Tuesday, February 26, 2013

రాయలసీమ నవల తొలి దశ

రాయలసీమ నుంచి1950కి ముందే అనేక సాంఘిక, చారిత్రక, పౌరాణిక, అపరాధ పరిశోధక, రాజకీయ, అనువాద నవలలు వచ్చాయి. ‘శ్రీరంగరాజుచరిత్ర’ను మినహాయిస్తే (దానిమీద ఇదివరకే చాలాచర్చ జరిగింది కాబట్టి) దాదాపు 26 నవలలు వచ్చాయి. వాటిని 20 మంది రచయితలు రచించారు. 1872లో ‘శ్రీరంగరాజు చరిత్ర’ వచ్చిన తర్వాత కందుకూరి ‘రాజశేఖరచరిత్ర’ కన్నా ముందే గడియారం రామాశాస్త్రులు రచించిన ‘పేటికాంతర శవం’ అనే అపరాధ పరిశోధక నవల 1874లోనే వచ్చింది. బహుశా తెలుగులో తొలి అపరాధ పరిశోధక నవల ఇదేనేమో! దీని తర్వాత రాయలసీమలో 1905నుంచే నవలలు రాయడం మొదయింది.

ఆధునిక వచనకావ్యంగా ప్యాకెట్‌ థియేటర్‌గా పేరు పొందిన నవల భారతీయ భాషల్లోకి పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో ప్రవేశించిందనేది ఇదివరకే అత్యధికులు ఆమోదించిన సత్యం. బెంగాలీ భాషలో 1856లో టేక్‌చంద్‌ ఠాగూర్‌ ‘అలాలేర్‌ ఘరేర్‌దులాల్‌’ (చెడిపోయిన కుమారుడు) అనే నవల తొలి భారతీయ నవల అని చెబుతారు. కానీ భారతీయ నవలా పితామహుడిగా పేరుపొందిన బంకించంద్రఛటర్జీ రాసిన ‘దుర్గేశనందిని’ (1865)తొలి భారతీయ నవల అని ఎక్కువమంది సాహిత్య చరిత్రకారులు భావిస్తున్నారు. ఏ దృష్టితో చూసినా భారతీయ నవలకు పది సంవత్సరాలు అటూ ఇటూ ఒకటిన్నర శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ కాలంలో భారతీయ నవల ఎవరెస్టు శిఖరమంత ఎత్తు ఎదిగింది. జాతీయస్థాయిలో, రాష్టస్థ్రాయిలో నవలలు సాహిత్య అకాడమీ పురస్కారాలను, జ్ఞానపీఠ పురస్కారాలను అందుకొనే దశకు ఎదిగాయి.

విసృ్తతమైన సామాజిక జీవితాన్ని సాధ్యమైనంత సమగ్రంగా చిత్రిస్తున్న ప్రక్రియ నవల.
బెంగాలీ భాషలో పుట్టిన ఏడెనిమిది సంవత్సరాల తర్వాత తెలుగులో నవల పుట్టింది. తెలుగు లో నవల పుట్టడానికి పాశ్చాత్య ప్రభావంతో పాటు బెంగాలీ ప్రభావం కూడా ఉంది. బెంగాలీ గవర్నర్‌ లార్ట్‌ మేయో ప్రకటనను అనుసరించి, కర్నూలు జిల్లాలో రెవిన్యూ ఉద్యోగిగా ఉండిన నరహరి గోపాలక్రిష్ణమ శెట్టి స్థానిక జీవితాన్ని ప్రతిబింబిస్తూ ‘శ్రీరంగరాజు చరిత్ర’ అనే నవలను1872లో రచించాడు. ఆధునిక ప్రక్రియ అయిన నవల పుట్టడానికి ఆధునిక విమర్శకులు చెప్పే ఆధునిక నేపథ్యం ఏదీ లేకుండానే రాయలసీమలో తొలి తెలుగు నవల రావడం అద్భుతమే. అయితే ‘శ్రీరంగరాజు చరిత్ర’లో చారిత్రకాంశం లేదనీ, నవలా లక్షణాలు లేవనీ, అనేక అభివృద్ధి నిరోధక అంశాలున్నాయనీ ఆ నవల ఆద్యతను ఆధునిక నవలా విమర్శకులు తిరస్కరించి, 1878 నాటి కందుకూరి ‘రాజశేఖరచరిత్రను’ తొలితెలుగు నవలగా గుర్తిస్తున్నారు.

