Friday, April 19, 2013

‘రాయలసీమ ఉద్యమం’లో కీలక పాత్ర పోషించిన "మైసూరా"

మైసూరారెడ్డిని బాగా ఎరిగినవాళ్లతో మాట్లాడితే ఆయన వ్యక్తిత్వం కొంత అర్థమవుతుంది. ఆయనకు
డా. ఎం.వి.మైసూరా రెడ్డి
జనాన్ని ఆకర్షించేంతటి వాగ్దాటి లేకపోయినా, సబ్జెక్టును స్టడీ చేసి మెప్పించే ఓపిక ఉంది. ఈగోయిస్ట్‌గా కనబడినా, ముక్కుసూటి మనిషి. రాజకీయాల్లో ఉన్నా ‘రాజకీయం’ చేయరు. ఫ్యాక్షన్ గొడవలకు దూరం పాటిస్తారు. పైగా సెన్సిటివ్. అందువల్లే ఆయన గౌరవనీయ నాయకుడయ్యారు. అయితే ఈ లక్షణాలే ఆయన్ని ఎదగాల్సినంత ఎదగనివ్వకుండా చేశాయా? ‘ఎక్కడో పల్లెటూళ్లో పుట్టి, ఈ స్టేజ్‌కు వచ్చినాము కదా, ఇది చాలదా!’ అంటారు.

  కడప జిల్లా నిడిజివ్వి గ్రామంలో జన్మించిన మైసూరా ‘రాయలసీమ ఉద్యమం’లో కీలక పాత్ర పోషించారు. మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. రాష్ట్ర హోంమంత్రిగా పనిచేశారు. సుమారు 25 ఏళ్లు కాంగ్రెస్‌లో కొనసాగి 2004లో తెలుగుదేశంలో చేరారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఎం.వి.మైసూరారెడ్డితో ‘సాక్షి’ ప్రతినిధులు డి.శ్రీనాథ్, పూడూరి రాజిరెడ్డి సంభాషించారు. సారాంశం ఆయనదైన రాయలసీమ మాండలికంలోనే...

మొదట్నుంచీ రైతు కుటుంబము. సిర్రాజుపల్లి అనే చిన్న గ్రామం నుంచి మా అబ్బ నిడిజివ్వికి ఇల్లటం వచ్చినాడు. మా వూల్లల్లో తండ్రి తండ్రిని అబ్బ అంటాము. తల్లి తండ్రిని తాత అంటాము. మా తండ్రి చనిపోయేంతవరకు అన్‌అపోజ్డ్‌గా గ్రామ సర్పంచిగా చేసినాడు. మా అమ్మ అన్నగారు(మాజీ ఎంపీ, ప్రముఖ అడ్వకేట్ ఊటుకూరి రామిరెడ్డ్డి) కూడా రాజకీయాల్లో ఉంటూ వచ్చినాడు. అలా మొదట్నుంచీ రాజకీయాలతో సంబంధాలుండేవి.
ప్రొద్దుటూరు దగ్గర తాళమాపురం అనే ఊరుంది. అక్కడ ఉన్న గ్రామదేవత మైసూరమ్మ. అందుకే మైసూరయ్య, మైసూరప్ప, మైసూరమ్మ అని పేర్లు పెట్టుకుంటారు. ఆమె పేరు మీదనే నాకూ మైసూరారెడ్డి అని పెట్టినారు. మానాన్న కూడా బాలమైసూరారెడ్డి. బయటి ప్రాంతాల్లో ఇది విచిత్రంగా ఉంటుంది. ఏదో మైసూరు ఉంది కదా, అదేమో అనుకుంటారు.

మేము నలుగురం అన్నదమ్ములం. ముగ్గురు చెల్లెళ్లు. అందర్ల్లోకీ నేనే పెద్దోణ్ని. నిడిజివ్విలోనే ఐదో తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత ఎర్రగుంట్ల స్కూలు. గొప్పలకు ఎందుకు పోవాల? యావరేజ్ స్టూడెంట్‌నే. తిరుపతి, ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో పీయూసీ చదివిన. అప్పట్లో దాన్ని డబ్బా రేకుల కాలేజీ అనేవాళ్లు.

