రాయల
సీమ నుంచి పుంఖాను పుంఖాలుగా ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి. వాటన్నిం టినీ ఒక
చోట పేర్చి చూస్తే, సగం కరవు- మిగిలిన సగం కక్షల ఇతివృత్తాలతో ఉంటాయి.
ఇక్కడే ఒక ప్రశ్న ఉదయిస్తుంది. సీమలో కథాంశాలుగా చేయాల్సిన, చేయదగిన
ఇతివృత్తాలు ఇంకేమీ లేవా? ఈ ప్రశ్నకి సమాధానం కోసం అన్వేషిస్తున్నప్పుడే
‘మొలకల పున్నమి’, ‘దేవర శిల’ కథా సంకలనాలు దృష్టిలోకి వస్తాయి. ఇవి రాయలసీమ
కథలకు అతీతంగా సామాజికాంశాలను స్పృశిస్తాయి. కరవు, కక్షల పరిధిని దాటించి
సీమ కథా స్థాయిని పెంచిన సంకలనాలు ఇవి. వీటి రచయిత వేంపల్లి గంగాధర్.
పాత్రల స్వభావంలో, రచనా శైలిలో, భాషా మాండలికంలో వైవిధ్యాన్ని అందించడం
వీటి ప్రత్యేకత.
ప్రకృతికి,
మనిషికి, నైతిక విలువలకు పట్టం కడుతూ చిత్రించిన ‘వాన రాయుడి పాట’
గంగాధర్ మరో సృజన. ఈ కథకు గురజాడ కథా పురస్కారం దక్కింది. గుర్రం మీద
పట్టు వస్త్రాలతో గ్రామాలలో తిరుగుతూ వర్షాల కోసం పూజలు చేసే వేమయ్య
స్వాముల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని రూపొందిం చిన కథ ‘వేమయ్య సామి
గుర్రం’. రాయల సీమలోని భూస్వామ్య, పెత్తందార్ల అరాచకాలను, దౌర్జన్యాలను
‘శిల బండి’ కథ చిత్రిస్తుంది. ఈ కథకు ‘జాతీయ కథా ఫౌండేషన్, న్యూఢిల్లీ’
పురస్కారం లభించింది. ఈ కథలకు భిన్నంగా భారత స్వాతంత్య్ర సమర కాలంలో
రాయలసీమ ప్రాంతంలోని బ్రిటిష్ వ్యవస్థ గురించి ‘ఏడు లాంతర్ల సెంటరు’ కథ
వివరిస్తుంది.
సీమ
కక్షలకు మాత్రమే నెలవు కాదని, త్యాగాలకు కూడా సిద్ధపడుతుందని చెప్పే కథే
‘దీప మాను’. సమాజానికి ఉపయోగపడే వ్యక్తులను సీమవాసులు ఎలా ఆదరించి చిరకాలం
గుర్తు పెట్టుకుంటారో ఈ కథలో చూపుతాడు గంగాధర్. సాధారణంగా ఎవరి ఊహకూ,
తలంపునకూ రాని వారు మంత్రసానులు. గ్రామాలలో తిరుగుతూ పురుళ్ళు పోసే
మంత్రసానుల గురించి, వారి జీవితాలను గురించి ‘మంత్రసాని వైద్యం’ కథ
వివరిస్తుంది.
ఈ
కథకుని మరో కథనం ‘ నేల దిగని ఊడ’. ఎద్దుల కాళ్ళకు నాడాలు కొడుతూ జీవనం
సాగించేవారి జీవితాలు ఈ కథలో ప్రధాన ఇతివృత్తం. మరో కోణంలో- ఎర్ర చందనం
కొయ్య తో బొమ్మలు తయారు చేసుకుని బతుకు సాగించేవారిని అటవీ అధికారులు ఎలా
వేధిస్తారో ‘కొయ్య బొమ్మలు’ కథ చిత్రిస్తుంది.సమాజంలో నెకొన్న మరో
దుస్థితి- అమ్మాయిలను రెడ్ లైట్ ప్రాంతాలకు పంపే వైనం. పూణే, ముంబాయి
వంటి నగరాల్లోని రెడ్ లైట్ ప్రాంతాకు అమ్మాయిల్ని సరఫరా చేస్తే- అటువంటి
వారి జీవితాలు ఎలా నలిగిపోతున్నాయో వివరిస్తూ, వారి వ్యథలను ‘మైనం బొమ్మ’
కథ కళ్ళకు కడుతుంది. ఈ కథకు అమెరికన్- తెలుగు అసోసియేషన్ (ఆటా) బహుమతి
లభించింది. ఫ్యాక్షన్ ఇతివృత్తంగా పచ్చని పల్లెలు కక్షల చిచ్చుకు ఎలా బలి
అవుతాయో వివరిస్తుంది ‘కొలిమ్మాను’ కథ. ఈ కథకు ఆర్.ఎస్. కృష్ణ మూర్తి
ఫౌండేషన్ కథా పురస్కారం దక్కింది.
గంగాధర్ మరో కథ ‘ఎడారి ఓడ’.
