రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని, అక్కడి ప్రజలు సామా జికంగా, ఆర్థికంగా
వెనుకుబాటుకు గురై ఉన్నారని శ్రీకృష్ణ కమిటీ నివేదిక స్పష్టంగా తెలిపింది.
రాయలసీమకు జరిగినది అన్యాయం కాదు, ముమ్మాటికి ద్రోహమేనని మేధావులు
పేర్కొంటున్నారు. కోస్తాంద్ర రాజకీయ నాయకులు, రాయలసీమలోని కొంతమంది నాయకులు
‘సీమాంధ్ర’ అంటూ కొత్త పదాన్ని సృష్టించారు. తెలుగుజాతి ఐక్యంగా ఉండాలని,
‘సమైక్యాంధ్ర’ అని నినదించే రాజకీయ నాయకులంతా తమ పెట్టుబడులను, ఆస్తులను
కాపాడుటునే క్రమంలోనే ఉద్యమాలను ముందుకు తోస్తున్నారని పలువురు విమర్శలు
గుప్తిస్తున్నారు.‘రాయలసీమ ఆత్మగౌరవ యాత్ర’ పేరుతో రాయలసీమ సంరక్షణ సమితి
ఆధ్వర్యంలో పాదయాత్రలు జరిపారు. రాయలసీమను ముక్కలు కానివ్వం అని, విభజిస్తే
ప్రత్యేక రాయలసీమ రాష్ర్టం కావాలనే డిమాండ్ను ముందు పెట్టారు. మొదట్లో
గ్రేటర్ రాయలసీమ అన్నారు.
ఆ తర్వాత ప్రత్యేక రాయలసీమ అన్నారు. తెలంగాణ రాష్ర్టం ఇస్తే, ప్రత్యేక
రాయలసీమ రాష్ర్టం ఇవ్వాలని రాయలసీమ జిల్లాలో దాదాపు 1200 కిలోమీటర్ల
పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దీనికి రాయలసీమ రాష్ర్టసమితి మద్దతు
తెలియజేసింది. మొత్తంగా వీరికి రాయలసీమ రాష్ర్టం కావాలా లేదా రాష్ట్ర విభజన
వద్దా అనేది స్పష్టం చేయలేదు. తెలంగాణ రాష్ర్టం ఇవ్వడం వల్ల రాయలసీమకు
కొత్తగా జరగబోయే నష్టం ఏమీ ఉండదు. దీనితో రాయలసీమను ముడిపెట్టడం అవివేకమైన
చర్యే కాకుండా రాయలసీమ ప్రజలకు ద్రోహం చెయ్యడమే అవుతుంది. అంతిమంగా
రాష్ట్రంలోని పెత్తందారులకు లబ్ధి చేకూర్చినట్టు అవుతుంది.రాయలసీమ రాష్ర్టం
అవసరమే. నాలుగు జిల్లాలతో కలిపే రాయలసీమ రాష్ర్టం కావాలి. ఇందుకోసం పెద్ద
ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఆయా ప్రజల ప్రజాస్వామిక అభీష్ఠం
మేరకు రాయలసీమ రాష్ర్టం ఏర్పడాలి. అందుకు ముందుగా రాయలసీమకు జరిగిన
ద్రోహాన్ని, మోసాన్ని ప్రజల ముందుంచాలి.
మెకంజీ పథకం, శ్రీబాగ్ బడంబడిక వంటి ఎన్నో ఒప్పం దాలను అమలు చేయకుండా
రతనాల రాయల సీమను ఎడారిగా మార్చిన పాలకవర్గాల స్వార్థ రాజకీయ ఎత్తుగడలను
ప్రజల ముందుంచుతూ, సీమ ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన నీళ్ళు, నిధులు,
ఉద్యోగాల కోసం ప్రజలచేత ప్రజాస్వామ్యయుత ఉద్యమాలను నిర్మించే ప్రయత్నం
చేయాలి.రాయలసీమ గత 160 సంవత్సరాల నుండి తీవ్ర కరువు, కాటకాలలో
సతమతమవుతోంది. 200 అడుగుల లోతువరకు బోరు వేసినా నీళ్ళురావు. చాలా చోట్ల 700
అడుగులు వేసినా నీరు లభించని పరిస్థితి. రాజుల కాలంలో నిర్మించిన
గొలుసుకట్ల చెరువులే నేటికీ ఆధారం. ఇంత సాంకేతిక అభివృద్ధి జరిగినా సీమ
వాసులకు దిక్కు లేకుండాపోయింది. ఈ చెరువుల్ని కూడా రియల్ ఎస్టేట్
వ్యాపాకం కోసం ప్లాట్లు వేసి అమ్మేశారు. రాయలకాలం నాటి భూగర్భ జలనిక్షేపాల
రక్షణకోసం ఏర్పాటుచేసిన జలాశయాలు శిథిలావస్థలో ఉండిపోయాయి. 1858లో ఈస్టు
ఇండియా పరిపాలన, తదనంతరం బ్రిటిష్ పరిపాలన వచ్చినా పాలెగాళ్ళ రాజ్యం
వచ్చిందికాని, కనీసం వలసరాజ్యపాలన కూడా అమలు జరగలేదు.
