Wednesday, August 7, 2013

రాయలసీమ అస్థిత్వం పూర్తిగా తెరమరుగయ్యే కుట్ర !

రాయలసీమ అనే పదం.. రాయలసీమ సంస్కృతి అనేది ఇక పూర్తిగా తెరమరుగు కానుందా? నిరంతరం కరువు కాటకాలతో తల్లడిల్లుతూ ఉన్నా.. తనకంటూ సుదీర్ఘమైన ప్రత్యేక సాంస్కృతిక చరిత్ర కలిగిన రాయలసీమ గురించి ఇక మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకునే రోజొస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్ల లెక్కల కుట్రలతో సీమను రెండు ముక్కలుగా విడగొట్టి.. తెలంగాణలో ఒక చెక్క.. ఆంధ్ర ప్రాంతంలో మరో చెక్క కలిపేయనుందా? అవుననే ధ్రవీకరిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వంలోని అత్యంత ఉన్నతస్థాయి వర్గాలు! జాతీయస్థాయిలో కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం నడుపుతున్న కుట్ర వల్ల.. సుదీర్ఘమైన ప్రత్యేక సాంస్కృతిక చరిత్ర కలిగిన రాయలసీమ అస్థిత్వం పూర్తిగా తెరమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందనే ఆందోళన ఇప్పుడు ఆ ప్రాంతంలో సర్వత్రా వ్యక్తమవుతోంది. రాయలసీమ అస్థిత్వాన్ని దెబ్బతీస్తూ ఓట్లు, సీట్ల లెక్కలతో విభజించాలని కాంగ్రెస్ హైకమాండ్ గత కొద్ది రోజులుగా తెరవెనుక కసరత్తును ముమ్మరం చేసింది. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఆ దిశగా అడుగులు వేగవంతం చేసినట్లు ఢిల్లీ నుంచి సమాచారం అందుతోంది. అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన కొందరు పార్టీ నేతలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినదానికి
తలూపుతూ రాయలసీమను విభజించటానికి అంగీకారం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అత్యున్నత స్థాయి వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు.. అనంతపురం, కర్నూలు జిల్లాలను రాయలసీమ నుంచి విడదీసి తెలంగాణలో కలిపి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ నాయకత్వం తెరవెనుక రచించిన ప్రణాళికను త్వరలోనే కార్యరూపంలోకి తేవాలని భావిస్తోంది. సెంటిమెంట్ ఆధారంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు ఒక ప్రాతిపదిక ఉండగా.. రాయలసీమ ప్రజలకు ఏమాత్రం సంబంధం లేకుండా వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా.. వారి అస్థిత్వాన్ని, మనోభావాలను దెబ్బతీసే అతిపెద్ద కుట్రకు కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలే జీ హుజూర్ అంటూ సాగిలపడటంపై రాయలసీమ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఎవరూ అడగకుండానే... ఎవరినీ అడగకుండానే... దేశ చరిత్రలో ఎక్కడా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను సరిసమంగా పంచుతామన్న ప్రాతిపదికన రాష్ట్రాల విభజనగానీ విలీనంగానీ జరగలేదు. తొలిసారిగా కాంగ్రెస్ నాయకత్వం రాయలసీమ ప్రజలు ఏనాడూ కోరని, ఒక ప్రాతిపదిక లేని అంశాన్ని తెరమీదకు తెచ్చి రాజకీయ క్రీడ సాగిస్తోంది. సెంటిమెంట్ ఆధారంగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని డిమాండ్ చేసిన ప్రజలు సైతం.. రాయలసీమ ప్రాంతాన్ని విడదీసి అందులో కొంత ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని ఏనాడూ కోరలేదు. తెలంగాణ వాదులు కానీ, రాయలసీమ ప్రజలు కానీ ఏనాడూ అడగని, ఏమాత్రం అభిలషించని విధంగా.. కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం సీమ జిల్లాలను కత్తిరించి తెలంగాణలో కలిపే కుట్రను ఇరు ప్రాంతాల ప్రజలు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేయటానికో.. కొన్ని సీట్లు ఎక్కువ గెలుచుకోవచ్చనో.. సీట్లు ఓట్ల లెక్కల ప్రాతిపదికన.. సుదీర్ఘ ప్రత్యేక సంస్కృతి కలిగిన ఒక ప్రాంతాన్ని అడ్డంగా చీల్చటానికి ఆ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ కాంగ్రెస్ అడుగులు వేస్తుంటే.. అందుకు కొందరు రాయలసీమ ప్రాంత నాయకులే మడుగులు వత్తుతూ తమ పబ్బం గడుపుకోవటానికి సాగిస్తున్న లాలూచీ రాజకీయాలపై ఆ ప్రాంత ప్రజలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ప్రజల నుంచి ప్రతిఘటన వ్యక్తమవుతున్నప్పటికీ కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఒక భయంకరమైన నిర్ణయానికి రావటమేంటని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే... రాష్ట్ర విభజనపై ఓట్లు సీట్ల లెక్కలతో ముందుకెళుతున్న కాంగ్రెస్ హైకమాండ్ ఆ క్రమంలోనే రాయలసీమ ప్రజల సెంటిమెంట్‌ను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవటం లేదని తెలుస్తోంది. ఒకసారి పది జిల్లాలతో కూడిన తెలంగాణ అని.. మరోసారి రాయల తెలంగాణ అని.. ఇంకోసారి హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతమని.. ఇలా రకరకాల లీకులను ప్రచారంలో పెడుతూ రాష్ట్ర ప్రజలను గందరగోళంలోకి నెడుతున్న కాంగ్రెస్ నాయకత్వం తెరవెనుక మాత్రం పెద్ద తతంగమే నడిపిస్తోందని సమాచారం. రాయలసీమను విడగొట్టి రెండు జిల్లాలను తెలంగాణలో కలపటం ద్వారా తెలంగాణలో కేసీఆర్‌ను అదుపులో పెట్టవచ్చని.. మరో రెండు జిల్లాలను కోస్తాలో కలపటం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయవచ్చని.. తద్వారా ఓట్లు, సీట్ల లెక్కల్లో తను రాజకీయ ప్రయోజనం పొందవచ్చని భావించిన కాంగ్రెస్ అధిష్టానం.. కేవలం అందుకోసమే ఈ కుట్రను అమలు చేయబోతోందని తెలుస్తోంది. సీమ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు కొందరు తమ రాజకీయ ప్రయోజనం కోసం.. రాయలసీమను విభజించటానికి హైకమాండ్ చెప్పినట్లు అంతర్గతంగా తలూపుతున్నారు. సమైక్య రాష్ట్రం కోసం ఢిల్లీలో ఏదో హడావుడి చేస్తున్నట్టు పైకి కనపడుతూ లోలోన హైకమాండ్ ఆశించే దిశగా మిగిలిన నేతలను ఒప్పించే పనిని ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం కావటంతో.. కాంగ్రెస్ హైకమాండ్ ఆశించిందే ఆలస్యమన్నట్లు తెరవెనుక లాలూచీని మరింత ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఎడారిగా మారే దారిలో: రాయలసీమ అన్నదే కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రాంతం. అందులోంచి ఆవిర్భవించిన తనదైన ప్రత్యేక సంస్కృతిని నిలుపుకున్న ప్రాంతం. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు తెలుగు ప్రజల ఐకమత్యం కోసం కర్నూలు రాజధానిని కోల్పోయిన విషయాన్ని ఇక్కడి ప్రజలు గుర్తుచేస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితులు, పరిణామ క్రమంలోనూ ఆ ప్రాంతం వెనుకబడిన ప్రాంతంగానే మిగిలిపోయింది. అక్కడ చేపట్టిన ప్రాజెక్టులు సైతం మిగులు జలాలపై ఆధారపడి మాత్రమే నిర్మించారు. రాయలసీమను విభజించటం ద్వారా మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టులన్నీ ఎడారిగా మారే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కృష్ణా నదిలో నీటిపై హక్కూ దిక్కూ లేదు. పైన మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములు నిండితే తప్ప కింద కు చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు చేర్పులు చేయకుండా మధ్యలో ఇంకో రాష్ట్రాన్ని ఏకపక్షంగా ఏర్పాటు చేస్తే శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? శ్రీశైలం ప్రాజెక్టుకే నీళ్లు దిక్కులేనప్పుడు నాగార్జునసాగర్ పరిస్థితి ఏమిటి? ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణా నదీ జలాలపై ఒకవైపు మహారాష్ట్ర, కర్ణాటక చర్యలతో ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటికే తీవ్ర నష్టం జరుగుతోంది. తాజాగా మరో రాష్ట్రం ఏర్పాటు చేయటం ద్వారా మిగులు జలాలు పూర్తిగా ప్రశ్నార్థకమవుతుండగా, ఆ మిగులు జలాలపై ఆధారపడిన గాలేరు నగరి, తెలుగుగంగ, హంద్రీనీవాలకు చుక్కనీరు కాదుకదా ఆ పథకాలన్నీ తెరమరుగు కాకతప్పని పరిస్థితి. ఇదే జరిగితే కాంగ్రెస్ మోసపూరితంగా రాయలసీమను విభజించటం.. మిగులు జలాలపై ఆధారపడిన ప్రాజెక్టుల అస్థిత్వం కోల్పోయి, ప్రాంతాలన్నీ మరింత కరవు కాటకాల్లోకి నెట్టటమేనని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఆ దిశగా ఒక్కో అడుగు: రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేయబోయే కేంద్ర మంత్రుల కమిటీ.. పది జిల్లాలతో కూడిన తెలంగాణయే కాకుండా మిగతా డిమాండ్లను పరిశీలిస్తుందని సీడబ్ల్యూసీ నిర్ణయం అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ స్పష్టంగా చెప్పారు. వాస్తవానికి ఢిల్లీలో తెరవెనుక రాయలసీమ విభజనపైనే ప్రణాళికలు సిద్ధమైనట్లు సమాచారం. విభజించాలని డిమాండ్ చేసింది తెలంగాణ అయితే.. రాయలసీమను విభజించటమేమిటన్న ప్రశ్న ఉదయిస్తుంది కాబట్టి.. మొదట్లో ఆ సమస్య తలెత్తకుండా ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ నాయకత్వం తన పనిని చేసుకుంటూ పోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. త్వరలో నియమించే కేంద్ర మంత్రుల కమిటీ ముందు కాంగ్రెస్ నేతలే ఈ ప్రాతిపదన పెట్టి దానికి సానుకూలత ఉన్నట్లుగా కుట్ర పూరితంగా చెప్పింది దాన్ని చొప్పించటానికి ఇప్పటికే పథకరచన పూర్తయినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సమైక్య రాష్ట్రం కోసం నడుస్తున్న ఉద్యమాలు చల్లారిన తర్వాత రాయలసీమను విభజించే అంశం తెరపైకి తెస్తారని ఏఐసీసీలోని అత్యున్నత వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

 సీమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లే..  

‘‘రాయలసీమను రెండు ముక్కలు చేసి తెలంగాణ లో విలీనం చేస్తే రాయలసీమ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టినట్లే. అనంతపురం, కర్నూలు రాజకీయ నాయకులు తమ ప్రాబల్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజల గుండెల్లో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రాబల్యాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్, టీడీపీ నేతలు ఏకమై కుట్ర పన్నారు. హైదరాబాద్‌లోని తమ ఆస్తులను కాపాడుకునేందుకు కొందరు రాజకీయ నాయకులు రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారు. రాయల తెలంగాణ వద్దు.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందే’’ 
- ప్రొఫెసర్ మల్లికార్జునరెడ్డి
ఎస్కేయూ, అనంతపురం 
  ‘‘కేంద్రం స్వార్థ ప్రయోజనాల కోసమే రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తెస్తోంది. అదేగాని జరిగితే రాయలసీమ తన అస్తిత్వాన్నే కోల్పోతుంది. జలయజ్ఞంలో కోస్తా వారికి పులిచింతల, తెలంగాణలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులను పూర్తి చేశారు. రాయలసీమలో మాత్రం ఎలాంటి భారీ ప్రాజెక్టులను పూర్తిచేయలేదు.
  
- ఎం.శ్రీరామిరెడ్డి, చీఫ్ ఇంజనీర్, రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదలశాఖ మాజీ సలహాదారు (కడప)  
స్వార్థ, సంకుచిత రాజకీయాల కోసమే ఈ ప్రతిపాదన కాంగ్రెస్ కేవలం తన స్వార్థ, సంకుచిత రాజకీయాల కోసమే చేస్తోంది. కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ఈ కుట్రల వల్ల శ్రీశైలం అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా మారుతుంది. రాయలసీమ ప్రాంతానికి నీరొచ్చే అవకాశం పూర్తిగా కోల్పోతుంది. మిగులు జలాలపై ఆధారపడిన గాలేరునగరి, హంద్రీనీవా, తెలుగుగంగ స్కీమ్స్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. నీరొచ్చే అవకాశమే లేదు. కాంగ్రెస్ చర్యల వల్ల రాయలసీమతో పాటు మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లా ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతారు. -ఎం.వి.మైసూరారెడ్డి (వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత)


No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...