కోస్తా ప్రాంతంలో 1878నుండే నవలా సాహిత్యం వస్తున్నది. తెలంగాణలో నవలా సాహిత్యం చాలా ఆలస్యమైందని భావిస్తూఉండిన వాళ్ళు ఇప్పుడిప్పుడే తేరుకొని 1895లోనే తెలంగాణలో నవల పుట్టిందని చెప్పుకొంటున్నారు. రాయలసీమలో కూడా ‘శ్రీరంగరాజు చరిత్ర’ను, కల్వటాల జయరామారావు ‘రేనాటి వీరుడు’ (1925)ను మినహాయిస్తే 1950దాకా నవలలు పుట్టలేదని నవలా విమర్శకులు చెబుతూ వస్తున్నారు.రాయలసీమ సాహిత్యం మీద విశేషమైన కృషిచేసిన వల్లంపాటి వెంకటసుబ్బయ్య ‘శ్రీరంగరాజు చరిత్ర’ను తిరస్కరించి 1925నాటి ‘రేనాటి వీరుడు’ను తొలిసీమ నవలగా ప్రకటించి దానికొనసాగింపుగా 1950దాకా సాధారణ నవలకూడా రాలేదని అభిప్రాయ పడ్డారు. అలాగే ప్రసిద్ధ సాహిత్యవిమర్శకులు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి ‘కొన్ని కావ్యాలు- కొందరు కవులు’ అనే పుస్తకంలో ‘రేనాటి వీరుడు’తో పాటు 1949లో అంతటి నరసిం హం రాసిన ‘ఆదర్శం’ నవలను ప్రస్తావించారు. ఇంకెవరూ రాయలసీమ నవలా పుట్టుకను గురించి, పరిణామాన్ని గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యకరం.

వాస్తవానికి రాయలసీమ నుంచి1950కి ముందే అనేక సాంఘిక, చారిత్రక, పౌరాణిక, అపరాధ పరిశోధక, రాజకీయ, అనువాద నవలలు వచ్చాయి. ‘శ్రీరంగరాజుచరిత్ర’ను మినహాయిస్తే (దానిమీద ఇదివరకే చాలాచర్చ జరిగింది కాబట్టి) దాదాపు 26 నవలలు వచ్చాయి. వాటిని 20 మంది రచయితలు రచించారు. 1872లో ‘శ్రీరంగరాజు చరిత్ర’ వచ్చిన తర్వాత కందుకూరి ‘రాజశేఖరచరిత్ర’ కన్నా ముందే గడియారం రామాశాస్త్రులు రచించిన ‘పేటికాంతర శవం’ అనే అపరాధ పరిశోధక నవల 1874లోనే వచ్చింది. బహుశా తెలుగులో తొలి అపరాధ పరిశోధక నవల ఇదేనేమో! దీని తర్వాత రాయలసీమలో 1905నుంచే నవలలు రాయడం మొదయింది.1905లో జనమంచి శేషాద్రిశర్మ రాసిన ‘మనోరంజిని’ అనే నవల వచ్చింది. ఆ నవల మొదలుకొని 1949నాటి ‘ఆదర్శం’ (అంతటి నరసింహం) నవల దాకా చాలా విలువైన నవలలు వచ్చాయి.ఈ నవలల్ని పరిశీలిస్తే రాయలసీమ నవల ఇప్పటిదాకా భావిస్తున్నంత వెనుకబడి పోలేదని తెలుస్తుంది.

ఈ కాలంలో వచ్చిన రాయలసీమ నవలలు ఇవి.1872 నాటి నరహరి గోపాలకృష్ణమశెట్టి నవల ‘శ్రీరంగరాజుచరిత్ర’ రూపపరంగా ఆధునిక రచన కాకపోయినా వస్తుపరంగా, ప్రక్రియ పరంగా ఆధునిక రచన. ఈ నవలలో ఒక రాజు ఒక లంబాడీ స్ర్తీని ప్రేమించి పెళ్ళాడడం వస్తువు. కులవ్యవస్థ తీవ్రంగా అమలులో ఉన్నకాలంలో ఆ కుల వ్యవస్థను కాపాడే రాజుకు- సభ్యసమాజంలో స్థానం లేకుండా తండాలలో నివసించే లంబాడీ స్ర్తీకి మధ్య ప్రేమను కల్పించడమేకాక పెళ్ళిచేయడంకూడా తిరుగులేని ప్రగతి శీలాంశం. అందువల్ల ‘శ్రీరంగరాజు చరిత్ర’ తొలి తెలుగు నవలగా రాయలసీమనుండి రావడం పేర్కొనదగిన అంశం.అనంతగిరి పేరనార్యకవి 1915లో రచించిన ‘సుశీల’ నవలలో విద్యావంతురాలైన సుశీల తన వైవాహిక జీవితంలో, సామాజిక జీవితంలో వచ్చిన సంక్లిష్ట పరిస్థితులను తన తెలివిచేత, ధైర్య సాహసాలచేత, తన వ్యక్తిత్వంచేత అధిగమించి తనకు దూరమైన భర్తను, తల్లిదండ్రులను కలుసుకొని సమస్యనుపరిష్కరించుకొంటుంది. ఇది స్ర్తీ విద్యను ప్రోత్సహించే నవల. సంఘ సంస్కరణ ప్రభావం ఈ నవలమీద ఉంది.

