Tuesday, April 2, 2013

రాయలసీమ ప్రాంత చైతన్య కవిత్వము- సుంకి రెడ్డి నారాయణ రెడ్డి

1980 థకంలో సీమ చైతన్య ఉద్యమాలు ప్రారంభమయిన తర్వాత కొత్తతరం కవులు వచ్చినారు. సీమ వాస్తవికతను రచనలుగా మలచడం అధికమైంది. రాయలసీమ చరిత్రలో నూతనాధ్యాయం మొదలయ్యింది. కవులే కాక, కథారచయితలు, మేధావులు, కూడా సీమ వేదనను కవిత్వంలో ఆవిష్కరించారు. రాయలసీమ జీవితమే ఇతివృత్తంగా జూపల్లి ప్రేంచంద్‌ ''ఆవేద'' రఘుబాబు ''సంఘటిత స్పర్శ'' వై.శ్రీరాములు ''జలగండం'' అనే దీర్ఘ కవితలు రాసినారు. ఈ రెండు థాబ్ధాల కాలంలో వచ్చిన కవుల లిస్టు చాలా పెద్దదే. కొంతమందిని పేర్కొంటాను. పులికంటి కృష్ణారెడ్డి, శాంతినారాయణ, ఎస్‌.మునిసుందరం, రాచపాలెం చంథ్రేఖరరెడ్డి, సూర్యసాగర్‌, శ్రీనివాసరెడ్డి, హెచ్చార్కె, దాదాహయత్‌, రాప్తాడు గోపాలకృష్ణ, వి.ఆర్‌.రాసోని, నరాల రామిరెడ్డి,సన్నపురెడ్డి వెంకట్రాంరెడ్డి, రాధేయ శశిశ్రీ, గుడ్లపల్లి చిదంబరరెడ్డి, మల్లెల నర్సింహ్మామూర్తి, ఎస్‌.జయ, ఏ.ఎన్‌.దస్తగిరి, కెఎం.రాముడు, గోపిని కరుణాకర్‌, నాగప్పగారి సుందర్రాజు, సుంకోజు దేవేంద్రాచారి, నూకా రాంప్రసాదరెడ్డి, జి.వెంకటకృష్ణ, శాంతికుమార్‌, ఎస్‌. రామచంద్ర, రాజారామ్‌, బిక్కికృష్ణ. షమీవుల్లా, నిర్మలారాణి, శశికళ, సాయిప్రసాద్‌ మొ|| వారు.
ఇక ఈ కవులు రాయలసీమ తమ కవిత్వంలో ఎట్లా పట్టుకున్నారో పరిశీలిద్దాం.
ఆదురు చూపుల ఎడారి వాసులకు ఎండమావి
శ్రీభాగ్‌ ఒప్పందం
స్వార్ధం పులుముకొని రంగులు మార్చే
రాజకీయ ఊసరవెల్లులు
అభివృద్ధికి వారసులై
మిమ్ము నిస్సహాయంగా గెంటేసి నపుడు
ఒప్పందాలు నీటిమీద రాతలే
నెత్తురు కార్చేసీమ -నేల పగిలిన సీమ (ఏ.ఎన్‌)
రాయలసీమ అభివృద్ధికి మూలం కావలసిన శ్రీభాగ్‌ ఒప్పందంలో ప్రధానాంశం నదులపై ప్రాజెక్టులు నిర్మించడం. అది జరుగలేదని ఇక్కడ కవి ఆగ్రహిస్తాడు.

నాగరికతలు నీళ్ళలోనే ప్రవహిస్తాయి. చరిత్రను ఏటి అలలే రాస్తాయి నీళ్ళ కారణంగానే, నీటి ప్రాజెక్టుల కారణంగానే కోస్తాంధ్ర 'నాగరిక' ప్రాంతమైనందున అవి లేని కారణంగానే సీమ అనాగరికమైందని ముని సుందరంగారంటున్నారు. గౌతమి, కృష్ణవేణులు సాగరంలో పడి ఆత్మ హత్యంచుకుంటున్నాయి

