Sunday, April 28, 2013

కొడవటిగంటి, రారా బాటలో సింగమనేని

సింగమనేని నారాయణ కథా నవలా రచయిత. ఆయన విమర్శ కూడా ఈ రెండింటి మీదనే ఎక్కువ. కొల్లాయి గట్టితేనేమి?, జానకి విముక్తి వంటి నవలలు, చాసో, రారా, రాజారాం తదితర కథకుల మీద సింగమనేని చేసిన విమర్శ... తెలుగు సాహిత్య విమర్శలోని ఆరోగ్యకర ధోరణికి, నిబద్ధతకు నిదర్శ నాలు. సమాజ సాహిత్య సంబంధం, సాహిత్య ప్రయోజనం, సాహిత్యకారుల కర్తవ్యంపై స్పష్టత ఉన్న ఆయన సాహిత్య విమర్శలో నిక్కచ్చితనం కనిపిస్తుంది. ఆయన రాసే విమర్శ పరిమితం, చర్చిం చేది అపరిమితం. ఆయన విమర్శను చదివితే ఆయన మరో రారాలా కనిపి స్తారు. విమర్శలో కరుకుదనాన్ని రారా వారసత్వంగా పుణికిపుచ్చుకున్నారు. రారా మాదిరిగానే సింగమనేని కూడా పాఠకుడి దృష్టి కోణం నుంచి రచనను అంచనా వేస్తారు. ఏ రచనను విమర్శించినా అది పాఠకుడి మీద ఎలాంటి ప్రభావం చూపు తుందో చెబుతారు. రచయిత, రచనలో నచ్చిన అంశాన్ని ఎంత మక్కువతో చెబుతారో నచ్చని దాన్ని అంత కటువుగా చెబుతారు. అలాగే రచయిత ఎంత పేరున్న వ్యక్తి అయినా వ్యతిరేకించాల్సి వచ్చిన ప్పుడు ఏ మాత్రం ఉపేక్షించరు.
రారా సాహిత్యం పాఠకుని సంస్కారం మీద ప్రభావం చూపుతుందని బాగా ప్రచారం చేశారు. సింగమనేని ఆయన మార్గంలో ఈ అభిప్రాయాన్ని అనేక విమర్శ, వ్యాసాల్లో ప్రస్తావిస్తూ వచ్చారు. 'రారా కథలన్నీ చదివింతర్వాత పాఠకుడి సంస్కార స్థాయి ఒక మెట్టు అయినా పెరుగుతుందని నమ్మకంగా చెప్పవచ్చు' (పాఠకుడి సంస్కార స్థాయిని పెంచే రారా కథలు). 'స్త్రీవాద కథలు ముఖ్యంగా పురుష పాఠకులను చాలా డిస్టర్బ్‌ చేశాయి'(తెలుగు కథ, 1990 తర్వాత). 'చాసో గారి- ఎందుకుపారేస్తాను నాన్నా' కథలో పన్నెండేళ్ల కృష్ణుడి అంతరంగం, ఆ తండ్రి సంఘర్షణ, ఆర్థిక అసహాయత పాఠకుణ్ణి కలచివేస్తాయి'(చాగంటి సోమయాజులు కథలు). 'కల్లేటి వంక' కథలోని అనైతిక సంబంధాల చిత్రణను గురించి చెబుతూ, వాటిని చదివిన 'పాఠకులు మూర్చ పోవలసిందే' అంటారు. డాక్టర్‌ వి.చంద్ర శేఖర రావు 2002లో రాసిన కథలలోని శిల్పాన్ని గురించి చెబుతూ 'పిడికెడు విమర్శకుల మెప్పు కోసమే కథలు రాస్తూ అనంతమైన పాఠకుల్ని మరచిపోయారు చంద్రశేఖరరావు'(తెలుగు కథ 2002) అన్నారు. ఇలాంటి అభిప్రాయాన్ని చదివినప్పుడు బాగా చదువుకున్న సాహిత్య విమర్శకుడు సామాన్య పాఠకుని తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారని పిస్తుంది. రంగనాయకమ్మ, చంద్రశేఖర రావు, గోపిని కరుణాకర్‌ వంటి రచయితల లోని గుణాగుణాలను నిజాయతీగా విశ్లే షించిన సింగమనేని నిబద్ధ విమర్శకుడు.