ఫీజులేని డాక్టరుగా...
మా కుటుంబంలోగానీ, మా బంధువుల్లోగానీ ఎవరూ పెద్ద చదువు చదివింది లేదు. మా తండ్రి కోరిక ఏమంటే నేను డాక్టర్ చదవాలని. ఎంబీబీఎస్ డొనేషన్ కోసం లెక్క కూడా కూడబెట్టినాడు. గుల్బర్గాలో అయితే ఐదువేలు, కాకినాడలో అయితే పదివేలు. అయితే నాకు 82 శాతం మెరిట్ మీదనే కర్నూలు కాలేజీలో సీటు వచ్చినాది.

హౌస్ సర్జెన్సీ అయిపోతానే ఐదు సంవత్సరాలు ఎర్రగుంట్లలో ప్రాక్టీస్ చేసినాను. పరీక్ష చేయిచ్చడమూ, వాళ్లకు కావాల్సిన మందులో, ఇంజెక్షన్లో రాయిచ్చడమో చేసేవాణ్ని. కన్సల్టేషన్ ఫీజు తీసుకునేది లేదు. మొదట్నుంచీ ఉన్నోళ్లమే కాబట్టి, వాళ్లిచ్చే రెండ్రూపాయలో, మూడ్రూపాయలో తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇది నాకు కొంత పాపులారిటీ తెచ్చిపెట్టింది. రాజకీయాల్లోకి వచ్చాక ప్రాక్టీస్ మానేసినాను. కొందరైతే సలహా గూడా ఇచ్చినారు, ‘రోజూ ఓ గంటన్నా ప్రాక్టీస్ చేయగూడదా’ అని. న్యాయవాది రాజకీయాల్లో ఉన్నాగని ఫరవాలేదు. డాక్టర్‌కు ఏడ కుదురుతుంది? క్లైంట్ వెయిట్ చేస్తాడుగానీ పేషెంట్ ఆగలేడు కదా!

పుస్తకం చదువుకుని బాధ్యతలు తెలుసుకున్నా...

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే కాబట్టి, మెడికల్ కాలేజీలో స్టూడెంట్ రిప్రజెంటేటివ్‌గా ఉంటి. తండ్రి చనిపోయిన తర్వాత ఊరికి సర్పంచ్‌గా చేసినాను. తర్వాత కమలాపురం సమితి అధ్యక్షుడిగా పదివేల ఓట్లతో గెలిచినా(1981-85). అప్పుడు నాకు 32 ఏళ్లు. చిన్నవయసుగదా ఏం చేస్తాడో, ఎట్ల చేస్తాడో అని అందరికీ అనుమానముండె.

స్థానిక సంస్థల విధులేమిటి, ప్రెసిడెంటుగా ఏం చెయ్యాలి, అని రూల్స్ బుక్కు తీసుకోని చదివి, ఫస్ట్ మీటింగుకు పోతనే అధికారులతో మాట్లాడినా. అందులో ఉన్న బాధ్యతల ప్రకారం రివ్యూ చేసి, ‘ఫలానా చోట ఉంది చూసుకోలేదా?’ అనంగనే, ‘ఓయమ్మ ఈయన అసాధ్యుడే’ అనుకున్నారు. గ్రామాల్లో తిరగటం, మట్టిరోడ్లు వేయించటం, చదువు చెప్తాండారా లేదా అని స్కూళ్లు ఇన్‌స్పెక్ట్ చేయడం... అట్ల మంచిపేరే వచ్చింది.

స్టేజ్ ఫియర్‌తోనే రాయలసీమ ఉద్యమంలోకి...

