Monday, June 3, 2013

రాయలసీమ కవులకు న్యాయం జరిగిందా?

‘క్షామము లెన్ని వచ్చిన రసజ్ఞత ఇంచుక చావలేదు రాయలసీమలో’ అన్నారు నండూరి రామకృష్ణమాచార్యులు. ఈ రసజ్ఞత కవులదే! వారి సాహిత్య కృషి అనితర సాధ్యమైంది. ఒక పుట్టపర్తి, ఒక విద్వాన్ విశ్వం, ఒక పప్పూరు రామాచార్యులు, రాళ్లపల్లి కల్లూరు అహోబలరావు.. ఇలా ఎందరెందరో సాహితీ కృషీవలురు. ఇక విమర్శ పుట్టింది సీమగడ్డలోనే. కట్టమంచి రామలింగారెడ్డి ‘కవిత్వ తత్వ విచారం’ చాలా ముందుగానే వచ్చింది. రాళ్లపల్లి వేమన ఉపన్యాసాలు, రా.రా. విమర్శలు, కట్టమంచి, రా.రాల విమర్శ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఎందరెందరో (ఇవి కొందరి పేర్లు మాత్రమే) సాహితీ కృషీవలులు సీమ సాంఘిక, భౌగోళిక, ప్రజల జీవన పార్శ్వాలను, కరువు, ఫ్యాక్షనిజం తదితర అంశాలపై కథలు, కవితలు, కావ్య విమర్శలు, ప్రాచీన ఆధునిక సాహిత్య సంప్రదాయ రచనలు చేసి లబ్దప్రతిష్ఠులయ్యారు. అయితే సీమలో పుట్టడం వల్లనో, వెనుకబడిన ప్రాంతాల ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కారణాలచేతనో.. సీమ రచయితలు, కవులు, కథకులు, సాహితీ విమర్శకులకు తగిన గుర్తింపు రాకపోగా... జ్ఞానపీఠం లాంటి అవార్డులకు, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డులకు (ఒకరో ఇద్దరో తప్ప) అనంతపురం కరువుజిల్లా వారికి.. అసలే లేవు. రావు. కారణాలు ఆ ప్రాంతపు అసమర్థులైన రాజకీయ నాయకులు.. సాహిత్య విలువలు తెలియని పాలకులు.. తెలంగాణ.. కోస్తా ప్రాంతాల మాదిరి పోరాట పటిమ, ఐక్యత లేదు. కాకాలు, బాకాలు ఊదే సంస్కృతికి భిన్నంగా.. ముక్కుసూటిగా వెళ్ళే మనస్తత్వాలు, కరువును బాగా అనుభవించిన నేపధ్యంలో.. కోరికలు తక్కువగా ఉండటం.. ఇలా ఎన్నో కారణాలచేత సీమ కవులకు, రచయితలకు, విమర్శకులకు రావలసిన కీర్తిగాని, ‘పదవులుగాని, అవార్డులుగాని దక్కలేదన్నది ఎవరూ కాదనలేని సత్యం. ఇప్పటికి తెలుగువారికి రెండు జ్ఞానపీఠ అవార్డులు వస్తే.. అవి సీమేతర ప్రాంత కవులకు మాత్రమే వచ్చాయి. ఇది సీమకవులకు జరిగిన ద్రోహం కాదని ఎవరైనా అనగలరా? పోనీ అర్హులు లేరా? పదునాలుగు భాషల్లో పాండిత్యం సంపాదించి, శివ తాండవం జనప్రియ రామాయణం, పెనుగొండ లక్ష్మీలాంటి కావ్యాలు, అనువాదాలు.. విమర్శలు.. రాసిన పుట్టపర్తి నారాయణాచార్యుల సాహితీ కృషికి ఎన్ని జ్ఞానపీఠాలు ఇస్తే సరిపోతుంది? ఆ రోజుల్లోనే వందకు పైగా కావ్యాలు, విమర్శలు.. ఇలా అనేక గ్రంథాలు రాసిన ఆ నిత్య సాహితీ కృషీవలునికి జరిగిన అన్యాయం తలుచుకుంటే.. ఒళ్ళు మండిపోతుంది. కేవలం కరువు సీమలో పుట్టడం వల్లనే.. ఆ కృషి బుగ్గిపాలయిందా? నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, వెదుకల్లు సదాశివన్ లాంటి రాజకీయ ఉద్దండులు కూడా సీమ కవులకు అండగా నిలవకపోవడం, న్యాయం చేయకపోవడం దారుణం. పెనుగొండలో గగనమహల్ కేంద్రంగా అష్టదిగ్గజ కవులను కృష్ణదేవరాయలు ఎంతగానో ప్రోత్సహించారు. పెద్దన మనుచరిత్రలోని హిమాలయ పర్వత వర్ణన.. భట్టుమూర్తి వసుచరిత్రలోని కోలాహల పర్వతం (పెనుగొండ), శుక్తిమణి (చిత్రావతి) నదులు ఈ ప్రాంతంలోనివే అంటారు. ఇలాంటి