సింగమనేని సాహిత్యవిమర్శనం తటినీ అధ్యయనం చేస్తే మార్క్సిజం అధ్య యనం ద్వారా ఆయన ఏర్పరచుకున్న సాహిత్యాభిప్రాయాలు తెలిసివస్తాయి. సాహిత్య సృజనకైనా, విమర్శకైనా ఆ అభిప్రాయాలు బాగా దోహదం చేస్తాయి. సామాజిక సాహిత్య విమర్శకుల్లో కట్ట మంచి నుంచి లెక్కవేసుకుంటే నాలుగు తరాల వాళ్లు కనిపిస్తారు. మార్క్సిజం స్పర్శలేకుండా సమాజ జీవితానికి సాహి త్యం దర్పణంగా ప్రతిఫలంగా భావించే కట్టమంచి తరంలో రాళ్లపల్లి, పుట్టపర్తి వంటి వాళ్లు వస్తారు. మార్క్సిజం తెలుగు వాళ్లకు పరిచయమైన తర్వాత పునాది ఉపరితల సిద్ధాంతం ప్రకారం సాహిత్యం, కళలు ఉపరితలాంశాలుగా భావించే తరం శ్రీశ్రీ, కొకు, ఎంఆర్‌ చంద్ర, పుచ్చలపల్లి వంటి వాళ్లది. ఆ సిద్ధాంతాలు మరింత స్పష్టతతో ముందుకు తీసుకుపోయిన తరం రారా, వల్లంపాటి, కేతు, కొలకలూరి, చేరా, వివి, త్రిపురనేని మొదలైన వాళ్లు. ఆ తర్వాత తరంలో వేణు, సింగమనేని, చెంచయ్య, తెలకపల్లి, ఎస్వీ, కాత్యాయని విద్మహే వంటి వాళ్లు ఉన్నారు. ఈ తరంలో దళిత, బహుజన, మైనారిటీ, స్త్రీ, ప్రాంతీయ అస్తిత్వవాదాలు తమవైన ప్రమా ణాలతో తెలుగు సాహిత్యం, విమర్శలోకి ప్రవేశించాయి. సింగమనేని వీళ్లందర్నీ అధ్యయనం చేశారు.. చేస్తున్నారు.
సింగమనేని.. సాహిత్యంలోని వస్తువు లోనే కాదు, శిల్పంలో కూడా వాస్తవికతే ప్రధానంగా ఉండాలని భావిస్తారు. ప్రయోగాల పేరుతో పాఠకులకు వస్తువు అందకుండా అడ్డుకునే ప్రయోగాలు, పాఠకుడ్ని బోల్తా కొట్టించే మలుపులను ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారు. అందుకే 'స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం ఉంటే మెలోడ్రామా లేకుండా వస్తువును ఆవిష్కరించవచ్చు' అంటారాయన (రాయలసీమ కథా చిత్రం). సిద్ధాంతాల కోసం రచన చేయడాన్ని కోకు మాదిరిగానే సింగమనేని కూడా వ్యతిరేకిస్తారు. రచయితలు సామాజిక మూలాలు తవ్వి తీయాలిగాని, రచనలు సిద్ధాంతాలు వల్లిం చకూడదంటారు. రచయితలు సాధించ దలచుకున్న ప్రయోజనం కోసం పాత్రల్ని బలిపెట్టకూడదన్నది ఆయన అభిప్రాయం. అలాగే రచనలో పనిగట్టుకొని ఉపన్యాసా లివ్వడాన్ని, ఆ రకంగా కళాధర్మాలను అతిక్రమించడాన్ని సింగమనేని పూర్తిగా తిరస్కరిస్తారు. శిల్ప మర్యాదాతిక్రమణ లను ఆమోదించని నిబద్ధ విమర్శకుడు సింగమనేని. అందుకే ఆయనకు క్లుప్తతకు మారుపేరైన చాసో అంటే మహా ఇష్టం. 