కల్వటాల జయరామారావు 1923లో ‘సువర్ణ కేసరీ కృష్ణసేన’ అనే సాంఘిక నవలను రాశాడు. ఇది స్ర్తీ పురుషుల మధ్య ప్రేమ వివాహాన్ని ప్రతిపాదించే నవల. ఇది రచయిత మొట్టమొదటి రచన. ‘సువర్ణ కేసరీ కృష్ణసేనల ప్రేమ వాళ్ళ తల్లిదండ్రుల కారణంగా సంక్లిష్టతకు గురికాగా వాళ్ళసే్నిహ తుల సహాయంతో అష్టకష్టాల నుండి గట్టెక్కి వాళ్లిద్దరూ పెళ్ళి చేసుకొంటారు. ఈ నవల ప్రేమకు, స్నేహానికి పెద్దపీట వేసింది. ఈ నవలలో భాగంగా ఆంగ్లేయుల నీచ పరిపాలన, స్ర్తీకి విద్య అవసర మనే వాదన, బెస్తవారి వర్ణన, సమకాలీన బ్రాహ్మణుల తీరు, జూద వ్యసనం, జాతర, మూఢనమ్మ కాలు, ఎండతీవ్రత, బాల్యవివాహాలు, వితంతు వివాహాలు, ధూమపానం, కరవు, విగ్రహారాధన నిరసన మొదలైననవి సామాజిక అంశాలెన్నింటినో చిత్రించాడు.బూదూరు రామానుజులరెడ్డి 1925లో రచించిన ‘రత్నబాయి’ నవల వరకట్న సమస్యను గర్హిస్తూ వచ్చిన నవల.కన్యాశుల్క, వరకట్న దురాచార ఫలితాలను గమనించిన రత్నాబాయి తమ్ముడు హరికిశోరుడు సంఘ సంస్కర్తయై వాటి నిర్మూలనకు ఉద్యమిస్తాడు.

ఇది కూడా సంఘసంస్కరణోద్యమ నవలే. ‘మాలపల్లి’ నవలకు అద్భు తమైన పీఠిక రాసిన కాశీనాథుని నాగేశ్వరరావు ‘రత్నాబాయి’కీ ముం దుమాట వ్రాస్తూ మాల పల్లివంటి నవలలు అనేకం రావలసి ఉందనీ, ‘రత్నాబాయి’ నవలపైన ‘మాలపల్లి’ నవలా ప్రభావం ఉందని అభిప్రాయపడ్డారు.1927లో దేవమణి సత్యనాథన్‌ రాసిన ‘లలిత’ నవల వచ్చింది. ‘సుశీల’ నవలలాగే ‘లలిత’ నవల కూడా స్ర్తీ విద్యా ప్రభావాన్ని ఆవిష్కరిస్తూ స్ర్తీ వ్యక్తిత్వాన్ని నిరూపి స్తూ ఉంది. అక్కను, తల్లిని పోగొట్టుకొన్న లలిత, తండ్రి పిచ్చివాడైపోగా, అన్నదమ్ములు బిచ్చగాళై పోగా తనను బలవంతం చేస్తున్న వసంతుని బారినుండి తప్పించుకొని మేనమామ కొడుకైన హరిదాసును అనేకసాహసాలతర్వాత వివాహం చేసుకొంటుంది. సమస్యలనుచూసి బెదిరిపోకుం డా సమాజంలోని మంచివాళ్ళ సహకారంతో సమస్యలనుండి గట్టెక్కిన స్ర్తీ కథ ఈ ‘లలిత’ నవల. గుంటి సుబ్రహ్మణ్యశర్మ రాసిన ‘మాధవాశ్ర మము’ నవల 1933లో వచ్చింది. ఇది జాతీయోద్యమ నవల. ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘనోద్యమం కొనసాగుతున్న కాలంలో ఈ నవల వచ్చింది.