ఆ సమయంలోనే ఎన్టీఆర్ ప్రభుత్వం తెలుగుగంగ పనులు మొదలుపెట్టింది. తెలుగుగంగ పేరు మీద నెల్లూరుకు, మద్రాసుకు దొంగదారిన నీళ్లు పోతాయి, రాయలసీమకు అన్యాయం జరుగుతుందేమో అని ఒక భయం మొదలైంది. ‘రాయలసీమ విమోచన సమితి’ అని మొదలుపెట్టి అప్పటి టీడీపీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి, లక్కిరెడ్డిపల్లె రాజగోపాలరెడ్డి, బద్వేలు వీరారెడ్డి రాయలసీమంతా పర్యటిస్తాన్నరు(కొంతకాలానికి రా.వి.స. ఆగిపోయింది. తర్వాత రాయలసీమ ఐక్య కార్యాచరణ సమితి బలం పుంజుకుంది).

ఎన్.శివరామిరెడ్డి, ఎన్.సి.గంగిరెడ్డి, మాసీమ రాజగోపాలరెడ్డి ఇంకా కొంతమంది నాయకులు, అందులో సీపీఐ, కాంగ్రెస్, అన్ని పార్టీలవాళ్లున్నరు. ‘యువకుడు కదా, ఓపిగ్గా తిరుగుతాడు, అఖిలపక్షం కన్వీనర్‌గా మైసూరారెడ్డిని పెడదాం’ అని పెద్దవాళ్లంతా నిర్ణయించినారు. అయితే నాకు స్టేజ్ ఫియరుండేది. ఐదు నిమిషాలు మాట్లాడాలంటే అరగంట ఆలోచించి ప్రిపేర్ అయ్యేవాణ్ని. తర్వాత స్టేజి మీద మాట్లాడడం అలవాటయ్యింది.
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పదివేల క్యూసెక్కులు పెట్టినారు. దాని సామర్థ్యం పెంచాలనేది ప్రధాన డిమాండు. తర్వాత శ్రీశైలం కుడికాలువ చిత్తూరు జిల్లాకు పొడిగించాలనీ, ఉద్యోగాల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందనీ, కృష్ణానది నికర జలాల్లో వాటా కావాలనీ, రేణిగుంట నుంచి గుంతకల్లుకు రైల్వే డబ్లింగ్ లైన్ కావాలనీ, కడప ఆకాశవాణిని అభివృద్ధి చేయాలనీ, థర్మల్ స్టేషన్ కావాలనీ డిమాండ్లు పెరిగిపోయినాయి. అయితే ప్రత్యేక రాష్ట్రం కావాలని మాత్రం కోరలేదు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నొక్కి చెబుతున్నా... రాష్ట్రంలో ఉంటూనే అభివృద్ధి కావాలనుకున్నాం.

పాదయాత్రలు ఎట్ల జేస్తారు?
ఉద్యమంలో భాగంగా రాయలసీమ ఉద్యోగుల సంఘాలతో కలిసినాం. యూనివర్సిటీ హాస్టల్స్‌కు వెళ్లి విద్యార్థులను కూడగట్టినాం. పత్రికల ఎడిటర్లను కలిసి సమస్యలు ఏమిటో వివరించినాం. నాలుగు జిల్లాల్లో ధర్నాలు చేసినం. సభలు జరిపినం. అయితే డిమాండ్లను ఎట్ల ప్రజల్లోకి తీసుకొనిపోవాల? పాదయాత్ర చేస్తే గ్రామగ్రామాన చెప్పొచ్చు కదాని ఆలోచించినాం.


మరి పాదయాత్రలు ఎట్లా జేస్తారు? ఏదో మఠాధిపతులు చేయడము చూసినాముగానీ రాజకీయ నాయకులు పాదయాత్ర ఏరకంగా చేస్తారో తెలీదు కదా! గాంధీజీ దండి సత్యాగ్రహం బుక్కు గూడా సంపాదించి చదివినా. ఏయే ఊర్లున్నాయి, ఎట్ల నడవాలి, ఎక్కడ ఆగాలి అని ప్లాన్ వేసినాం. తిరుపతి నుంచి కదిరి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, మైదుకూరు మీదుగా పోతిరెడ్డిపాడు వెళ్లాలని ఐడియా. ఇదే వైఎస్ రాజశేఖరరెడ్డికి చెప్పినాం. ఎంవీ రమణారెడ్డి కూడా మంచి ఆలోచనే అన్నాడు. అప్పుడింకో సమస్యొచ్చింది. ఇంతమంది నాయకులు ఎట్ల వెళ్లడం?