'ఏ కథలో కూడా (చాసో) రచయిత ప్రవక్త స్థానంలో కూచోడు' అని ప్రశంసించిందిం దుకే. సినిమాల్లో లాగా కల్పనా సాహిత్యం లో కూడా రచయితలు ఆదర్శీకరణ అనే బలహీనతకులోనై పాత్రల చైతన్య స్థాయికి విరుద్ధంగా వాటిని చిత్రిస్తూ ఉంటారు. పెద్దపెద్ద మాటల్ని చెప్పించడం, అసంబ ద్ధమైన త్యాగాలు చేయించడం వంటివి చేయిస్తారు. సింగమనేని ఈ అతిపాత్రీ కరణను వాస్తవికతా విరుద్ధమైనదిగా భావిస్తారు. అందుకే అల్లం రాజయ్య 'అతడు' కథలో మితిమీరిన వీరపూజను చూశారు సింగమనేని.
ఎంత విస్తృతంగా రచనలు చేసేవా ళ్లైనా పునరుక్తులు చేయడం, మూస ధోరణిలో పడిపోవడం ఉపేక్షించదగింది కాదని సింగమనేని భావన. సహజత్వం, అనివార్యత, వైవిధ్యం.. ఇవి రచనకు ప్రాణభూతాలైన లక్షణాలుగా సింగమనేని భావిస్తారు.విశ్వసనీయత దెబ్బతింటే రచనా ప్రయోజనం దెబ్బతింటుందని ఆయన హెచ్చరిస్తారు. రచనంతా చదివిన తర్వాత దానిలో ఏమి చెప్పదలచుకున్నది పాఠకుడికి తెలియకపోతే ఆ రచన దండగని కూడా సింగమనేని నిష్కర్షగా చెబుతారు.
సాహిత్య రచనలో రచయిత సామా జిక సమస్యల్ని ఆవిష్కరించి పాఠకుల్లో ఆలోచనలు రేకెత్తించి పరిష్కారాలను వారికే వదిలేయాలే తప్ప పరిష్కారం చెప్పే బాధ్యతను రచయితలు తీసుకోరాదు అని భావించడంలో సింగమనేని 1935-45ల నాటి కొడవటిగంటి అభిప్రాయాన్నే సమర్థిస్తారు. చాసోను సింగమనేని బాగా మెచ్చుకునేది ఈ కారణంగానే. ప్రజల సమస్యలకు రచయితలు పరిష్కారాలు చెప్పబూనడం ఔత్సాహిక లక్షణమని ఆయన అభిప్రాయం.
మంచి సాహిత్య పఠనం పాఠకుల్ని ప్రభావితం చేసి, వాళ్ల సంస్కారంలో మార్పులు తీసుకొచ్చి, వాళ్లను చెడ్డ సాహిత్య పఠన ప్రభావం నుంచి కాపాడు తుందని సింగమనేని అభిప్రాయం. యద్ధనపూడి సులోచనారాణి 'కీర్తికిరీటాలు' నవల గురించి 'ప్రజావ్యతిరేక సాహిత్యాన్ని తిప్పికొట్టగల చైతన్యం పాఠకుడు సాధించి నప్పుడు ఇలాంటి నవలలు తుక్కుకుం డీలలో చేరుకుంటాయి' అని.. రంగ నాయకమ్మ 'జానకి విముక్తి' నవలను గురించి 'పాఠకుల్ని భ్రమల్లో ముంచే రంగురంగుల ప్రేమల నుంచి మన సాహి త్యం విముక్తి చెందాలి అన్న స్ఫూర్తిని స్తుంది' అని ఆయన వ్యాఖ్యానించడంలో ఇదే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఉత్తుత్తి కథ, ఉత్త కథ అని రెండు రకాల కథలుం టాయిన చెప్పిన కొకు.. సింగమనేని ఆవేశించినట్లనిపిస్తారు ఇలాంటి చోట్ల.