1933 నాటికి గాంధీజీ నాయకత్వం నడుస్తున్న జాతీయోద్యమంలో బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా జరిగేపోరాటం ఒకరకమైతే, నిర్మాణకార్యక్రమాల నిర్వహణ మరొక భాగం. ‘మాధవాశ్రమము’ నవలలో రాయలసీమ ప్రాంతంలోని ముఠాగొడవల నేపథ్యంలో గాంధీజీ నిర్మాణకార్యక్రమాలను రచయిత ప్రతిబిం బించాడు. అదివరకే పెళ్ళైఉన్న మాధవశర్మకి అమ్మాయిపుడితే ఆమెకు ‘భరతమాత’ అనే పేరు పెట్టుకోవడంతో నవల ముగుస్తుంది.అంతటి నరసింహం 1949లో రాసిన సాంఘిక నవల ‘ఆదర్శం’. ఉన్నతకులంలో పుట్టిన కేశవ రావు గాంధీజీ ప్రభావంతో సమాజంలోని దురాచారాలను రూపుమాపాలని నిశ్చయించు కొం టాడు. ఈ నేపథ్యంలో కడపజిల్లా రాజంపేట తాలూకాకు చెందిన కోటగ్రామానికి ఉపాధ్యా యు డుగా వస్తాడు. తోటి ఉపాధ్యాయుడు నారాయణతో కలిసి తన ఆదర్శజీవితాన్ని మొదలు పెడతా డు. శాస్ర్తి మరణించడంతో అతని రెండవ భార్య కామాక్షికి నారాయణతో వితంతు పునర్వివాహం జరిపిస్తాడు కేశవరావు. ఆదర్శాలకు వ్యతిరేకంగా ఉండడం వల్ల- తాను గాఢంగా ప్రేమించిన ప్రియురాలు కమలను కూడా విడిచిపెడతాడు.

ఆదర్శజీవితానికి తన ప్రేమను సైతం త్యాగం చేస్తాడు. అస్పృశ్యత నివారణ, కులాంతర వివాహాలు, వితంతు పునర్వివాహం, దళితు లను ఉద్ధ రించడం వంటి సామాజిక విషయాలు ఎన్నింటినో కేశవరావుపాత్ర ద్వారా అంతటి నరసింహం ఈ నవలలో చిత్రీకరించాడు.19వ శతాబ్దం చివరిలో, 20వ శతాబ్దం ప్రారంభంలో తెలుగులో అనువాద రూపంలోగానీ, అనుకరణ రూపంలోగానీ, అనుసృజన రూపంలోగానీ అనేక చారిత్రక నవలలు వచ్చాయి. ఇందుకు భారతజాతీయోద్యమమే ప్రేరణ. రాయలసీమనుండి 1950 లోగా కొన్ని చారిత్రక నవలలు వచ్చాయి. 1917నాటి ‘సిరియాల దేవి’ నవలలో ధర్మవరం దేశాయిశర్మ కాకతీయుల నాటి చరిత్రలో హనుమకొండ రాజ్యాన్ని శుత్రువుల బారినుండి సిరియాలదేవి రక్షించుకోవడం ఇతివృత్తం.1920నాటి ‘చాందసుల్తాన’లో దూబగుంట వేంకటరమణయ్య అక్బరు కాలంనాటి చాందసుల్తాన ధైర్యసాహసాలను చిత్రించారు.

అక్బరును సైతం ఎదిరించి దుండగుల చేతిలో హతురాలైన అహ్మదునగర్‌ పాలకురాలు చాందసుల్తాన. వేంకటరమణయ్య 1925లో రాసిన మరో చారిత్రక నవల ‘తానీషా’. గోల్కొండ ప్రభువైన తానీషా అక్కన్న, మాదన్నల సహాయంతో పరిపాలన సాగిస్తూ ఉంటాడు. వీరిద్దరి మరణంతో తానీషా బలహీనపడతాడు. ఔరంగజేబు అనేక ఎత్తుగడలద్వారా కుట్రలద్వారా గోల్కొండ సామ్రాజ్యాన్ని తానీషానుండి జయిస్తాడు. 1925లో పాలపర్తి సూర్యనారాయణ రచించిన ‘ప్రియదర్శిని’ నవల వచ్చింది. షాజహాన్‌ దగ్గర ఉద్యోగి అయిన జనార్దనసింహుని కూతురు ప్రియదర్శినిని, తన రాజైన షాజహానును ఔరంగజేబు నుండి కాపాడుకోవడం ఇందులోని వస్తువు. ఇది విషాదాంత నవల. జనార్దన సింహుడు, ప్రియదర్శిని ఇద్దరూ మరణిస్తారు.1931లో ఘూళీకృష్ణమూర్తి రచించిన నవల ‘స్వార్థత్యాగము’. చంద్రుడనే రాజు శత్రువుల బారినుండి చిత్తూరు రాజ్యాన్ని రక్షించడం ఇందులోని వస్తువు. ఇప్పటిదాకా పేర్కొన్నవి జాతీయ, రాజకీయాలకు ప్రతిబింబాలైన నవలలైతే, ‘స్వార్థత్యాగము’ తెలుగువారి చరిత్రకు ప్రతిబింబం.