1876లో సంభవించిన కరవుకు నూటికి నలభై మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
బ్రిటిష్ హయాంలో కాటన్, మెకంజీ వంటి ఇంజనీర్లతో పరిశోధనలు చేయించి,
సాగులో ఉన్న 75 లక్షల ఎకరా లకు నీరు అందించే ప్రణాళికలు రూపొందించినా,
వాటిని 40 లక్షల ఎకరాలకు నీటి వసతి కల్పనకోసం మాత్రమే పరిమితం చేశారు. ఈ
మేరకు 1890లో కర్నూలు, కడప కాలువ ద్వారా కడప- కర్నూలు జిల్లాలలోని 3 లక్షల
ఎకరాలకు సాగునీరు అందింది.మెకంజీ తన హయాంలో కృష్ణ, తుంగభద్ర, పెన్నా నదుల
సంగమంతో ఒక పథకం రూపొందించారు. దీనితో 40 లక్షల ఎకరాలకు నీటి సౌకర్యం
ఏర్పడు తుంది. కాని ఇప్పటికీ అది ఆచరణలోకి రాలేదు.1953 వరకు కోస్తా, రాయల
సీమ జిల్లాలు మద్రాసు రాష్ర్టంలో ఉండేవి. 1913లో ఆంధ్ర మహాసభ ప్రత్యేక
తెలుగురాష్ర్టం కోసం ఉద్యమించింది. ఈ ఉద్యమ క్రమంలో కోస్తా ప్రాంతం లో
కలపకుండా రాయలసీమ రాష్ర్టం కావాలనే ప్రజా ఉద్యమం కూడా బయలుదేరింది. దీనితో
కంగారుపడిన కోస్తా ప్రాంత రాజకీయ నాయకులు 1937లో ‘శ్రీబాగ్’ భవనంలో
రాయలసీమ నాయకులతో కోస్తా ప్రాంత నాయకులు ఒక పెద్ద మనుషుల ఒప్పందం
కుదుర్చుకున్నారు. దీన్నే ‘శ్రీ బాగ’ ఒడంబడిక అన్నారు.
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఆంధ్రవిశ్వ విద్యాలయానికి రెండు కేంద్రాలు
ఏర్పరచి వాటిని వైజాగ్, అనంతపురంలలో ఏర్పాటుచేయాలి. రాయలసీమకు నీటిపారుదల
సౌకర్యాన్ని కృష్ణా, తుంగభద్ర, పెన్నా నదుల నుండి పది సం వత్సరాలు లేదా
అవసరమైనంతకాలం ఏర్పాటు చేయాలి. నీటి వివాదాలు వచ్చినా, రాయలసీమ అవసరాలను
మొదట తీర్చాలి. అసెంబ్లీ సీట్లు సమాన సంఖ్యలో ఉండాలి. రాష్ర్ట రాజధానిని
రాయలసీమలోనే ఏర్పాటు చేయాలి. 1953లో ఆంధ్రరాష్ర్టం అవతరించింది. 1944లో
మల్లేశ్వరం వద్ద తుం గభద్ర ఆనకట్ట- మెకంజీ పథకానికి పొంతన లేకుండా
జరిగింది. దీనివల్ల రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగింది. 1951లో కృష్ణా -
పెన్నార్ ప్రాజె క్టును ఉమ్మడి మద్రాసు రాష్ర్టం రూపొందిస్తే దాన్ని
వ్యతిరేకిస్తూ నాగార్జు నసాగర్ కావాలని కోస్తా ప్రాంత నాయకులు
ఉద్యమించారు. అందువలన రాయలసీమ మరోమారు అన్యాయానికి గురైంది.