సాహిత్యం భావప్రచారానికి బలమైన సాధనం అన్న అభిప్రాయంతో సింగమనేని పూర్తిగా ఏకీభవిస్తారు. అలాగే రారా లాగే ప్రచార వాఙ్మయమంతా సాహిత్యం కాదని, సాహిత్యంలో ప్రచార గుణంతోపాటు కళాత్మకత అత్యంత ముఖ్యమైన భాగమని గట్టిగా నమ్ముతారు. కొకులాగే తత్వో పదేశం కోసం శిల్ప మర్యాదలు అతిక్ర మించరాదని ప్రబోధిస్తారాయన. పాఠకుల్ని భ్రమల్లోకి నెట్టకుండా వాస్తవికతా మార్గంలో నడిపించే రచయితల్ని ప్రశంసిం చారాయన. కేతు విశ్వనాథరెడ్డి కథల్ని గురించి చెబుతూ 'రచయితలు ప్రపంచం నుండి వాస్తవిక ప్రపంచలోకి పాఠకుణ్ణి నెట్టుతారు' అనడం ఈ దృష్టితోనే. పాఠకుల్ని ఏడిపించడం సాహిత్య కర్తవ్యం కాదన్న కొడవటిగంటి అభిప్రాయాన్ని సింగమనేని గట్టిగా విశ్వసిస్తారు. చెడుపై అయిష్టత, కోపం, వ్యతిరేకత కలిగించడమే రచయిత చేయాల్సిన పని అని సింగమనేని నమ్ముతారు. వస్తువులోనైనా, శిల్పంలో నైనా రచయితలు చేసే కల్పనలు, ప్రదర్శిం చే విన్యాసాలకు సామాజిక ప్రయోజనం దెబ్బతినని ఐక్యత, అర్థం పరమార్థం ఉం డాలని సింగమనేని కోరుకుంటారు. రచనను స్థల కాలబద్ధమైన మానవ జీవిత ప్రతిఫలంగా సింగమనేని భావిస్తారు. అందుకే రచయిత జీవితంతో ముడిపెట్టే రచనను విశ్లేషిస్తారు. అలాగే రచయిత స్థల కాలాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కొల్లాయిగట్టితేనేమి (మహీధర రామమోహనరావు) నవల మీద రాసిన వ్యాసంలో దానిని గొప్ప రాజకీయ చారిత్రక నవలగా నిర్వచిస్తూ ఆ నవల కథాకాలాన్ని, రచనా కాలాన్ని సమన్వయించుకున్నారు.
సింగమనేని విమర్శలో విస్తృతమైన అధ్యయనం, శాస్త్రీయమైన విశ్లేషణ, విజ్ఞానాత్మక సమన్వయం, ఆలోచనాత్మక సూత్రీకరణలు వంటి లక్షణాలు బాగా కనిపిస్తాయి. సరళమైన వాక్యాలు, చక్కని తర్కం, సమాజం పట్ల మక్కువతో కూడిన వివరణ, సింగమనేని విమర్శ శైలి పాఠకులను ఆకర్షిస్తుంది.
రాసింది పరిమిత విమర్శ అయినా ఆరోగ్యకరమైన, నేటికి కావలసిన ఆలోచ నలు కలిగి ఉన్న సాహిత్య విమర్శకులు సింగమనేని. ఆయనది వాస్తవికతావాద విమర్శ.. ప్రగతిశీల మార్గం. కొడవటి గంటి, రారాల మార్గం అంటే ప్రజా మార్గం, శాస్త్రీయ మార్గం.
- డాక్టర్‌ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
Visaalaandhra Daily 29-04-2013

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...