రాయలసీమ కరువు సీమగా విసిరేసి నదులున్న ధగా సముద్రంలో కలుస్తున్న వైనాన్ని జూపల్లి ప్రేంచంద్‌ కవితాత్మకంగా చెప్పినాడు. నీటి ప్రాజెక్టులు కట్టని పాలకుల నిర్లక్ష్యాన్ని ఇక్కడ సూచిస్తున్నాడు. ఇక్కడి ఊర్లపేర్లన్నింటి చివర సముద్రమే కాని సముద్రమెక్కడా లేదంటాడు మరోకవి.
వానమాట విన్పిస్తే చాలు
చెవులు అలుగుల్ని సవరించుకునే చెరువులవుతున్నాయి. అన్న సన్నపురెడ్డి వెంకట్రాంరెడ్డి, పై కవులూ ఇంకా చాలా మంది కవులు వర్షాధార ప్రాంతమైన సీమకు నీరెంత ముఖ్యమో వాన ఎంత ప్రాణప్రదమో వైశ్రీరాములుఈ నీళ్ళ మీదనే కావ్యం రాశాడు. ఇటు ప్రాజెక్టులు కట్టక, అటు చాలాకాలంగా వానలు పడక సీమ గిలగిల కొట్టుకుంటున్నది. ఈ స్థితిని కవులు హృదయ విదారకంగా చిత్రించినారు.
రాజకీయం నెత్తుటి మడుగు :
అందులో దాహం తీర్చుకునే ప్రతిఫలినీ అడుగూ.........
డేగల రాజ్యంలో / 
కోయిల ఊసెక్కడిది....../ 
సీమ నిర్మల భూముల్లో / 
రైతు రాతి వాసన వేస్తాడు....... నాగలి/ 
ఆకలితో జచ్చిన పాముల్లా పడి వుంటుంది. రాళ్ళవలేనాన్ని జ్వాలకు / 
అనువాదం నా కవిత్వం..... కరువును కవితాత్మకంగా చెప్పిన మల్లెల నరసింహ్మామూర్తి ''వర్తమాన రాయలసీమ కవుల్లో ప్రముఖుడు.
నా సీమ వర్తమాన చరిత్ర 
జీవరసం ఇంకి
పోయిన మట్టి చరిత్ర 
 నేతల నిర్లక్ష్యపు చూపు
ల్లోంచి జారినపాత్ర. అంటాడు రాధేయ -
కాసంత వానపడదా - అని 
తోట్లో కాసుకుని
కూకుండే
కాసిన పూత రాలిపాయే 
వావికండ్లు
మాత్రం కాయలు కాసే'' 
అంటాడు సడ్లపల్లి చిదంబరం రెడ్డి.
''ఈ ఎడారిలో మొలిచే ప్రతి ఇసుక రేణువు చేజారి పోతున్న ఒక సంకటి ముద్దకు ఆనవాల్లు'' అంటాడు దాదా హయత్‌.
నాన్నను ఆశపెట్టని బావి
ఇప్పుడు నిన్ను మోసం చేస్తుందా తమ్ముడూ అంటున్నది. ఎస్‌.జయ.

రాయలసీమ మా తల్లి......
పది మట్లబావులు కూడా బావురుమంటున్న వెత నీది
సుగ్గిలో కూడా ఆకలి తీరని అభాగ్యం నీది'' 
అంటాడు సూర్యసాగర్‌.
''రుతువులైన్నైనా మారాళ్ళసీమకు ఒకే రుతువు -కరువు రుతువు 
 కాలాలెన్నైనా మా బీళ్ళ సీమకు ఒకే కాలం - ఎండాకాలం'' 
అంటాడు వై. శ్రీరాములు.
 ''సేద్యం జూదమై పోయింది 
మా అమ్మ మెడలోని తాళిబొట్టు పసుపు కొమ్మైంది... 
మా తాత బస్టాండులో బిచ్చగాడై పోతు'' 
అంటాడు గోపిని కరుణాకర్‌.
''ఇక్కడ నీళ్లు లేవు 
 కన్నీళ్ళు లేవు 
 సిరి సంపదలు లేవు
 చలువ పందిళ్ళు లేవు
 తరాల బండరాళ్ళ వలె
 మొండి బ్రతుకులున్నాయ్‌ - 
అంటాడు మునిసుందరం.
కడుపులో ఆకలిని 
డప్పు అంచుతో అణచి పెడుతున్నట్టు
పొట్టకు హత్తుకొని డప్పువాయిస్తున్నాడు''
అంటాడు వి.ఆర్‌.రాసాని.
వురితాడు పేనిన పత్తి
 పురుగు మందు తాపిన వుల్లిగడ్డ 
బతుకులా బజారు పాలైన
 రేటు పలుకని టమోటా.......
వూడలు దిగని వేరు శెనగ
బోరులో పడ్డ బాల్యంలా వుక్కిరి బిక్కిరి చేసి చంపుతున్నది
 సేద్యం బతుకు సీమ రైతును ఆదుకొని ప్రతి పంటా మృత్యు హస్తం కావటాన్ని బలంగా చెబుతాడు జి.వెంకటకృష్ణ. 1998 నుండి మొదలై వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న వాస్తవానికి వ్యక్తీకరణ ఈ పంక్తులు.