అందుకే మరో ఆలోచన జేసి, తిరుపతి(నేను), లేపాక్షి (వైఎస్
రాజశేఖరరెడ్డి), కళ్యాణదుర్గం(ఎం.వి.రమణారెడ్డి), ఆదోని(రఘునాథరెడ్డి), కదిరి(సీహెచ్. చంద్రశేఖర్‌రెడ్డి) నుంచి ప్రారంభమయ్యేట్టుగా ఐదు గ్రూపులు చేసినాం. అన్ని గ్రూపులూ నంద్యాలలో కలిసి ఆడనుంచి పోతిరెడ్డిపాడుకు వెళ్లాలనేది ఆలోచన. అదే ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్రలకు నాంది అని చెప్పుకోవచ్చు. రోజుకు సగటున 20 కిలోమీటర్లు నడవాలనేది ప్రణాళిక. ఒకరోజు 18 రావొచ్చు, ఒకరోజు 22 రావొచ్చు, కాని మొత్తంగా 420 కిలోమీటర్లను 22 రోజుల్లో పూర్తిచేయాలి.

వెంబడి టెంట్లు, భోజనాలు ఇలా ఏమీ తీసుకెళ్లింది లేదు. కొంచెం పెద్ద గ్రామం చూసుకోవడం, అక్కడే గ్రామస్తులు వండిపెట్టిన పులగమన్నమో, పప్పో తినడం, బడి లాంటిది చూసుకుని పడుకోవడం... వెళ్తూ గ్రామస్తులకు సమస్యలు అర్థమయ్యేట్టు జెప్పడం... దీంతో రాయలసీమ ఉద్యమానికి ఒక ఊపొచ్చింది. తర్వాత వివిధ దశల్లో, వివిధ ప్రభుత్వాల్లో మేము పెట్టిన డిమాండ్లు చాలామట్టుకు పూర్తవుతూ వచ్చినై.

బొక్కల దవాఖాన
సమితి ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే రాయలసీమ ఉద్యమం మొదలైంది. అది సహజంగానే రాజకీయంగా ఎదగడానికి తోడ్పడింది. అందువల్లే కమలాపురం నుంచి ఎమ్మెల్యే ఎన్నిక సేఫ్ ల్యాండింగ్ అయింది. అప్పుడు ఎన్టీఆర్ హవా ఉన్నప్పటికీ, టీడీపీ అభ్యర్థి సీతారామయ్య మీద 35,000 మెజారిటీతో గెలిచినాను(1985).పాత బిల్డింగులో శాసనసభ మొదటి సమావేశం. బీజేపీ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతున్నాడు. నిజాం ఆర్థొపెడిక్ హాస్పిటల్ గురించిన అంశం అనుకుంటా. బొక్కల దవాఖాన అన్నాడు. ఇదేంది బొక్కలు అంటాండడు అనుకున్నా. ‘ఏంది ఇంద్రసేన్ ఏదో బొక్కలు అంటివి?’ అని అడిగితి. ‘బొక్కలు బొక్కలు అవే బోన్స్’ అన్నాడు. ఓహో, శాసనసభలో మన భాష మనం మాట్లాడుకోవచ్చు!

రాయలసీమ భాషంటే జంకూగొంకు ఉండే. ఉంటాదిగదా! అప్పట్నుంచీ భాష ఏం మాట్లాడతాండరు అని ఎప్పుడూ ప్రాధాన్యం ఇయ్యలే. వాళ్లు మాట్లాడేదాంట్లో సబ్జెక్టుందా లేదా ఇదే చూస్తాంటి. తర్వాత మైసూరారెడ్డి మాట్లాడితే సామెతలు, పిట్టకథలు చెబుతాడని నా భాష కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పటికీ మాట్లాడేటప్పుడు ఏదైనా కొత్త అంశం మాట్లాడగలమా? అని ఆలోచన జేస్తా. ఒకసారి రాజ్యసభలో జ్యుడీషియల్ అకౌంటబిలిటీ బిల్లు ఇంట్రడ్యూస్ అయింది.