1954లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాల వల్ల రాయలసీమకు
చారిత్రక ద్రోహం జరిగి శాశ్వత ఎడారిగా మారిపోయింది. రాష్ర్టంలో అతి తక్కువ
వర్షపాతం కలిగిన ప్రాంతం రాయలసీమ. అనంత పురం జిల్లాలో చాలా పంటపొలాలలో ఇసుక
మేటలు వేసింది. రాబోయే సంవత్సరాలలో రాయలసీమ ఎడారి కాబోతోందని నివేదికలు
చెబుతున్నాయి. సగటు వర్షపాతం సంవత్సరానికి 30 అంగుళాలకన్నా తక్కువ ఉంటుంది.
కోస్తా జిల్లాల్లో 40 లక్షల హెక్టార్ల సాగుభూమికి 20 లక్షల హెక్టార్లకు
ప్రాజెక్టుల ద్వారా నీరందుతోంది. రాయలసీమలో 30 లక్షల హెక్టార్ల సాగుభూమికి 3
లక్షల హెక్టార్లకే సాగునీరు అందుతోంది.ఉద్యోగ అవకాశాల గురించి
మాట్లాడుకుంటే రాష్ర్ట ఉద్యోగ కల్పనలో రాయలసీమకు ఎప్పుడూ అన్యాయమే
జరిగింది. రాష్ర్ట ముఖ్యమంత్రులు సీమనుండి ముగ్గురు వచ్చినా రాయలసీమకు
ఒరిగిందేమీ లేదు. విద్యకు సంబంధించి తిరుపతి దేవస్థానం నిధులతో ఏర్పాటు
చేసిన యూనివర్శిటీలు తప్పితే, రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసినవి చాలా
స్వల్పం. రాయలసీమ ప్రజల శ్రమతో తయారైన సంపద- రాయలసీమను దాటి బడా
పెట్టుబడిదారుల మూలధనంగా మారిపోతోంది.
కృష్ణానది మిగులు జలాలను శ్రీశైలం ప్రాజెక్టు వద్దనుండే తెలుగుగంగ,
హంద్రీనీవా, గాలేరు - నగరి ప్రాజెక్టులకు మళ్ళించాలి. శ్రీబాగ్
ఒప్పందాన్ని నాయకులు, పాలకులు ఏనాడో మర్చిపోయారు. కడప జిల్లాలోని సహజ
వనరులను, అక్రమ గనుల కేటాయింపుతో పాలకవర్గాలు తమ బంధుగ ణానికి కేటాయించి
పెద్ద ఎత్తున దోపిడీకి తెరతీశాయి. రాయలసీమను ఏలిన పాలెగాళ్ళే ఈ రోజు
పెట్టుబడిదారులుగా, పారిశ్రామిక వేత్తలుగా మారి రాజకీయాల్ని రాష్ర్టంలో
శాసిస్తున్నారు.పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, తమ స్వీయ ప్రయోజనాలకు
భంగం కలిగినప్పుడు ఒక్కటై సమైక్యాంద్ర, గ్రేటర్ రాయలసీమ అంటూ పసలేని
వాదనలు ముందుకు తెస్తున్నారు. ప్రజలలోని సున్నితమైన భావాలను రెచ్చగొడుతూ,
అపోహల్ని, అభద్రతలను నాయకులు సృష్టిస్తున్నారు. పాలక వర్గాల రాజకీయ
ఎత్తుగడులవల్లే ప్రాంతీయ సమస్యలు తలెత్తుతున్నాయి. కేంద్రీకృత
పెట్టుబడిదారీ అభివృద్ధి నమూనా వల్ల రాష్ర్టంలో తీవ్ర అసమా నతలు
ఏర్పడ్డాయి. వీటికి పరిష్కారంగా ప్రాంతీయ ఉద్యమాలను చూపెడు తున్నారు.అయితే
భౌగోళికంగా రాష్ర్ట విభజన జరుగవచ్చునేమో కాని సామాజిక, ఆర్థిక సమానత్వం
కోసం ప్రజలు ఎప్పుడూ ఉద్యమించవలసిందే. ఈ రాష్ట్రాల ఏర్పాటు కూడా ప్రజల
ప్రజాస్వామిక ఆకాంక్షల మేరకే జరగాలని కోరుకుందాం.
-ఎం.కె. కుమార్
No comments:
Post a Comment