ఈ సీమ వస్త్ర కళానైపుణ్యంలో 
 రూపుదిద్దుకున్న ధర్మవరం పట్టు చీరెలు
ఆకలి చావులకు ఆలవాలమై అని కరువుకూ చేనేత కార్మికుల చావుకు గల సంబంధాన్ని చెబుతాడు రాధేయ.

ప్రాజెక్టులు కట్టక, వానలు గురువక కరువులో తల్లడమల్లడమైన రైతులు తమ ప్రాణంలో ప్రాణమైన పశువుల్ని, తమకు జీవనాధారమైన పశువుల్ని కబేళాలకు తెగనమ్మిన దృశ్యాన్ని, చనిపోయిన దృశ్యాన్ని ఇక్కడి కవులు కళ్ళకు కట్టినారు.
బతుకు అప్పుల పాలై
కండ్ల బావుల్లో కన్నీరు ఒకతా వుండేది
తల్లి పాలకు నోసుకోని నీకు పాలిచ్చి
నీ ప్రాణాలను నిలబెట్టిన పెద్దావు
బర్రెముకలు బయటపడి
నీ ఫోటో కల్ల జూస్తా పాణిమిడిసిందిరా........
అని తండ్రి గోపినికి రాసిన మాటలు
తడారిన గొంతుతో నేనూ నేల
గడ్డి కోసమని కసాయి వాని వెంట నడిచిన పశువులు.
అన్న నూకా రాంప్రసాద్‌ రెడ్డి మాటలు కరువు సీమ మనుషుల్నే కాదు పశువుల్లో ఎట్లా తరిగిందో తరిమిందో చెబుతాయి.
 కవులు ఈ దృశ్యాల్ని చిత్రించకపోతే లోకాని కెలా తెలుస్తుంది. సీమ అంటే లోకానికి ఒకనాటి రతనాల సీమో, ఇప్పటి బాంబుల సీమో అనేదే తెలిసి వుండేది. అందుకని కవి ఆయా కాలాన్ని రికార్డ్‌ చేసే చరిత్ర కారుడు కూడా.

మాకు 
కరువు చావుకన్నా
ఆకలి చావు కన్నా
వరద ఎంతో సుఖమనిపిస్తుంది.
 అన్న రాచపాలెం కవిత్వంలో చాలా లోతయిన అర్ధముంది.
వరద చావు క్షణాల్లో జరిగి పోతుంది. యాతన వుండదు. పైగా సానుభూతిని సంపాదిస్తుంది. మిగిలిన వాల్లకైనా వరద సహాయ నిధులు అందుతాయి. లోకం అయ్యో అంటుంది. కాని కరువు చావు నలిపిన రోగిలా మెల్లమెల్లగా జరుగుతుంది. లోకం దృష్టినీ, సానుభూతినీ, నిధుల్ని ఆకర్షించదు. ఎప్పుడు వరదలు వచ్చినా ప్రభుత్వం ఉద్యోగుల్నుండి వరద సహాయం ఒక రోజు జీతం వసూలు చేసి వాళ్ళకు పంపిస్తుంది. కాని కరువు సహాయంగా ఎప్పుడన్న చేసిందా? రెండు చావులే కాని సీమ చావులు ఆదరణ పొందని చావులు రాయలసీమ లోని మరొక ముఖ్య సమస్య ఫ్రాక్ష్యనిజం. శతాబ్ధాల కింద ఏర్పడే పాలెగాళ్ళ వ్యవస్థ స్థానంలో ఆధునిక ప్రజాస్వామిక విలువలు రాక పోవడం కూడా దీనికి కారణం. ఈ సమస్య గురించి సీమకవులు సరియైన రీతిలో స్పందించారు.
''ఇక్కడ విత్తనాలు చల్లినా 
 మొలిచేది కొడవళ్ళు,
గొడ్డళ్ళు 
 ఇక్కడ 
 రేపటి బిడ్డ పలికేది బి.ఫర్‌ బుక్కుకాదు బి.ఫర్‌ బాంబ్‌ 
అన్న రాచపాలెం మాటల్లో పిల్లలు దాగుడుమూతలాడు తుంటాయి నాటు బాంబులు. అని ప్రొ|| శ్రీనివాసరెడ్డి వాక్యాల్లో మా ఫ్రాక్షనిజం పట్ల అసహానం ఆగ్రహం కన్పిస్తుంది.