వీధుల వెంట తిరుగుతూ ఒంటె మీద సవారి చేస్తూ గడిపే జీవితాలను కళ్ళముందు
ఉంచుతుంది ఈ కథ. కూటికోసం కోటి విద్యలన్నట్టుగా జీవనాన్ని సాగించే ప్రజల
దైనందిన జీవితాలు గంగాధర్ కథల్లో దర్శనమిస్తాయి. అలాంటి కోవకు చెందినదే
‘అంజన సిద్ధుడు’ కథ. ఈ కథ తమ జీవన భృతి కోసం అరచేతిలో అంజనం వేసి ప్రజల్ని
నమ్మిస్తూ జీవితాల్ని నెట్టుకొచ్చేవారి గురించి వివరిస్తుంది. మరో కథలో మేక
పేగును వాద్య పరికరంగా చేసి వాయించే వ్యక్తి మరణించిన తర్వాత, ఆ విద్యను
ఎవరూ నేర్చుకోక పోవడంతో వాద్య పరికరం మాత్రం మిగులుతుంది గాని దానిని వాడే
విధానం ఎవరికీ తెలియదు. ఈ ఇతివృత్తంతో సాగుతుంది ‘వాడొక్కడు’ కథ.
సమాజంలోని
అమానవీయత, మూఢనమ్మకాలు, నరబలులను నిరసిస్తూ ‘తూరుపు కొమ్మలు’ కథ
సాగుతుంది. కన్న బిడ్డను బలి ఇచ్చారని తెలుసుకున్న తండ్రి హృదయ విదాకరక మౌన
వేదన, నా బిడ్డను చూశారా అంటూ అడిగే తల్లి ఆవేదనను గంగాధర్ కళ్ళకు
కట్టినట్టు చిత్రించాడు. అంతేకాదు, మాండవి అనే నది ఎండిపోతే ఆ నదిని
నమ్ముకుని ఉన్న ప్రజలు ఎలా జీవిస్తారో ‘మాండవ్యం’ కథ వివరిస్తుంది.
గంగాధర్ మరో కథ ‘శరణాగతుడు’. సీమలో చెరకు రైతుల కష్టాలను వివరిస్తూనే ఆ
రైతులు చెరకు ఫ్యాక్టరీలలో ఎదుర్కొనే సమస్యల్ని ఈ కథ చిత్రించింది.
ముస్లిం
జీవితాలకు అద్దం పడుతూ సీమ ప్రాంతాల నుంచి గల్ఫ్ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ
అన్ని సమస్యల్ని ఎదుర్కొంటూ తమ కుటుంబాల కోసం పడే వేదనను ‘ఉరుసు’ కథ
వివరిస్తే, సీమలో దళితుల ఆవేదన, ఆక్రందన మానసిక సంఘర్షణ, జీవన పోరాటం-
ఇత్యా ది అంశాలను ప్రధానంగా చేసుకుని ‘పొద్దు పుట్టింది’, ‘నల్ల ఛత్రి’
కథలు కనుపిస్తాయి. వ్యక్తుల మానసిక స్థితిని, వారి ఊహలను కాలానికి అతీతంగా
ముందుకు నడిపించేదిగా ‘నీడలు’ కథ వివరిస్తుంది.
సీమలో బయటపడ్డ
యురేనియం గనుల కోసం గ్రామాలను ఖాళీ చేయించే ఇతివృత్తంతో రూపొందిన కథ
‘నెత్తుటి మాన్యం’. మనిషి సంపాదన కోసం నైతిక విలువలను ఫణంగా పెట్టి
ఎదుగుతున్న వైనాన్ని ‘ఏడు తలల నాగు’ కథ చిత్రిస్తుంది. ఈ కథలన్నీ విభిన్న
ఇతివృత్తాలకు ఉదాహరణలే. తెలుగు కథా సాహిత్యంలో ఇంత విభిన్నమైన ఇతివృత్తాలను
ఎంపిక చేసుకుని కథలుగా నిర్మితం చేసినవారు అరుదుగా కనుపిస్తారు.
కథలను
కథలుగానే చెప్పి నిజాయితీగా పక్కకు తప్పుకునే కథకులు తక్కువమందే. వారిలో
ఒకరు వేంపల్లి గంగాధర్.‘మొలకల పున్నమి’ కథా సంకలనానికి గుంటూరు శేషేంద్ర
శర్మ రాసిన ముందుమాట ప్రస్థావనార్హం.గంగాధర్ ‘నెత్తుటి మాన్యం’ కథకు విపుల
కథా పురస్కారం, ‘తూరుపు కొమ్మలు’ కథకు సాహిత్య నేత్రం కథా పురస్కారం,
‘మొలకల పున్నమి’ సంకలనానికి విశాల సాహితీ అకాడమీ- బి.ఎస్. రాములు కథా
పురస్కారం, ‘పొద్దు పుట్టింది’ కథకు తేజ వీక్లీ రూ.10 వేల ప్రధమ బహుమతి
పురస్కారం లభించాయి. సీమ కథకు చిరునామాగా ఈ కథలన్నీ నిలచిపోతాయి.
No comments:
Post a Comment