అందులో అస్సెట్స్ డిక్లరేషన్‌కు సంబంధించిన ఒక క్లాజ్ ఉన్నింది. ఏందిరా అనంటే హైకోర్టు జడ్జీలు, కిందిస్థాయి జడ్జీలు వారి ఆస్తులకు సంబంధించిన వివరాలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులందరూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తేమో రాష్ట్రపతికిస్తాడు. ఇవన్నీ ఎలా ఇస్తారు? సీల్డు కవర్లలో! అందరూ సీల్డు కవర్లలో ఇస్తే ఇంగేంటికి? ఇంట్లో బీరువాలో పెడితే పోతాదిగదా అని పాయింట్ లేవనెత్తినాను. దాంతో బిల్లు వెనక్కిపోయింది. అప్పుడు బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ ‘రెడ్డీ, హౌ డిడ్ యు గెట్ దట్ పాయింట్? అర్ యు యాన్ అడ్వొకేట్ ఆర్ వాట్?’ అన్నారు.

చీటీలో మంత్రిపదవి
అప్పుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రి. కాకి మాధవరావు ఆయన పర్సనల్ సెక్రటరీ. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో రాజభవన్‌లో ప్రమాణస్వీకారం అయిపోయి, గ్రూప్‌ఫొటో అయిపోతానే, ‘పోండి, మీ పోర్టుఫోలియోస్ ఆ రూములో ఉన్నాయి చూసుకోపోండి’ అన్నాడు మాధవరావు. వినూత్నంగా ఉండాలని వాళ్లు రాత్రే చీటీల్లో రాసిపెట్టినారు. ఆ రూములో కొంచెం లైటింగ్ తక్కువుంది. చూస్తే హోమ్ అని ఇంగ్లీషులో నాలుగక్షరాలే కనపడినాయి.

బయటికి వస్తానే చెంగారెడ్డి, అడ్వకేట్‌గదా, ‘ఏమయ్యా హోంమంత్రీ, సీఆర్‌పీఎఫ్ తెలుసునా, ఐపీఎస్ తెలుసునా’ అనే. యాదో తెలిసినకాడికి తెలుసులే, లేకపోతే వాళ్లే నేర్పిస్తారుగదాంటి. (లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది కాబట్టి) అప్పటికి అది అంత ప్రాధాన్యత గల శాఖ కాదు. మావాళ్లంతా గూడా ఇదేంటికి, చిన్న శాఖైనా సరే ఇంకేదైనా మార్పించుకో అన్నారు. సర్లేబ్బా ఏదో ఇచ్చినారు, దాన్నే మెప్పించేట్టు పనిచేసుకుందాం అంటి.