రాయలసీమ భాషను కథా రచయితలు పట్టుకున్నట్లుగా కవులు పట్టుకోలేదు. కవిత్వంలో అక్కడక్కడ మాత్రమే కన్పిస్తుంది. ఒకటి రెండు ఉదాహరణలు చూద్దాం..........
సిన్నోడికి పాలు బడదామంటె
ఆలి చన్నులు వడబారి యాలబడినాయి
అమ్మకడుపుకాడ సెర్మం (బీడు బడిన నేల మాదిరి గుండాది .....వాన కురిసే ...పల్లె తడిస్చె) కాల్వలు పద్దాలు పాడ్తే......పైన గడిమోడమొస్చే ) నా ఆలికి సీరగా సుట్టుదామని కాసుక్కూచునుండా ) వాన వస్తదో రాదో అన్న మహమూద్‌ కవితలోనూ... ధాన్యం తూర్పోయడానికి...... దడాన కానీండ్రా....... తూర్పోసారు. మూటలు నింపారు...... కొట్ట డీ యిల్లు భర్తీ చేశారు...... (అబ్బబ్బ ఒళ్ళంత నొప్పులు ( పై కావువత్తు కుంటుందెమో........) / రెండు పిచ్చల వింత పండుని/ రెండు ఉప్పరాల్ని.......అన్న దస్తగిరి కవిత ల్లోనూ ఇంకా గోపిని వంటి కవుల కవితల్లోనూ సీమ భాషను చూడవచ్చు. కోస్తాంధ్రులు తమ భాషను సంస్కృతిని తక్కువ చూస్తున్నారని 1931 లోనే గమనించిన సీమ వాసులు తమ భాష పట్ల అభిమానం పెంచుకోలెందుకో తెలియదు. సీమలోని దారిద్రానికి, కరువుకు, వివిధ రంగాల వెనుక బాటుకు ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారంగా వాళ్ళు భావించలేదు. వాళ్ళ అసంతృప్తిని అసహనాన్ని అగ్రహాన్ని రాజకీయాల మీద ప్రదర్శించినారు. ఈ కింది కవితలు ఆ విషయాన్ని తెలుపుతున్నది.

''మమ్ము / పీనుగులను చేసి ఆడుకునే శత్రువులు ఇద్దరే ఇద్దరు(ఒకరు కరువు రక్కసి మరొకరు రాజకీయ వ్యూహం'' రఘుబాబు. ఐదేండ్లకు ఒకసారి ఆవులించే విమోచన సమితి అడ్డపంచకింద అణుబాంబులు భద్రపరిచింది.
- నాగప్ప గారి సుందర్రాజు.
పదవి ఊడిన వాడి నోట సీమ బాదల బోసిపాట నాలోపల నేను పెను వికటహాసమవుతాను - హెచ్చార్కె (హనుమంతరెడ్డి).
అక్కడక్కడ కవులు తిరుగుబాటును ఆశించారు.
ఉదా|| తాను నాటేప్రతి గింజమీద
గిట్టుబాటు ధర ముద్రించక పోతే
ఆధునిక దోపిడి అందమైన ముఖాన్ని
ఖండఖండాలుగా చీల్చేందుకు
నాగలి మొన నూరుతున్న వీరుడు
ఇది సంక్షిప్త రాయలసీమ ప్రాంత చైతన్య కవిత్వము.


No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...