ప్రాశస్త్యం కలిగిన ఈ ప్రాంతాన్ని చిన్న వయసులోనే ‘పెనుగొండ’ లక్ష్మికావ్యంగా చిత్రించి.. సరస్వతీపుత్రునిగా పేరుపొందిన పుట్టపర్తికి జ్ఞానపీఠం దక్కకపోవడం దురన్యాయమే.. ఆనాడే కాదు ఈనాడు కూడా.. బాలల సాహిత్యం ‘అక్షర సైన్యం’లాంటి అభ్యుదయ కవిత్వం రాసి ‘కవి కాకి’గా పేరుపొందిన గొప్ప కవి కోగిర జై సీతారాంకు కనీసం బాలల అకాడమీ అవార్డు అయినా ప్రభుత్వంగాని.. సాహితీ సంస్థలు గాని ప్రకటించకపోవడం శోచనీయం. అటు కర్నాటకలో ఇప్పటికి 12 మంది కవులకు కథా రచయితలకు జ్ఞానపీఠ అవార్డులు దక్కాయంటే.. అక్కడ సాహితీ సృజనకారులకు ఎంతటి ప్రోత్సాహం లభిస్తుందో.. ఇట్టే మనం ఊహించవచ్చు. దౌర్భాగ్యం.. ఏమిటంటే.. అదే కర్నాటక సరిహద్దులో ఉన్న అనంతపురం జిల్లా రచయితలకు కవులకు.. పెనుగొండలో (రాయల విడిది) పనిచేసిన కవులకు ఎలాంటి అవార్డులు (స్థాయికి తగిన) దక్కకపోవడం విడ్డూరం. సీమ రచయితల్లో బాగా నష్టపోయిన గొప్ప రచయిత పులికంటి కృష్ణారెడ్డి. సీమ చిన్నోడిగా గుర్తింపు పొంది సీమ కథల మాండలికాలను.. జానపద గేయాల (అమ్మి పాటలను) మాధుర్యాలను చిత్తూరు నుంచి చికాగో వరకు రుచి చూపించిన ఆ మహాకథకున్ని అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాని.. ఇటు పేరొందిన సాహితీ సంస్థలు గాని గుర్తించి.. గౌరవించకపోవడం శోచనీయం. ఆయన రాసిన దళిత కథలు దళిత వాదం పుట్టకముందే వచ్చాయి. నండూరి ఎంకి పాటలకు ఏమాత్రం తీసిపోనివి పులికంటి అమ్మిగేయాలు. ఆయన కేవలం సీమ ప్రాంతం వాసి కావడంవల్లనే.. న్యాయం జరగలేదన్నది నూటికి నూరు శాతం నిజం. సాహిత్యపు పిచ్చితో రైల్వేలో మంచి ఉద్యోగం కూడా వదులుకున్న పులికంటి సాహితీ సేవలను తలచుకుంటే.. ఎంతో బాధ కలుగుతుంది. చివరకు ఆయనే తన పేరిట అవార్డులు ప్రకటిస్తూ.. సాహితీ సేవ చేశారు. కన్నడంలో ఎంతోమంది కథారచయితలకు జ్ఞానపీఠ అవార్డులు ఇచ్చారు.
సీమలో సింగమనేని, డా.శాంతినారాయణ, బండి నారాయణస్వామి లాంటి వారికి కనీసం అకాడమీ అవార్డులు కూడా రాలేదు. సీమ కథకు దిశానిర్దేశం చేసిన సింగమనేని సీమ రైతులపై ఎన్నో కథలు రాశారు. పల్లేరు ముళ్ళు పేరుతో శాంతి నారాయణ అద్భుత కథా సంకలనం విడుదల చేశారు. బండి నారాయణస్వామి.. తెల్లదెయ్యం, వానరాలె లాంటి ఒక్కో కథకు.. ఒక్కో అవార్డు ఇవ్వవచ్చు. సీమ కరువును అనుభవించి, కడుపులు మండి.. గుండెలు రగిలి... పొగిలి.. కథలు.. కవితలు రాసిన సీమ కవులకన్నా ఏ ఆఫ్రికన్ కవి గొప్పవాడో.. ఏ అమెరికన్ రచయిత గొప్పవాడో.. దమ్మున్న సాహిత్యకారుడెవరైనా చెప్పగలడా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే అవార్డు పుస్తకాల్లో.. ఇంతకన్నా సత్తా ఉన్నా.. పుస్తకాలేమిటో.. వాటి గొప్పతనమేమిటో.. చెప్పగలరా? కర్నాటక సరిహద్దులోనే హళెకన్నడ.. హొసగన్నతి- సంస్కృతులను.. భాషా మాండలికాలను.. ప్రజల జీవన విధానాలను చిత్రించిన కన్నడ రచయితలకు.. కర్నాటక సరిహద్దు రచయితలకు పెద్ద తేడా ఏమిటో ఏ యూనివర్సిటీ పరిశోధకులైనా నిగ్గు తేల్చగలరా?
  • - బిక్కి కృష్ణ, 9912738815
  • ANDHRA BOOMI 03-06-2013

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...