ఇలాంటిదే 1934నాటి అమిద్యాల కృష్ణారావు నవల ‘ఓనామీ’. సరస్వతీదేవి నాలు కపై బీజాక్షరాలు రాయడంతో చదువొచ్చిన ఓనామీ మూడు రాజ్యాలకు రాజై పరిపాలన సాగి స్తాడు. దండిపల్లి వేంకటసుబ్బశాస్ర్తి 1949లో రాసిన చారిత్రక నవల ‘వీర కంకణము’. ఇది కవీశ్వరుడైన జగన్నాథ పండితరాయల జీవితచరిత్రను తెలియజేస్తుంది. తన వంశం వాళ్ళకి శ్రీకృష్ణదేవరాయులు ఇచ్చిన ‘వీర కంకణమే’ ఈ నవల చివరిలో ప్రధానాంశంగా నిలుస్తుంది.సమాజంలో జరిగే అపరాధాలను పరిశీలించి ఎంతోమంది రచయితలు వాటికి పరిష్కార మార్గాలను సూచించారు. అంతేగాక అపరాధం చేసినవారిని శిక్షించేలాసాగే అపరాథ పరిశోధక నవలలు ఇతర ప్రాంతాలతో పాటు రాయలసీమలో కూడా వచ్చాయి. 1917లో రాళ్ళపల్లి గోపాలకృష్ణశర్మ ‘బగళాముఖి’ 1918లో దోమా వెంకటస్వామి గుప్త ‘చంద్రిక’, 1926లో గుంటి సుబ్రహ్మణ్యశర్మ ‘భూతగృహము’,

1929లో ‘రహస్యశోధనము’, పెరుమల రామచంద్రయ్య 1930లో ‘పేటికాంతరశవము’ అనే నవలలు రాశారు.1925లో కల్వటాల జయరామారావు రాసిన రాజకీయ నవల ‘రేనాటి వీరుడు’. బ్రిటిష్‌ వారిపై తిరుగుబాటుచేసిన ‘పాలెగాళ్ళ’వంశానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహ్మారెడ్డి చరిత్రే ఈ నవలా ఇతివృత్తం. నరసింహ్మారెడ్డి కోయిల కుంట్లలోని ఖజానాను దోచుకోవడంతో నవల ప్రారంభమై, అప్పటి బ్రిటిష్‌ అధికారి- రెడ్డిని ఉరితీయడంతో ఈనవల ముగిస్తుంది. రాయలసీమ కరవును గురించి, ముస్లింల దురాగతాలను గురించేకాక 1925నాటి సామాజిక విషయాల్ని ఈనవలలో చిత్రించాడు.1950కి ముందు రాయ లసీమ నవలా ప్రక్రియపై ఆధునిక విమర్శకులు, సాహిత్యకారులు ఇప్పటివరకూ చేసిన పరిశీలన సమగ్రంగా లేదనీ ఈ విషయాల ద్వారా తెలుస్తుంది. 1950కి ముందే రాయలసీమలో సాంఘిక, రాజకీయ, చారిత్రక, పౌరాణిక, అనువాద, అపరాధ పరిశోధక నవలలు ఎన్నోవచ్చాయి. దీనినిబట్టి 1950కి ముందే రాయల సీమలో తొలితరం నవలా ప్రక్రియ జరిగింది. 1950 తర్వాత రాయలసీమలో వచ్చిన నవలల్ని రెండవతరం గానే భావించాలి. రాయలసీమ నవలాప్రక్రియపై ఇంకా జరగాల్సిన పరిశోధన ఎంతోఉందని ఈ అంశాలే రుజువు చేస్తున్నాయి.
-పొదిలి నాగరాజు 
 Surya daily,
January 28, 2013

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...