా స్పష్టంగానే ఉన్నాయి. హృదయ నిమ్నత మస్తకంలోని వెలగని దీపాల్ని వెలిగిస్తుంది. స్త్రీ భావాల కాంతిని కలిగిస్తుంది. స్త్రీ హృదయం మంచుముద్ద. దాన్ని నిప్పు కాల్చలేదు. నిజాయితీ అనే మంచుమంట మాత్రమే కాల్చగలదు. కానీ, ఆ నిజాయితీకి ఈ లోకమే మండుతుంది.

అందుకే ఈ హృదయం యెన్నటికీ ఆరని చితి. ‘దిగులు/ దిగు లు దిగులుగా దిగులు/ ఎందుకా/ ఎందుకో చెప్పే వీలుంటే దిగులెందు కు’ తరతరాలుగా స్త్రీ అభివ్యక్తి శబ్దాన్ని గర్భీకరించుకొన్న నిశబ్దాన్ని మోస్తూనే ఉంది. వ్యక్తీకరించలేని స్థితి. అందుకే ఎందుకో చెప్పలేని దిగులు.
రేవతిదేవి తర్వాత స్త్రీ అస్తిత్వం మీద రాయలసీమలో మాట్లాడింది చాలా తక్కువ. అది కూడా స్త్రీ సమ స్యల మీద మగ రచయితలు సాను భూతి తో మాట్లాడిందే! రేవతీదేవి తర్వాత రాయల సీమ నుండి స్త్రీవాద రచయిుత్రులు, కవయిత్రులు చాలా చాలా తక్కువగా వచ్చారు. రెైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుం బాన్ని భుజాన వేసుకొని మోసే స్త్రీ మీద రచించిన సాహి త్యం చాలా స్వల్పం. పసుపులేటి పద్మావ తమ్మ, శిరీష, అరుణ కుమారి వంటి కవ యిత్రులు సీమ నుండి మంచి కవిత్వం రాస్తున్నప్పటికీ స్త్రీవాద నేపథ్యం నుండి రాసింది చాలా తక్కువ.

ఉత్పత్తి సంబంధాల నుండి స్త్రీని దూరం చేసి, స్త్రీతత్త్వాన్ని సహజమంటూ చిత్రిం చడం వల్ల స్త్రీ కేవలం ఇంటికే పరిమి తమైంది. ఉత్పత్తి సంబంధాల నుండి స్త్రీని తప్పించిన తర్వాత సహజం గానే స్త్రీ తన ప్రాధాన్యత కోల్పోయింది. పిల్లల్ని కనే యంత్రంగా మగాడు భావించాడు. ఉత్పత్తి సంబంధాలనేవి స్త్రీలకు సమాజంలో సహ జంగా లభించాల్సిన సమాన త్వాన్ని నిర్దేశిం చడంలో ప్రధానపాత్ర వహిస్తాయి కదా! నాటి మనువు నుండి నేటి అత్యున్నత ప్రధాన న్యాయమూర్తి వరకు స్త్రీలకు సంబంధించి ఒకే రకంగా ఆలోచించడం లోని రాజకీయాల్ని స్త్రీ ఇప్పుడిప్పుడే గమ నిస్తోంది. ‘కువెైట్‌ సావిత్రమ్మ’ (చక్ర వేణు) వంటి స్త్రీ నేపథ్యం నుండి వచ్చిన కథలు మగవాళ్ళు రాసినవే. రెైతు ఆత్మహ త్యల పరిస్థితుల్లో స్త్రీ కేంద్ర బిందువుగా వచ్చిన స్వామి ‘రంకె’ వంటి కథలు మగవాళ్ళే రాయడానికి కారణం చాలా బలమైనదే. 1980 దాకా రాయలసీమలో స్త్రీ అక్షరాస్యత కేవలం 35 శాతం. 2001 నాటికి అది 55 శాతంగా కనిపిస్తు న్నప్పటికీ అది కేవలం లెక్కల్లోనే! వాస్తవం కాదు. దానికి తోడు అభివృద్ధిలేమి.
మొన్నటి శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం ఆంధ్రదేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమ బాగా వెనుకబడిన ప్రాంతం. అందుకే స్త్రీ చెైతన్యం తక్కువ. రెండు, మూడు తరగతులకే ఆడపిల్లల చదువు అటకెక్కుతోంది. అందుకే రేవతి దేవి చెైతన్యాన్ని అందిపుచ్చుకునే స్త్రీవాదులు లేకపోయారు. 2001 తర్వాతనే కొంత మెరుగు. ఆ మధ్య బొంబాయిలోని వేశ్యాగృహాల మీద పోలీసులు జరిపిన దాడుల్లో పట్టుబడినవారిలో దాదాపు 600 మందిమహిళలు అనంతపురం జిల్లా కదిరి ప్రాంతం వారే. ఇంతటి దుర్భర స్థితి గురించి రాయలసీమ మగ సాహిత్యవేత్తలు మాట్లాడింది ఏముంది! ఇటువంటి పరిస్థితులనే కాదు, కుటుంబంలోని స్త్రీ స్థితిగతుల గురించి చర్చించాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 
 July 1, 2012 Surya daily

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...