నేదురుమల్లి నన్ను హోం మినిస్టర్‌గా ఎంపిక చేయడమే కాకుండా, ఫ్రీహ్యాండ్ ఇచ్చినాడు. నిజాయితీపరున్నని ఆయనకు ప్రత్యేక అభిమానం. అప్పుడు ఐజీ(లా అండ్ ఆర్డర్) వీరనారాయణరెడ్డి ఉండే. దూరపు బంధువు గూడా. ఏదో మీటింగ్ అయిపోయాక చనువుకొద్దీ
‘హోంమంత్రి అయినావుగదా, రాయలసీమ ఆందోళనలో నిన్ను చిత్తూరులో లాకప్‌లో ఏసి కొట్టినాడుగదా, ఆయన గుర్తున్నాడా? ఆయనదేమైనా పనివుంటే జేస్తావా?’ అన్నాడు. రూల్స్ ప్రకారముంటే ఆయనకొచ్చేది ఆయనకిద్దామంటి. ఆయన ప్రమోషన్ పెండింగులో ఉండే. ఓకే చేస్తి. దాంతో నేనేదైనా నార్మ్స్ ప్రకారం చేస్తానని పోలీసుల్లో అభిమానం పెరిగింది.
అట్లనే అప్పుడు నక్సల్స్ యాక్టివిటీస్ ఎక్కువ. ల్యాండ్‌మైన్స్‌లో పోలీసులు చనిపోతాండిరి. దాంతో పోలీసుల్లో భయం ఉంటుండె. చనిపోయినా వాళ్ల శాలరీ కంటిన్యూ అయ్యేట్టుగా నిర్ణయం తీసుకుంటిమి. అలాగే ఐదేళ్ల తర్వాత ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందంటే ఆ ప్రమోషన్ శాలరీ ఇచ్చేది. రిటైర్ అయితే రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేట్టు చేస్తిమి. ప్రాణం ఇవ్వలేముగాని ఉద్యోగ భద్రత కల్పించినాం. దాంతో పోలీసుశాఖలో గౌరవం పెరిగింది. ఈ విధానాన్నే తర్వాత కేంద్రం ఛత్తీస్‌ఘడ్ లాంటి రాష్ట్రాల్లో అమలుచేస్తోంది.


వైఎస్ నన్ను ‘డాక్టర్’ అని సంబోధించేవారు
రాజశేఖరరెడ్డిని నేను ‘సార్’ అనీ, ‘ఏమండీ’ అనీ పిలిచేవాణ్ని, ఆయన నన్ను ‘డాక్టర్’ అని పలకరించేవారు. కడపలో అందరమూ కాంగ్రెస్‌వాళ్లమే అయినా కందుల ఓబుల్‌రెడ్డిది ఒక వర్గం. బద్వేలు శివరామకృష్ణయ్య, రఘురామిరెడ్డి, నేను... మేమంతా వైఎస్ వర్గం. అయితే 1989,90 ప్రాంతం నుంచి నాకూ, వైఎస్‌కూ కొన్ని కారణాల వల్ల డిఫరెన్సెస్ వచ్చి ఇద్దరి మధ్యా గ్యాప్ పెరిగిపోయింది.

అయినాగూడా వైఎస్ నా రెండో కుమారుడి పెళ్లికి వచ్చినాడు. ఒకసారి అనుకోకుండా ఢిల్లీ నుంచి ఒకే ఫ్లైట్‌లో వస్తుంటే కలిసినాము. కరువు ప్రాంతాలకోసం ఏం చేస్తే బాగుంటుందని అడిగినాడు. నేను పశువుల గడ్డి, తాగునీరుకు సంబంధించి కొన్ని సూచనలు చెప్పాను. అదే అనుకుంటా ఆయన్తో చివరిసారి మాట్లాడటం.




ప్రొఫైల్...
పూర్తి పేరు : మూలె వెంకట మైసూరారెడ్డి
తల్లిదండ్రులు : సుబ్బమ్మ, బాల మైసూరారెడ్డి
జన్మదినం : 28.2.1949
జన్మస్థలం : కడప జిల్లా నిడిజివ్వి
వృత్తి : కర్నూలులోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేశాక డాక్టర్‌గా ప్రాక్టీస్ చేశారు.
భార్య : స్వరూప
పిల్లలు : ఇద్దరు కుమారులు; హర్షవర్ధన్‌రెడ్డి, రఘుకార్తీక్‌రెడ్డి (ఒకరు ఇంజినీరింగ్, మరొకరు డిగ్రీ చదివారు. మైనింగ్ బిజినెస్‌లో ఉన్నారు.)
నియోజకవర్గం : కమలాపురం
ఎమ్మెల్యే : 1985-94; 1999-2004
హోం, ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ : 1990-94
సందర్శించిన దేశాలు : చైనా, దక్షిణ కొరియా, మలేషియా, సింగపూర్, శ్రీలంక, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ.

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...